Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయిషీ ఘోష్... నిండా పాతికేండ్లు నిండని యువతి. బక్కపల్చటి శరీరం. కానీ కండ్ల నిండా ఆత్మ స్థయిర్యం. ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గుణం. ప్రశ్నించే తత్వం. సమస్యల పరిష్కారానికై వెళ్ళే మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకే తప్ప వెనుకడుగు వేయని ధీóశాలి. ఇనుప రాడ్లకు సైతం చర్చలతోనే సమాధానం చెప్పే నేర్పరి. పగిలిన తలతో, విరిగిన చేతితో మళ్ళీ ఉద్యమంలోకి అడుగు పెట్టిన ధిక్కార స్వరం. దేశ భవితకు, నిజమైన దేశ భక్తికి నిండైన ప్రతీక...
2020 జనవరి 5... ముసుగులు ధరించిన గూండాలు ప్రశ్నించే గొంతును మూయించాలనుకున్నారు. వామ పక్ష విద్యార్ధి నేతలనే టార్గెట్ చేశారు. భయభ్రాంతులకు గురిచేయాలనుకున్నారు. సమస్యలపై నిరంతరం స్పందించే తలలను ఇనుప రాడ్లతో బద్దలు కొట్టేందుకు పూనుకున్నారు. మేధావులకు నిలయమైన జెఎన్యూలోని హాస్టల్ గదులు రక్తంతో తడిపారు.
చిన్నతనం నుండే ప్రశ్నించే గుణం
అభ్యుదయ ఉద్యమాలకు కంచుకోట అయిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అయిషీ ఘోష్ది. ఆ రాష్ట్రంలోని దుర్గాపూర్ ఆమె సొంతూరు. తల్లి శర్మిష్ట, గృహిణి. తండ్రి దేబాషిష్ ఘోష్. ఈయన సీఐటీయు కార్మిక సంఘంలో పని చేస్తారు. దాంతో ఇంట్లో ఎప్పుడూ రాజకీయ చర్చలు జరుగుతుండేవి. వాటిని వింటూ పెరిగింది అయిషే. ప్రశ్నించే తత్వం ఆమెకు చిన్నతనం నుండే అబ్బింది. పత్రికలు చదువుతూ, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ సమాజంపై అవగాహన పెంచుకుంది.
క్రియాశీల రాజకీయాల్లోకి...
చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండేది అయిషీ. 'చదువుతూ పోరాడు - చదువుకై పోరాడు'' అనే నినాదంతో విద్యార్థుల సమస్యపై పని చేస్తున్న ఎస్ఎఫ్ఐ లో ఆమె సభ్యురాలు. ఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసింది. అప్పటి నుండే క్యాంపస్ సమస్యలపై ప్రశ్నించడం మెదలుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక పీజీ కోసం జెఎన్యూలో చేరింది. విద్యార్ధి ఉద్యమాలకు, అభ్యుదయ భావాలకు నెలవైన జెఎన్యు వాతావరణం ఆమెను మరింత ఉత్సాహపరిచింది. క్యాంపస్లో అడుగుపెట్టాక మరింత క్రియాశీలకంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా స్పందించడం ఆమె నైజం. అదే ఆమెను విద్యార్థి సంఘ ఎన్నికల్లో రెండు సార్లు కౌన్సెలర్గా ఎంపికయ్యేలా చేసింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించింది.
వీసీకే సవాల్ విసిరింది
సీనియర్ విద్యార్థి అయినా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంది. క్యాంపస్లోని అందరితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తుంది. సబ్జెక్ట్ అర్థం కాని వారికి సందేహాలను నివృత్తి చేస్తుంది. ఇటీవల క్యాంపస్లో ఒక్కసారిగా హాస్టల్ ఫీజులు భారీగా పెంచారు. పెంచిన ఫీజులు తగ్గించాలని విద్యార్థులు పరీక్షలను సైతం బహిష్కరించి ఆందోళన మొదలుపెట్టారు. దాంతో విద్యార్థులకు అండగా విద్యార్థి సంఘం పోరాటం ప్రారంభించింది. విద్యార్థుల గురించి, విద్యార్థుల పోరాటం గురించి వీసీ అవహేళనగా మాట్లాడాడు. ఫీజులు పెరగడం వల్ల పేద విద్యార్థులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో హాస్టల్కొచ్చి చూడమంటూ వైస్ ఛాన్సలర్కే సవాల్ విసిరింది అయిషీ. ఓ అమ్మాయి ఉద్యమాన్ని ఇంత పట్టుదలతో నడపటం యాజమాన్యం సహించలేకపోయింది.శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి సైతం వీసీకి అనుకూలంగా ఉన్నారు. అయినా విద్యార్థులు వెనకడుగు వేయలేదు. ఆందోళన కొనసాగించారు. ఇలాంటి సమయంలోనే పౌరసత్వ చట్ట సవరణ బిల్లును, ఎన్ఆర్సీలను వ్యతిరేకించిన జామియా యూనివర్సిటీ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ దాడిపై జెఎన్యు స్పందించింది. ఈ అన్ని కార్యక్రమాలను అయిషీ ముందుండి నడిపింది.
కార్నర్ చేసి కొట్టారు..
ఓ వామపక్ష విద్యార్థి సంఘం ఇలా విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేయడం ఉన్మాద శక్తులు భరించలేకపోయాయి. తమను ఓడించిన ఎస్ఎఫ్ఐపై కక్ష సాధించేందుకు ఎబీవీపీ దీన్ని అవకాశంగా తీసుకుంది. ముసుగులు వేసుకుని దాడికి పాల్పడ్డారు. 'ఆ రోజు రాత్రి ఫీజుల నియంత్రణపై సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అధ్యాపకులు, విద్యార్థులతో మా సమావేశం ప్రారంభమయింది. ఒక్కసారిగా సుమారు 60, 70 మంది ముసుగులు ధరించిన గూండాలు మాపైకి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు కర్రలు, ఇనుప రాడ్లతో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సుమారు 20 మంది నన్ను కార్నర్ చేసి కొడుతూనే ఉన్నారు. వాళ్ళు పారిపోయాక స్నేహితులు నన్ను కార్లో ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు కూడా పోలీసులు మా పట్ల వివక్ష చూపారు. ప్రధాన ద్వారం నుండి వెళ్లనీయకుండా వెనుక గేటు వైపు నుండి వెళ్ళమన్నారు'' అంటూ ఆ రోజు జరిగిన దాడిని గుర్తు చేసుకుంది అయిషీ.
వెన్నులో వణుకు పుట్టేలా
ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక మందిని కదిలించింది. అందరూ ఆశ్చర్యపోయేట్టు ఆ రెండో రోజే అయిషీ విద్యార్థుల బహిరంగ సభలో పాల్గొంది. ఆ ముఖంలో భయం మచ్చుకైనా కనబడలేదు. చురకత్తుల్లాంటి తన చూపులతోనే ఆ ముష్కరులకు ధైర్యంగా సమాధానం చెప్పింది. అంతటి గాయాలకు గురైనా ముసుగు గూండాల వెన్నులో వణుకు పుట్టేలా ''మీరు మమ్మల్ని కొట్టారు, మీరు కొట్టిన ఒక్కో ఇనుప రాడ్ దెబ్బకు చర్చలతోనే మేం మీకు దీటైనా సమాధానం చెబుతాం'' అంటూ ఆ బహిరంగ సభలోనే సవాల్ చేసింది. నిండైన ఆత్మ విశ్వాసంతో ఆమె నోటి నుండి వచ్చిన ప్రతి మాటకూ చప్పట్లతో మారు మోగింది ఆ ప్రాంగణమంత.
మాటలతో నిందించారు
బహిరంగ సభ ముగిసిన తరువాత అయిషీతో పాటు బాధిత విద్యార్థుల మీద వీసీ తప్పుడు కేసులు బనాయించారు. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుండగులు అసలు ఆమెకు గాయాలే కాలేదని, అంతా నాటకమాడుతుందంటూ ప్రచారం మొదలుబెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాటలతో నిందించారు. అయినా ఆమె అదరలేదు బెదరలేదు. తన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంది. దేశంలోని అభ్యుదయ వాదులు, సామాజిక కార్యకర్తలు, సినీ నటులు, మేధావులు ఎందరో ఆమెకు అండగా నిలిచారు. దాడిని తీవ్రంగా ఖండిచారు. దేశంలోనే కాక విదేశీ పత్రికలు, ఛానల్స్ కూడా అయిషీ ధైర్య సాహసాలను కొనియాడాయి.
గర్వంగా ఉంది
''మా అమ్మాయి గాయాలపాలైనందుకు బాధగా ఉంది. కానీ దేశం మొత్తం తన వెనుక నిలబడ్డందుకు గర్వంగా ఉంది. మా అమ్మాయికి పట్టుదల ఎక్కువ. తను చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. న్యాయం అనుకున్న దారిలో ఎన్ని కష్టాలున్నా నడవాలనే అనుకుంటుంది నా బిడ్డ. మేం కూడా అదే కోరుకుంటున్నాం'' అంటున్నారు అయిషీ తండ్రి దేబాషిష్.
ఊరుకునే మనస్తత్వం కాదు
''మా అమ్మాయి క్యాంపస్ రాజకీయాల్లో ఇంత చురుగ్గా పాల్గొనడం ఎంతో ఆశ్చర్యంగా వుంది. చిన్నతనంలో చాలా మొహమాటస్తురాలు. వాళ్ళ నాన్న రాజకీయాల్లో వుండేవారు. ఆయన భావాలు నా బిడ్డకు కూడా వచ్చాయి. అయితే సమస్యలపై ఇంత పట్టుదలతో పోరాడుతుందని నేను అస్సలు ఊహించలేదు. చిన్నప్పుడు తనకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ బొమ్మలు గీస్తూ వుండేది. ఎన్నో బహుమతులు కూడా సాధించింది. అలాంటి సౌమ్యురాలు ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై ఇంతగా పోరాడుతుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు తనది'' అంటున్నది అయిషీ తల్లి శర్మిష్ట.
- సలీమ