Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరు దశాబ్దాలుగా ఆమె కలం సాక్షిగా అక్షరసేద్యం చేస్తూనే ఉన్నారు. వందలాది కథలు, కవితలు రాస్తూ సమాజంలోని అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె రచనల్లో అంతర్లీనంగా ఉండే సందేశం జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే చుక్కానిగా పనిచేస్తోంది. ఆమే ప్రముఖ రచయిత తమిరిశ జానకి. ఆమె రచనలు ఇతర భాషల్లోకి అనువదించారు. సాహిత్యంలోని అనేక ప్రక్రియల ద్వారా పాఠకులకు చేరువైన ఆమె పరిచయం..
నాన్న యర్రమిల్లి శ్రీకృష్ణమూర్తి, జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యారు. అమ్మ రుక్మిణి. మేం మొత్తం ఆరుగురు పిల్లలం. అమ్మనాన్న ఇద్దరూ సాహిత్యాభిలాష కలిగినవారే. ఇంట్లో ఉన్నంత సేపు నాన్న చేతిలో ఏదో ఒక పుస్తకం ఉండేది. అమ్మ ఖాళీ సమయంలో పిల్లల పుస్తకాలు, వారపత్రికలు చదివేవారు. అలా చిన్నతనం నుంచే పుస్తకం మాకు పరిచయమైంది.
ఏడాదికో చోట..
నాన్నకు ప్రతి ఏడాది ఎండాకాలంలో బదలీలు ఉండేవి. దాంతో మా చదువులు ఉమ్మడి రాష్ట్రంలోని అనేక చోట్ల జరిగింది. నిజామాబాద్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివాను. ఫస్ట్ ఇయర్ పరీక్షలు కాగానే ఇంజనీర్ పెండ్లి అయ్యింది. మా ఆయన తమిరిశ సూర్యనారాయణ అప్పారావుగారు ఉద్యోగరీత్యా ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉండాల్సి వచ్చేది. దాంతో నా చదువు ఆగిపోయింది.మా ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదివే సమయంలో 20ఏండ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేశాను.
ఆరోతరగతిలోనే..
నాన్న జడ్జి కావడంతో స్థానిక పత్రికలు చాలా వచ్చేవి. వాటిని తప్పనిసరిగా చదివేదాన్ని. అంతేకాదు స్కూలు గ్రంథాలయంలోని ప్రముఖుల రచనలన్నీ చదివాను. ఆరోతరగతి వచ్చేసరికే చాలా పుస్తకాలు చదివేశాను. చదవడం ఇష్టంగా మారడంతో భాష మీద పట్టు పెరిగింది. ఏడో తరగతిలో నాలోని భావాలన్నింటినీ చిన్న కవితగా రాసి నాన్నకు చూపించాను. అది చదివిన తర్వాత 'బాగా రాశావు. రాస్తూనే ఉండు' అంటూ నాన్న ప్రోత్సహించారు. ఇక అప్పటి నుంచి చిన్న కథలు, కవితలు రాసేదాన్ని. కాలేజీలో చదువుతున్నప్పుడు 'మంజువాణి' పత్రిక వాళ్ళు కథల పోటీ నిర్వహించారు. నేను రాసిన కథకు మొదటి బహుమతి వచ్చింది. 1964లో 'యువ' మాసపత్రికలో నా కథ అచ్చైంది. పెండ్లికి ముందు వై.జానకి పేరుతో నా రచనలు వచ్చేవి.
నాన్న ప్రోత్సాహం..
సాహిత్యరంగంలో నన్ను నాన్న ఎంతో ప్రోత్సహించారు అనడానికి చిన్న ఉదాహరణ చెప్పాలి. యువ పత్రికకు కథ రాసి పోస్ట్ బాక్స్లో వేయమని ఒకవ్యక్తికి ఇచ్చి పంపించాను. అతను బాక్స్లో వేసి వచ్చిన తర్వాత కవర్పై ఫ్రం అడ్రస్ రాయలేదని గుర్తుకు వచ్చి నాన్నకు చెప్పాను. వెంటనే నాన్న ఆ వ్యక్తిని పిలిచి 'పోస్ట్మ్యాస్ ఎప్పుడు వచ్చి బాక్స్ ఓపెన్ చేస్తాడో అప్పటి వరకు పోస్ట్బాక్స్ వద్ద ఉండి ఫ్రం అడ్రస్ రాయని కవర్ ఉంటే చూసి తీసుకురా' అని పంపించారు. ఆ తర్వాత ఆ కవర్ తీసుకురావడం, అడ్రస్ రాసి మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో విషయాల్లో నాన్న ప్రోత్సహించారు. పెండ్లైన తర్వాత మేం ఎక్కువ ఉత్తరభారత్లో ఉన్నప్పుడు నా కథలు ఏ పత్రికలో వచ్చినా నాన్న చదివి 'ఫలానా పత్రికలో నీ కథ వచ్చింది బాగుంది' అంటూ ఉత్తరం రాసేవారు.
దాదాపు నాలుగు వందల..
మంజువాణి పత్రిక కథల పోటీలో బహుమతి అందుకోవడం ఎంతో ప్రేరణను ఇచ్చింది. దాంతో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కథలు రాయడం పత్రికలకు పంపించడం చేసేదాన్ని. యువ, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, చుక్కాని, కృష్ణాపత్రిక ఇలా ఎన్నో పత్రికలకు పంపించేదాన్ని. అయితే ఆ రచనలేవీ దాచుకోలేదు. మా వారి ఉద్యోగరీత్యా ఎక్కువ చోట్లకు తిరగడంతో చాలా రచనలు పోయాయి. ఇప్పటి వరకు నాలుగువందలకు పైగా కథలు, మూడువందలకు పైగా కవితలు రాశాను. మూడు నాటికలు, పిల్లల కథలు, వ్యాసాలు, అనేక పుస్తక సమీక్షలు రాశాను. అందుబాటులో ఉన్న రెండు వందల కథలతో ఎనిమిది కథా సంకలనాలు తీసుకువచ్చాం. కవితలను రెండు సంపుటాలుగా వేశాం. ఇప్పుటి వరకు 16 నవలలు రాశాను. ఇందులో చాలా నవలలు వివిధ పత్రికల్లో సీరియల్స్గా వచ్చాయి. ఆంధ్రప్రభ వార పత్రికలో 'విశాలి' సీరియల్గా వచ్చిన తర్వాత నవలగా మార్కెట్లోకి వచ్చింది. అప్పుడు మేం కొయంబత్తూర్లో ఉన్నాం. నవల మార్కెట్లోకి విడుదలైన రోజే ఇద్దరు వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. ఆ నవలను సినిమాగా తీస్తాం కాపీ రైట్స్ ఇవ్వమని అడిగారు. ఆ తర్వాత అదే పేరుతో సినిమా వచ్చింది. ప్రివ్యూ ఫంక్షన్కు హైదరాబాద్కు పిలిచారు. ఆ ఫంక్షన్కు ముఖ్యఅతిథులుగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటులు ఎన్.టి.రామారావు, ఆయన భార్య బాసవతారకంగారు బాగా రాశారు అని మెచ్చుకోవడం సంతోషాన్నిచ్చింది.
ఆరు దశాబ్దాలుగా ..
చదువుకునే రోజుల్లో అంటే 1960 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తున్నాను. చదవడం, రాయడం ఏ రోజూ ఆపలేదు. నా జీవితంలో అవి అతి ముఖ్యమైన అంశాలుగా పెనవేసుకుపోయాయి. మా వారు 1982లో చనిపోయారు. అత్తింటివారు, పుట్టింటివారితో పాటు సాహిత్యమే నన్ను తిరిగి ఆ షాక్ నుంచి తెరుకునేలా చేసింది. జీవితంలో వచ్చే కష్టనష్టాలను ఎదుర్కొనే శక్తి సాహిత్యమే ఇచ్చింది.
అనేక అవార్డులు..
తెలుగు యూనివర్సిటీ నుంచి ప్రతిభా పురస్కారం, ఉత్తమ రచయితగా అవార్డు అందుకున్నాను. చెన్నై కేసరి కుటీరం వారి నుంచి 'గృహలక్ష్మీ స్వర్ణకంకణం', సిలికానాంధ్ర వారి పురస్కారం, కెనడాలోని తెలుగు అసోసియేషన్ అవార్డు, అనేక ఇతర అవార్డులు అందుకున్నాను.
సమస్యలు రూపాంతరం చెందుతూ..
ఆరు దశాబ్దాల కిందట మహిళల పాత్రకు ఇప్పటి సమాజంలో మహిళల పాత్రలకు చాలా తేడాలున్నాయి. అప్పటి కథల్లో, నవలల్లో మహిళ ఇంటికే పరిమితం. దాంతో ఎక్కువగా కుటుంబ నేపథ్యం, అనుబంధాలు ఇతివృత్తాలు రచనలు వచ్చేవి. ఇప్పుడు అనేక అంశాలను ఇతివృత్తాలుగా ఎంచుకోవచ్చు. మహిళలకు సమస్యలు ఎక్కువయ్యాయి. వాటిపై అవగాహన కల్పించడంతో పాటు ఆ సమస్యలను ఎలా పరిష్కరించు కోవాలో తెలియచేసేలా రచనలు రావల్సిన అవసరం ఉంది. అవగాహన ఎంత పెరిగినా సమస్యలు రూపాంతరం చెందుతూ మహిళలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ మహిళలు చైతన్యవంతం కావాలి. అప్పుడే వారి అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారు.
- వి.యశోద