Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల కొత్త ఆలోచనలు అమలులోకి వస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్ రహిత వస్తువులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కొందరు తమ పరిథిలో ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారే తోట లాస్య. తమ చిన్నారితో పాటు ఎందరో చిన్నారులకు ప్లాస్టిక్ రహిత చేసిన బొమ్మలను 'క్రాఫ్ట్ టౌన్' పేరుతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పిల్లల మనోవికాసాన్ని పెంచే బొమ్మలు ఆరోగ్యకరంగా కూడా ఉండాలంటున్న ఆమె పరిచయం..
మాది నెల్లూరు. నాన్న భాస్కర్, టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ పేరు దుర్గ. నేను, అక్క. బావగారు ఆమెరికాలో ఉద్యోగం చేయడంతో ఇటీవలే ఆమె అక్కడకు వెళ్ళారు. నెల్లూరులో బిటెక్ వరకు చదివాను. పూనెలో రెండు ఏండ్లు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత తోట బాలుతో పెండ్లి. మా వారిది ప్రైవేటు జాబ్. మా ఇంట్లో చాలా వరకు ఆర్గనిక్ , ప్లాస్టిక్ రహిత వస్తువులే వాడుతాం. మా పాపాయి ఆడుకోవడానికి బొమ్మల కోసం చూస్తున్నప్పుడు అన్నీ ప్లాస్టిక్ బొమ్మలే కనిపించాయి. మా పెద్దవాళ్ళు 'ప్లాస్టిక్ బొమ్మలు వద్దు. మీ చిన్నప్పుడు కొయ్య బొమ్మలే కొనిచ్చేవాళ్ళం. పాలకాయ (ఆటవస్తువు)తో మీకు బొమ్మలు కొనివ్వడం ప్రారంభించేవాళ్ళం. మీరు కూడా చెక్కబొమ్మలే కొనండి' అంటూ సూచనలు ఇచ్చారు. వారు చెప్పిన బొమ్మల కోసం ఎన్నో చోట్ల వెతికినా దొరకలేదు.
చేతిలోని కళను వదిలేసి..
విజయవాడకు వెళ్ళినప్పుడు అక్కడ కొయ్యకొమ్మలు చూసి వారు చెప్పిన వివరాల ప్రకారం కొండపల్లికి వెళ్ళాం. మా పాపాయికి కావల్సిన బొమ్మలు కొనుకున్నాం. అక్కడ కొద్ది మంది బొమ్మల తయారీ కళాకారుల తో మాట్లాడాం. ఎక్కువగా అమ్మకాలు లేకపోవడం తో వారిలో చాలామంది రోజువారీ కూలీకి వెళ్తున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో రకాల బొమ్మలను తయారుచేయగల వారి సృజనాత్మకత, వారికి తర తరాలుగా అబ్బిన కళ సరైన ఆదరణ లేక మరుగున పడిపోతున్నది అన్న బాధ కలిగింది. మా పాపాయిలాగే చాలామంది చిన్నారులకు ఆరోగ్యకరమైన బొమ్మలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. దాంతో రకరకాల చెక్క బొమ్మల గురించి రీసెర్చ్ చేశాం. కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ అందుబాటులో ఉన్న బొమ్మల గురించి, వాటి తయారీ గురించి వివరాలు సేకరించాం. ఎన్నో అందమైన, ఆరోగ్యకరమైన బొమ్మలు ఉన్నాయన్న విషయం తెలిసింది. దాంతో పిల్లలకు కావల్సిన బొమ్మలను వారికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశాం.
ఎగ్జిబిషన్ల ద్వారా..
చాలామందికి ప్లాస్టిక్ బొమ్మలు వాడొద్దు అన్న ఆలోచన ఉంటుంది. కానీ, ప్లాస్టిక్ రహిత బొమ్మలు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి అవే కొంటున్నారు. అందుకే మేం తెప్పించిన బొమ్మలను అనేక చోట్ల ప్రదర్శనల ద్వారా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. అందుబాటులో ఉంటే అమ్మకాలు బాగుంటాయి. బహుమతులుగా కూడా చాలామంది వీటిని కొంటున్నారు. ఇటీవలే ఐమాక్స్లో షాప్ ప్రారంభించాం.
ఉపాధి కల్పించేలా..
ఎక్కువగా కొనుగోలు లేకపోవడంతో ఎంతో మంది కళాకారులు ఉపాధి కోల్పోతున్నారు. వారికి కొంతైనా సహాయం చేయాలన్న ఆలోచనతో క్రాఫ్ట్ టౌన్ ప్రారంభించాం. ఎనిమిది వేల రూపాయలతో 25 రకాల బొమ్మలతో మొదలు పెట్టిన మా క్రాఫ్ట్ టౌన్లో ఇప్పుడు ఎనిమిది వందల రకాల బొమ్మలు, వస్తువులు అందుబాటులో ఉన్నాయి. కొంత మంది కళాకారులతో వర్క్షాప్ ఏర్పాటుచేయాలన్న ఆలోచన ఉంది.
ఆరోగ్యం కోసం..
పిల్లల విషయానికి వస్తే వారు ఆడుకునే బొమ్మల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్తో చేసినవే. వీటి తయారీలో దాదాపు 40 శాతం సీసం ఉంటుంది. పాలపీక లాంటివి పిల్లలు నోట్లో పెట్టుకుంటారు. మూడేండ్ల వరకు చాలామంది చిన్నారులు వారి చేతిలో ఉండే బొమ్మలను నోట్లో పెట్టుకుంటుంటారు. ఫలితంగా ఈ బొమ్మల్లో ఉండే రబ్బరు, కెమికల్స్, సీసం పిల్లలపై ప్రభావం చూపుతుంది. మేం అందుబాటులోకి తెస్తున్న బొమ్మలు ఆరోగ్యకరం. వాటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఎక్కువగా చెక్క, ప్రకృతి సిద్ధమైన రంగులతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు ఆడుకునే అనేక రకాల బొమ్మలతో పాటు గ్రామీణ ఆటలను గుర్తుచేసేలా బొమ్మలను కూడా అందుబాటులోకి తెస్తున్నాం. మా క్రాఫ్ట్ టౌన్ చిన్నారుల బొమ్మలు, ఇంటీరియర్ డెకరేషన్ వస్తువులు మన సంప్రదాయాలను గుర్తు చేయడంతోపాటు ఆరోగ్యకరమైన బొమ్మలకు కేరాఫ్ గా నిలుస్తోంది.
ప్లాస్టిక్ రహితంగా..
ప్లాస్టిక్ అన్నింటిలో విస్తరించింది. మార్కెట్లో లభించే చిన్నారుల బొమ్మలు కూడా ప్లాస్టిక్తో చేసినవే. వీటిని తయారు చేయడానికి ఏడాదికి నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఒక సర్వేలో స్పష్టమైంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అనారోగ్యకరమైన వస్తువులను పిల్లల చేతికి ఇస్తున్నారు. పర్యావరణ హిత, ఆరోగ్యకరమైన బొమ్మల తయారీకి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎంతో మంది కళాకారులకు ఉపాధి లభిస్తుంది. నిర్మల్, విశాఖపట్నం, కొండపల్లి, నీలగిరి తదితర ప్రాంతాల్లో లక్క, కొయ్య బొమ్మలు, అలంకరణ వస్తువులు తయారుచేసే వందల కుటుంబాలు ఉన్నాయి.
రేపటి తరానికి..
మనిషి జీవించడానికి కావల్సిన గాలి, నీరు, ఆహారం కలుషితమైతే రేపటి తరం పరిస్థితి ఎంటీ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన బిడ్డలకు ఆరోగ్యకమైన ఆహారం ఇవ్వడంలో ఎంత శ్రద్ద చూపిస్తామో అంతే శ్రద్ద వారికి కావల్సినవి అందించడంలోనూ తీసుకోవాలి.