Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది బిడ్డ కడుపులో ఉన్నప్పుడు పోషకాహారం తీసుకుంటే సరిపోతుందనుకుంటారు. దాంతో బిడ్డ పుట్టిన తర్వాత ఆహార నియమాల గురించి పెద్దగా పట్టించుకోరు. తల్లిపాలు పోషకాలతో నిండి ఉంటాయి. అందుకే పాలిచ్చే తల్లులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటేనే బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి. కడుపులో ఉన్నప్పుడే కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల వరకు ఆహారం(పాల) కోసం పూర్తిగా తల్లిపై ఆధారపడతారు. కాబట్టి పాలిచ్చే తల్లులు కింద సూచించిన ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి. దాని వలన తల్లిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది.
బిడ్డను తల్లి తన స్పర్శ తగిలేలా హత్తుకోవాలి. దీని వలన ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి తల్లిపాల ఉత్పత్తిని పెంచుతాయి.
వెల్లుల్లి ఆహారంలో తీసుకోవడంతో పాటు వాసన చూడటం ద్వారా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది.
పాలిచ్చే తల్లులు పాలకూర, మెంతికూరను తమ ఆహారంలో కచ్చితంగా చేర్చుకోవాలి. వీటిలో కాల్షియం, ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
జీలకర్ర జీర్ణశక్తిని పెంచడంతో పాటు కాల్షియం, రైబోఫేవిన్ని కలిగి ఉంటుంది. మలబద్దకంను నివారిస్తుంది. అలాగే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
బాదం ప్రోటిన్ కలిగి ఉంటుంది. అలాగే ఖర్జూర కాల్షియం, ఐరన్ పోషకాలతో నిండి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డా ఇరువురూ లాభపడతారు.
క్వినోవా కూడా పాల ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇది మన దేశీయ ఉత్పత్తి కాదు. అందుకే అందుబాటులో లేదు. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో మెగ్నిషియం ఎక్కువ పాళ్ళలో ఉండటం వలన క్యాల్షియం శోషకాలలో సహాయ పడుతుంది. ఇది పాలు తక్కువగా ఉన్న తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది.
ఓట్స్, క్యారెట్, గుడ్డు, మటన్ కీమా, చేపలు ఆహారంలో తరచూ తీసుకుంటూ ఉంటే తల్లిలో పాల ఉత్పత్తి చాలా పెరుగుతుంది.
ప్రతి రోజు 4 నుండి 5 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. అలాగే రోజు తప్పనిసరిగా వీలైనంత వరకు వాకింగ్ చేస్తుండాలి.