Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సివిల్స్... నేడు చాలా మంది పెట్టుకుంటున్న లక్ష్యం. అయితే ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి అనే ఎన్నో సందేహాలు. ముఖ్యంగా మంచి మెటీరియల్ ఎక్కడ దొరకుతుందా అని వెదికే వారి సంఖ్య ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల నుండి నుండి వచ్చే వారికి మరీ కష్టం. అలాంటి వారి కోసం సమగ్రమైన మెటీరియల్ అందుబాటులోకి తెచ్చారు సుంకరి రమాదేవి. తాను తయారు చేసిన మెటీరియల్ ద్వారా ఎంతో మంది ర్యాంకులు సాధిస్తున్నారంటూ ఆనందిస్తున్న ఆమె పరిచయం...
మాది సూర్యాపేట. మా నాన్న సైదులు, టీచర్. అమ్మ సరళాదేవి, హౌజ్ వైఫ్. మా తాతయ్య కూడా టీచర్. మేము ఐదుగురం పిల్లలం. అందరం అధ్యాపక వృత్తిలోనే వున్నాం. నేనూ, మా చిన్న తమ్ముడు లెక్చరర్స్గా చేస్తున్నాం. ఇలా ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవారే. నాన్నకు చదువంటే చాలా ఇష్టం. అందుకే మమ్మల్ని బాగా చదివించారు. నా ఎడ్యుకేషన్ మొత్తం సూర్యాపేటలోనే. పీజీ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశా.
ఉద్యోగం చేస్తూనే...
1996లో సూర్యాపేటలో నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్గా జాబ్ వచ్చింది. 2000లో నా పెండ్లి అయింది. మావారు జగన్మోహనరావు. ప్రైవేట్ ఉద్యోగి. ఆయన ప్రోత్సహంతో పెండ్లి తర్వాత కూడా చదువుకున్నా. బీఎడ్, ఎంఎడ్ కూడా పూర్తి చేశా. మా పెద్ద బాబు ఇంజనీరింగ్, చిన్న బాబు ఇంటర్ చదువుతున్నారు. టీచర్ జాబ్ చేస్తూనే పోటీ పరీక్షలు కూడా రాస్తుండేదాన్ని. తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ కోసం రాసి సెలక్ట్ అయ్యా. చౌటుప్పల్లోని జూనియర్ కాలేజీలో కొంత కాలం పని చేశా. 2013లో డిగ్రీ కాలేజీ లెక్చరర్గా సెలక్ట్ అయ్యా. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజీలో పని చేస్తున్నా.
ఎవరూ ఇబ్బంది పడకూడదని...
చాలా కాలం సివిల్స్ కోసం ప్రయత్నించా. గ్రూప్ 1 నాలుగు సార్లు రాశా. కానీ సెలక్ట్ కాలేదు. అలా ప్రిపేర్ అవుతున్నప్పుడే ఓ స్నేహితుని సలహాతో గ్రూప్స్కు ప్రిపేరయ్యే వారి కోసం పుస్తకం రాయాలనే అలోచన వచ్చింది. అప్పటికే అతను ఎకానమీ గురించి రాస్తున్నారు. నాలా గ్రూప్స్కు ప్రిపేరయ్యేవారు మెటీరియల్ కోసం ఇబ్బంది పడకుండా వుండాలంటే నా వంతు కృషి నేను చేయాలనుకున్నా. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి, తెలుగు మీడియం నుండి వచ్చిన వారికి తెలుగు మాధ్యమంలో మెటీరియల్ దొరక్క, ఎలా ప్రిపేర్ కావాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడేవారు. నేను ప్రిపేర్ అయ్యేప్పుడు తెలుగు మెటీరియల్ దొరికేది కాదు. సివిల్స్కు ప్రిపేరయ్యేటప్పుడు సరైన మెటీరియల్ లేకపోతే ఎంత కష్టమో స్వయంగా అనుభవించా. కాబట్టి మెటీరియల్ తయారు చేయడానికి సిద్ధమయ్యా.
సందేహాలు రాకుండ...
మొదటి సారి ఎనిమిది వందల పేజీలతో 2008లో మొదటి పుస్తకం తీసుకువచ్చా. రెండు వేసవి సెలవుల్లో దీన్ని పూర్తి చేశా. సివిల్స్లో పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్ కచ్చితంగా ఉండే సబ్జెక్ట్. ఇవన్నీ తెలుగులో వుంటే ప్రిపేరయ్యే వాళ్ళకు సులభంగా వుంటుంది. మెటీరియల్ తయారు చేసేటప్పుడు ఒకటే లక్ష్యం పెట్టుకున్నా. నేను రాసిన మెటీరియల్ చదివిన విద్యార్థులకు మళ్ళీ సందేహాలు రాకూడదు. సులభమైన భాషలో రాయాలి. అలాంటి మెటీరియల్ ఎక్కడా దొరకడం లేదు. అలాంటిదే నేను తయారు చేయాలనుకున్నా. అందుకే 2008లో రాసిన పుస్తకాన్నే మరింత అప్డేట్ చేస్తూ అర్థం కాని పదాలు, నిర్వచనాలు, ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు వీటన్నిటిని కింద నోట్ అని రాసిపెట్టాను. దీన్ని ఇంత సమగ్రంగా తీసుకురావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. నేను చేస్తున్న పీహెచ్డీని కూడా పక్కన పెట్టి నా సమయం మొత్తం దీనికే కేటాయించా. అలా 2014లో 'భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ' పుస్తకాన్ని సమగ్రంగా తీసుకొచ్చా.
అందరికీ అందుబాటులో ఉండాలని...
అప్పటి నుండి ఇదే పుస్తకాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేర్చులు చేయిస్తున్నాను. రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. న్యాయ వ్యవస్థలో మార్పులు వస్తాయి. వాటన్నింటినీ మళ్ళీ ముద్రించి పుస్తకంలో పెడుతున్నాను. ఈ పుస్తకానికి మంచి స్పందన వస్తుంది. విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం తొమ్మిదో ఎడిషన్ నడుస్తోంది. పుస్తకం రేటు కూడా చాలా తక్కువ పెడతాను. చాలా మంది రేటు పెంచొచ్చు కదా అంటుంటారు. అయితే ఈ పుస్తకం చదివేవాళ్ళు ఎక్కువ శాతం నిరుద్యోగులు. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు. అలాంటి వారికి అధిక ధరకు అమ్మడం నాకు ఇష్టం లేదు. మెటీరియల్ దొరక్క, కొనలేక ఎంతో మంది సివిల్స్ ప్రిపేర్ కాలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి ఏ విద్యార్థికీ రాకూడదనే నా కోరిక.
పోటీ పెరిగిపోయింది
పుస్తకంలో నా ఫోన్ నెంబర్ వుంటుంది. చదివేవాళ్లకు ఏమైనా సందేహాలు వస్తే ఫోన్లు చేసి మరీ అడుగుతుంటారు. నా బుక్ చదివే వాళ్ళకు కచ్చితంగా జాబ్ రావాలి అనేదే నా తపన. ఎందుకంటే నేను ఈ పరీక్షలు రాయడానికి చాలా కష్టపడ్డా. ఆ కష్టం గురించి నాకు బాగా తెలుసు. చాలా మంది ఫోన్లు చేసి 'మీ పుస్తకం చదవడం వల్ల నేను ర్యాంకు తెచ్చుకున్నాను' అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం సివిల్స్కు పోటీ బాగా పెరిగిపోయింది. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా సివిల్ సర్వీసుల పరీక్షలు రాస్తున్నారు. మొదట్లో చాలా మంది మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే చదువు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారిపోయింది. అందుకే వాళ్ళు కూడా సివిల్స్ రాస్తున్నారు.
ఒక్క మార్కు కూడా ముఖ్యమే
గతంలో సివిల్స్ కోచింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ఈ మధ్య బిసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పేద విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్నారు. అందరూ వీటిని ఉపయోగించుకోవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్ళు రెండు మార్కుల కోసం కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒక్క మార్కు మిస్ అయినా ర్యాంక్ పోగొట్టుకున్నట్టే. కాబట్టి ప్రతి మార్కు ఎంతో ముఖ్యమైనది. అందుకే మెటీరియల్తో పాటు రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ గురించి స్పష్టంగా అర్థమయ్యేలా ఓ చార్ట్ కూడా తయారు చేశా. ఈ చార్ట్ గోడకు తగిలించి నిత్యం చూస్తూ వుంటే విద్యార్థులకు గుర్తుపెట్టుకోవడం సులభంగా వుంటుంది.
మిస్ అయినందుకు బాధపడ్డా
సివిల్స్కు ప్రిపేరయ్యే వాళ్ళు ముందు దానికి సంబంధించిన మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి. తాము చదువుతున్న మెటీరియల్లో లేటెస్ట్ టాపిక్స్ యాడ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. కష్టంగా ఉన్నవి మళ్ళీ మళ్ళీ రాసుకోవాలి. వాటికి తోడు కరెంట్ టాపిక్స్ ఎటాచ్ చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి. నేను ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ కావడం వల్ల అనుకున్నది సాధించలేకపోయా. అదే దీనిపైనే దృష్టి పెడితే కచ్చితంగా సాధించగలిగేదాన్ని. గ్రూప్ 1 మిస్ అయినప్పుడు చాలా బాధపడ్డాను. అందుకే రెండు పడవలపై కాళ్ళు పెట్టకుండా ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టాలి.