Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూఢనమ్మకాలు మనిషి జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇవి తల్లి నుంచి పిల్లలకు, ఒక తరం నుంచి మరొక తరానికి క్రమం తప్పకుండా వస్తూనే వున్నాయి. ఈ మూఢనమ్మకాలను చదువుకోనివారు, గ్రామీణ ప్రజలే కాకుండా విద్యా వంతులు, పట్టణ ప్రాంతాలవారు కూడా పాటిస్తున్నారు. వాటి మూలంగా మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మహిళలు గర్భధారణ సమయంలో తెలిసీ తెలియని వారి మాటలు విని వాటిని ఆచరిస్తుంటారు. ఫలితంగా ఇటు తల్లికీ అటు గర్భంలోనున్న శిశువు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. గర్భధారణ సమయం నుంచి క్రమం తప్పకుండా డాక్టరును సంప్రదిస్తూ.. సూచనలు పాటించడం తల్లికి శిశువుకీ ఎంతో ఆరోగ్యకరం.
- గర్భిణీకి మంచి కలలు వస్తే మగశిశువు పుడతాడనీ, పిచ్చి కలలు వస్తే ఆడపిల్లలు పుడతారని అంటారు. నిజానికి శిశువు లింగభేదాన్ని నిర్ధారించేది జన్యుకణాలనబడే క్రోమోజోములు. అంతేకాని నిద్రలో వచ్చే కలలు ఎంత మాత్రమూ కాదు.
- నెలలు నిండుతున్నకొద్దీ గర్భంతోనున్న మహిళ తనకు, శిశువుకు కూడా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగని తాను ప్రతిరోజూ తినే ఆహారానికి రెట్టింపు మాత్రం కాదు. ఈ సమయంలో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తగినంత పరిమాణంలో తీసుకోవాలి. అది సులభంగా జీర్ణమయ్యేలాగా ఉండాలి. కొంతమంది ఎక్కువగా తింటే శిశువు బాగా పెరిగి ప్రసవసమయంలో కష్టమవుతుందని అనుకుంటారు. ఈ అభిప్రాయం వలన సరిగా ఆహారం తీసుకోకపోవడంతో తల్లి బలహీనంగా తయారై, రక్తహీనత వస్తుంది.
- కొందరు మహిళలు మొదటి నెలల కాలంలో తినే ఆహారం తల్లికి ఆరోగ్యాన్నిచ్చి ఆ తరువాత కాలంలో తీసుకునే ఆహారం శిశువును సరిగా ఉంచుతుందని నమ్ముతారు. కాని నిజానికి గర్భం ధరించిన తొలి రోజులలో ఆకలి తక్కువగాను, వాంతి చేసుకునేలా ఉండి చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. నెలలు గడిచాక శిశువు బరువు పెరుగుతాడని తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఇది చాలా తప్పు. ఇంకొందరు ఖరీదైన తిండి అంటే జీడిపప్పులు, బాదం పప్పు మొదలైన కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తింటే తమ శిశువు అందంగాను, దృఢంగాను పెరుగుతుందనుకుంటారు. విటమిన్ సి, బి కాంప్లెక్స్, ఇనుము తల్లి తీసుకునే ఆహారంలో అధికంగా ఉంటే శిశువు పెరుగుదల చక్కగా ఉంటుంది. అంతేగాని కొవ్వు పదార్థాలతో నిండిన ఆహారాన్ని తీసుకుంటే ఒళ్ళు పెరగడంతో పాటు ప్రసవ సమయంలో రక్తపోటు అధికమై ప్రమాదాలకు దారి తీస్తుంది.
- అలాగే ఆరోగ్యవంతమైన మహిళలు వ్యాయామం చేయడం కూడా అవసరం. దానివలన సులభంగా ప్రసవమయ్యే అవకాశం ఉంది. కొంతమంది ప్రసవం అయ్యాక చాలా దాహంగా ఉన్నా తాగడానికి నీరు ఇవ్వరు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిరోజూ తగినంత నీరు తప్పక తాగాలి. దానివలన మూత్రపిండాలు సరిగా పని చేస్తాయి. కొన్ని ప్రత్యేక మందులు గర్భిణీ స్త్రీకి హానికరం. అలాగని ఐరన్, కాల్షియం, విటమిన్స్, బి కాంప్లెక్స్ తప్పక తీసుకోవాలి. వాటివలన తల్లి ఆరోగ్యంగా ఉండి శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది.