Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం పిల్లలకు కథలు చెప్పడం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో యుద్ధం చేయించడమే. లేదంటే స్మార్ట్ఫోన్లు, టీవీలు. మరి మన సాహిత్యం, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు కానీ, తెలుగు ప్రాంతంలో జరిగిన వాస్తవ గాథలు కానీ మన చిన్నారులకు ఎలా తెలుస్తాయి? కేవలం బడిలో చెప్పే పాఠాలకు మాత్రమే పరిమితం అయ్యే పిల్లల్లో సహజమైన ఆలోచనలు, సజన శక్తులు, మనోల్లాస చురుకుదనాలు పూర్తి స్థాయిలో వికసిస్తాయా? అందుకే మనం వీలు కలిగించుకుని మరీ పిల్లలకు ఇంట్లోనే మంచి కథలు చెప్పాలి. అంతకుముందు మనం మంచి కథకులుగా మారాలి.
కథలు వినటం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే అదే నిజమని తేల్చి చెప్పాయి ఎన్నో రకాల పరిశోధనలు. అనగనగా .. అని మనం కథ చెప్పటం మొదలుపెట్టగానే నోరు వెళ్లబుచ్చుకుని వినటం మొదలుపెడతారు పిల్లలు. వాళ్లకి నచ్చిన కథ అయితే మనం మధ్యలో ఆపినా ఊరుకోరు కదా. ఇలా వినే కథల వల్ల వాళ్ల ఆలోచనా పరిధి పెరుగుతుందట. మనం చెప్పే కథకి అనుగుణంగా వాళ్లు వాళ్ల బుర్రలో ఆ కథకి తగ్గ వాతావరణాన్ని ఊహించుకుంటారట. ఇలా వినేటప్పుడు మనకి కనిపించే ఆ అమాయకపు కళ్ల వెనక ఎన్నో అద్భుత చిత్రాలు కదులుతూ ఉండేసరికి వాళ్ల మెదడు చురుకుగా పనిచెయ్యడం మొదలుపెడుతుంది.
మధ్యమధ్యలో వాళ్లు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి మనకే అంతు చిక్కనివిగా ఉంటాయి. వాటికి సమాధానం ఇచ్చే ముందు దానికి తగ్గ సొల్యూషన్ ఎలా ఉంటె బాగుంటుంది అని మీరు మరో ప్రశ్న వాళ్లకి తిరిగి వేస్తే చాలు వాళ్ల చిన్న బుర్రలో ఎన్నెన్ని ఆలోచనలు పరుగులు తీస్తాయో చెప్పలేం. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి.
- ఒక కథ విని దాని గురించి ఆలోచనలో పడటం వల్ల మెదడులో నరాలు బాగా పని చేసి మైండ్ షార్ప్ అవుతుందని చెబుతున్నారు పిల్లల మానసిక నిపుణులు. జపాన్ జరిపిన ఒక సర్వేలో ఇంట్లో ఖాళీ సమయంలో టీవీ చూస్తూ లేదా వీడియో గేమ్స్ ఆడే పిల్లల మెదడు కన్నా కథలు చెప్పించుకుని వినే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తోందని తేల్చి చెప్పారు.
- కాల్పనిక కథలు, జానపద కథలు ఇలా ఎన్నో రకాల కథలు పిల్లల్ని ఎంతో ఆలోచింపచేస్తాయి. పిల్లలకి గిఫ్ట్స్ రూపంలో కథల పుస్తకాలు కొని ఇస్తూ ఉంటే వాళ్లు కూడా వాళ్ల ఫ్రెండ్స్కి అలా పుస్తకాలు కొనివ్వడం అలవాటు చేసు కుంటారు. కథల పుస్తకాలు చదవటం వల్ల గ్రహింపు శక్తి పెరగటమే కాదు కళ్లకి కూడా ఒక ఎక్సర్ సైజ్లా పనిచేస్తుందట.
- బొమ్మల ద్వారా కూడా కథలను చెప్పవచ్చు. వీటి ద్వారా కథల్లోని నీతితో పాటు ఆ బొమ్మల్లోని అంశాన్నీ గ్రహించగలుగుతారు. ఇంకా కథా చిత్రాల ద్వారా కూడా కథ చెప్పవచ్చు. ఈ విధానంలో ఒక చార్టుపై బొమ్మలు ఉంటాయి. వాటిని చూపిస్తూ కథను చెప్పమనాలి. గొలుసు కథలను అల్లాలి. ఒక్కొక్కరి చేత కథను కొనసాగించాలి. ఎవరి ఊహాశక్తి మేరకు వారిని సొంతంగా కథను అల్లమనాలి. ఒకరు ఆపేసిన దగ్గర నుంచి మరొకరు ప్రారంభించాలి. కథను ఎంతసేపు చెప్పాలనేది పిల్లల ఉద్వేగాన్ని బట్టి కొనసాగించాలి. అదేపనిగా సాగదీస్తే ఆసక్తి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారిలోని ఉత్సాహాన్ని గమనిస్తూ కథా గమనాన్ని కొనసాగించాలి.
- అంతేకాదు రాత్రిళ్లు పడుకునేముందు పిల్లలు అడిగి చెప్పించుకునే కథల ప్రభావం వాళ్ల నిద్ర మీద పడుతుందిట. అలాగే పిల్లలకు దగ్గరగా కూర్చుని కథలు చెప్పటం వల్ల ఇంకో లాభం కూడా ఉందిట. పిల్లల్లో అభద్రతా భావం దూరమయి వాళ్లలో మానసిక బలం పెరుగుతుందిట. అమ్మ ఒడిలో పడుకుని హాయిగా కథలు వింటుంటే భయం మన పిల్లల దరిదాపులకి రావటానికి కూడా భయపడుతుంది కదా. అందుకే ప్రేమతో కథలు చెప్పటం మొదలు పెట్టేద్దాం.