Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మేరీ కోమ్.. ఒక సెరెనా.. ఒక సానియా మీర్జా.. ఒక లాల్వెంట్ లుయాంగీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో మహిళలు చరిత్రలో తమ స్థానాన్ని పదిలంగా దాచుకున్నారు. ప్రపంచ స్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు. పెండ్లి తర్వాత జీవితం మారుతుందనుకుంటారు. కానీ అలాంటిదేం లేదని తేల్చిచెప్పారు కొందరు మహిళలు. ఆశయాలను అర చేతులతో పట్టుకొని చంటి బిడ్డలతో బంగారు పతకాలను గెలిచిన ఘనత చరిత్రలో లేకపోలేదు. వాళ్ల జీవితమే మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.
సానియా మీర్జా...
రెండేళ్లకు పైగా విరామం తర్వాత తిరిగి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్న భారత టెన్నిస్ తార సానియా మీర్జా అసాధారణ విజయం సాధించారు. తల్లి అయిన తర్వాత ఆడిన తొలి టోర్నీ 'హౌబర్ట్ ఇంటర్నేషనల్'లో ఉక్రెయిన్కు చెందిన నదియా కిచోనోక్తో కలసి డబుల్స్ టైటిల్ గెలుపొందారు. ఆస్ట్రేలియాలోని హౌబర్ట్లో ఈ నెల 18న జరిగిన ఫైనల్లో సానియా-నదియా ద్వయం 6-4, 6-4తో విజేతగా నిలిచింది. ఈ నెల 14న టోర్నీ తొలి రౌండ్లో గెలిచిన తర్వాత తన కొడుకు ఇజాన్తో ఆనందాన్ని పంచుకొంటున్న ఫొటోను ట్విటర్లో పెట్టి, తన జీవితంలో అత్యంత విశేషమైన రోజుల్లో ఇది ఒకటని సానియా రాశారు. నమ్మకమే విజయం వైపు నడిపిస్తుందని అందులో చెప్పారు. ''బిడ్డా, మనం సాధించాం'' అని కొడుకును ఉద్దేశించి అన్నారు. క్రీడల్లో 'పునరాగమనం' అనే మాట మగవారి కంటే ఆడవారికి ఎక్కువ విస్తృతమైన అర్థంలో వర్తిస్తుంది. సాధారణంగా ఆటగాళ్ల విషయంలో పునరాగమనం అంటే గాయం, విరామం లేదా నిషేధం తర్వాత తిరిగి రావడం. అదే క్రీడాకారిణులకైతే మాతృత్వం అనే కోణం కూడా ఉంటుంది. మాతృత్వాన్ని గతంలో చాలా కాలం క్రీడాకారిణులకు ఒక ఆటంకంగా భావించేవారు. క్రమంగా పరిస్థితి మారుతూ వస్తోంది. రికార్డులను బట్టి చూస్తే గత కొన్నేళ్లలో పలువురు మహిళలు ప్రసవం తర్వాత అసాధారణ రీతిలో తిరిగి రాణించారు.
సెరెనా విలియమ్స్...
23 సార్లు గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన సెరీనా విలియమ్స్ ప్రసవం తర్వాత ఆరు నెలలకు 2018లో ఘనంగా పునరాగమనం చేశారు. సెరెనా పట్టుదల, టెన్నిస్పై ఆమె ప్రేమ అంతా ఇంతా కాదు. సెప్టెంబరులో కాన్పు అయితే, డిసెంబరులోనే మళ్లీ టెన్నిస్ కోర్టులోకి దిగారు. ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత సెరెనా ప్రొఫెషనల్ సర్క్యూట్లోనూ ఆడటం మొదలుపెట్టారు. తనకు మొదటి సంతానం కలిగాక మళ్లీ పోటీలకు సన్నద్ధమవడం చాలా కష్టమైందని, అయినప్పటికీ సాధన చేస్తూ వచ్చానని.. తన ఆట ఉండాల్సినంత అత్యుత్తమంగా లేదనేది తనకు తెలుసని, కానీ మెరుగుపరచుకొని ఆ స్థాయిని చేరుకొనేందుకు శ్రమిస్తున్నానని'' తెలిపారు. ప్రతీ రోజు కొత్త రోజేనని, రోజు రోజుకూ తన ఆట మెరుగుపడాలని సెరెనా చెప్పారు. ఎంత వేగంగా పురోగతి సాధిస్తున్నానన్నది తనకు అంత ముఖ్యం కాదని, పురోగతే ముఖ్యమని వివరించారు. ఇప్పుడు చాలాసార్లు టెన్నిస్ సాధన సమయంలో, పోటీలు జరిగే చోట సెరెనాతోపాటు ఆమె కూతురు కనిపిస్తుంటుంది.
మేరీ కోమ్...
భారత ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ రెండుసార్లు ప్రసవం తర్వాత విజయాలతో పునరాగమనాన్ని ఘనంగా చాటారు. ప్రపంచ చాంపియన్షిప్లు గెలిచారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో బాక్సింగ్ క్వీన్ మణిపురి బాక్సర్ మేరీ కోమ్ చరిత్రను సృష్టించింది. అత్యధికంగా గోల్డ్ మెడల్ గెలిచిన మహిళా బాక్సర్గా మేరీ చరిత్రకెక్కింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో మేరీ కోమ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. 35ఏళ్ల మేరీ ఈ టోర్నీ ముందు వరకు ప్రపంచ చాంపియన్షిప్లో ఐదు స్వర్ణాలు, ఓ రజతం గెలుచుకుంది. తాజాగా ఏడో పతకాన్ని ఖాయం చేసుకుని టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మహిళా బాక్సర్గా ఘనత సొంతం చేసుకుంది. తన రికార్డులను తానే అధిగమిస్తూ: మహిళా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ముగ్గురి పిల్లల తల్లిగా తాను పొందిన ఆనందం కన్నా సాధించిన విజయాలే ఎక్కువ. అందుకే తాను మహిళలకు ఎంతో ఆదర్శం.
లాల్వెంట్ లుయాంగీ...
మాతృప్రేమ గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది మిజోరంకు చెందిన ఓ వాలీబాల్ ప్లేయర్. మ్యాచ్ విరామంలో ఏడు నెలల తన బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఆ తర్వాత మళ్లీ ఆటలోకి దిగి కర్తవ్యాన్ని పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆ క్రీడాకారిణిపై ప్రశంసలు కురిపించారు. మిజోరం స్టేట్ గేమ్స్లో తైకుమ్ వాలీబాల్ జట్టు తరఫున లాల్వెంట్ లుయాంగీ ఆడుతున్నది. తన ఏడు నెలల శిశువుతోనే పోటీకి దిగింది. ఆకలితో తన బిడ్డ ఏడ్వడం చూసిన ఆమె విరామం సమయంలో వాలీబాల్ కోర్టు సమీపంలోనే పాలిచ్చింది. నెటిజన్లు లాల్వెంట్ లుయాంగీని ప్రశంసలతో ముంచెత్తారు. విశేష స్పందన గమనించిన నిర్వాహకులు క్రీడలకు మస్కట్గా ఎంపిక చేశారు. మిజోరం క్రీడాశాఖ మంత్రి రోమావియా.. ఆ క్రీడాకారిణికి రూ.10వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. పిల్లలను కంటున్న లేదా కనాలనుకొంటున్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. ''మాతృమూర్తులు అత్యున్నత స్థాయిలో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నమే మనకు ఆదర్శం'' అని కిమ్ క్లిజ్స్టర్స్ వ్యాఖ్యానించారు.