Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనసు బాధతో స్పందిస్తే కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ఆనందంతో స్పందిస్తే చిరునవ్వులా వ్యక్తమౌతుంది. గుండె లోతుల్లో గూడు కట్టుకున్న కొన్ని దు:ఖాలు దేనికీ స్పందించవు. ఎద లోతుల్లో గడ్డ కట్టిన ఆ బాధ బయటకు రావాలంటే ఓదార్పు కావాలి. అలాంటప్పుడు అక్షరాలు కూడా కొందరికి సాంత్వనను ఇస్తాయి. అక్షరాలు వారికి ఓదార్పు నిస్తాయి. అలాంటి అక్షరాలను సృజిస్తున్న వర్ధమాన కవయిత్రి సుభాషిణి తోట. సాహితీ వనంలో విరబూస్తున్న ఆమె పరిచయం ఈ రోజు మానవిలో...
నేను పుట్టింది పెరిగింది ఖమ్మంలోనే. అమ్మ, సరస్వతి. నాన్న భాష్యకార్ల రామచంద్రరావు. అమ్మా, నాన్న ఇద్దరూ టీచర్లే. మాకు ఇంట్లోనే స్కూల్ వుండేది. అమ్మ అందులోనే పని చేసేది. నేను కూడా ఆరో తరగతి వరకు మా స్కూల్లోనే చదువుకున్నా. మేము ఐదుగురం పిల్లలం. మా అందరినీ చూసుకోవడం కాస్త కష్టంగా వుండి అమ్మ ఇంటికే పరిమితమయింది. నాన్న తెలుగు పండిట్. చిన్నప్పుడు సాహిత్యం పట్ల పెద్దగా ఆసక్తి లేదు. పుస్తకాలు కూడా పెద్దగా చదివేదాన్ని కాదు. పాత సినిమా పాటలు మాత్రం ఇష్టంగా వినేదాన్ని. మా కుటుంబంలో అందరూ టీచర్లే. నేను కూడా బీఎడ్ పూర్తిచేసి స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ 2017లో ఎమ్మెస్సీ పూర్తిచేసాను.
నాన్న పోయిన తర్వాత...
2012, 13లో ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశాను. చాలా మంది చిన్న చిన్న కవితలు రాసి ఫేస్బుక్లో పెట్టడం చూశాను. వాటిని చూసి నాకూ రాయాలనిపించింది. అప్పుడప్పుడు కవితలు రాసి పోస్ట్ చేస్తుండేదాన్ని. ఇలాంటి సమయంలోనే అనుకోకుండా నాన్న చనిపోయారు. మా అందరిపై నాన్న ప్రభావం బాగా ఉండేది. ఆయన పోయిన తర్వాత ఏదో కోల్పోయిన భావన. ఆ లోటు తీర్చుకోవడం కోసం కవిత్వంపై దృష్టిపెట్టాను. నిరంతరం రాయడం అలవాటు చేసుకున్న. అవి కవిసంగమం వాళ్ళు చూసి అందులో నా కవిత్వాన్ని పరిచయం చేశారు. కవి సంగమంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొంత నేర్చుకున్నా. ప్రేమ కవిత్వాన్ని ఎక్కువగా రాస్తుంటాను. మనిషికి ఏది దూరమైతే దాన్ని ఎతుక్కోవడం అలవాటు కదా... అలాగే స్త్రీలపై జరిగే దాడులు, ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి రాస్తున్న.
శిధిలాల్లో మొలచిన అక్షరాలు
నా సంపాదకత్వంలో నాలుగు పుస్తకాలు తీసుకొచ్చాను. 2016లో 'శిధిలాల్లో మొలిచిన అక్షరాలు' పేరుతో ఓ పుస్తకం తెచ్చాము. ఇందులో ఎనిమిది మంది రాసిన కవిత్వం వుంది. మా ఖమ్మంలో ఎన్ఎస్సీ క్వార్టర్స్ అని వుండేవి. నా చిన్నతనం నుండి వాటిని చూస్తున్న. మా స్కూల్ ఫ్రెండ్స్ అందులో చాలా మంది వుండేవారు. మేము స్కూల్కి కూడా అటువైపు నుండే వెళ్ళేవాళ్ళం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సడన్గా ఆ క్వార్టర్స్ను కూల్చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. దాంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అటుగా వెళుతున్న నాకు ఆ సన్నివేశం మనసును కలిచి వేసింది. ఏదో ఒక రూపంలో నా గొంతు ప్రభుత్వానికి వినిపించపాలనుకున్నా. అయితే నా ఒక్కదాని గొంతుకంటే పదిగొంతులు కలిస్తే సమస్య బయటకు త్వరగా తెలుస్తుంది. ఇలాగైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో అనే చిన్న ఆశతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. శ్రీనివాస్ సూఫీ దీనికి ప్రధాన బాధ్యత. సంపాదకత్వ బాధ్యత మాత్రం నేను తీసుకున్న. 'రెండొకట్ల పదకొండు' అనే నా కవితా సంపుటి మరో నెల రోజుల్లో రాబోతుంది.
ట్రాన్స్ జెండర్స్ సమస్యలపై...
'ది ధర్డ్ వాయిస్' (తృతియ స్వరం) అని మరో పుస్తకం తీసుకొచ్చాం. ఇది 2017 ప్రారంభంలో వచ్చింది. శ్రీనివాస్ సూఫీ, నేనూ కలిసి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాం. 'ఓ హిజ్రా ఆత్మ కథ' పుస్తకం చిదివిన తర్వాత ఈ 'ది ధర్డ్ వాయిస్' పుస్తకం తీసుకోవాలనిపించింది. రేణుక అనే ఆమె తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇలాంటి వారు ఒక్క తమిళనాడులోనే కాదు అన్ని చోట్ల ఉన్నారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు. ఖమ్మంలో ఒకామె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమెను కలిసి కొన్ని సమస్యలు తెలుసుకున్నాం. తర్వాత పుస్తకంగా తీసుకొచ్చాం. దీన్ని ఖమ్మంలో విడుదల చేశాం. అలాగే సి.నారాయణ రెడ్డి గారి చేతుల మీద కూడా విడుదల చేశాం. ట్రాన్స్ జెండర్స్ సమస్యలు ఈ సమాజానికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ పుస్తకం తీసుకువచ్చాం.
మిర్చి రైతుల సమస్యలపై...
'కవిత్వం మండుకొస్తుంది' అనేది నా సంపాదకత్వంలో వచ్చిన మూడో పుస్తకం. మా ప్రాంతంలో మిర్చి రైతులు ఎక్కువగా ఉంటారు. రెండేండ్ల కిందట రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. సరైన ధర లేక, నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు లేక ఆ రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. నేను పని చేసే చోట కూడా మిర్చి రైతులు బాగా ఉంటారు. వాళ్ళ సమస్యలను సమాజానికి తెలియజేయాలని 2017 చివరిలో ఈ 'కవిత్వం మండుకొస్తుంది' పుస్తకాన్ని తీసుకొచ్చాం.
దిశ సంఘటన తర్వాత...
నిర్భయ ఘటన తర్వాత దిశ సంఘటన దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమయింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించకపోతే మనసు ఊరుకోదు. ఆ అమ్మాయి చనిపోయే ముందు మాట్లాడిన మాటలు అందరు మనసులో అలా వుండిపోయాయి. ఆ మాటలనే తీసుకొని 'దెయ్యం పోరగాళ్ళు' పేరుతో మరో కవిత్వం పుస్తకాన్ని తీసుకొచ్చాం. మానవతా ధోరణిలోనే ఎక్కువగా రాస్తాను. ఈ మధ్య పుస్తక సమీక్షలు కూడా చేస్తున్నా. ప్రతి నిత్యం మహిళలు ఏదో ఒక రూపంలో ఇంటా బయట వివక్షను ఎదుర్కొంటూనే వున్నారు. వాటిని నా కవిత్వంలో చూపించాలనుకుంటాను.
సాంత్వన కలిగించాలి
సమాజాన్ని చైతన్య వంతం చేసే కవిత్వం రావాలి. కొంత మంది రాసేదొకటి ఆచరణలో ఒకటి చేస్తుంటారు. అది మంచిది కాదు. సమస్యల్లో వున్న వారికి మన అక్షరం ఓ గొంతుక కావాలి. అప్పుడే మన అక్షరం సమాజానికి ఉపయోపడుతుంది. కష్టంలో వున్న మనిషికి సాహిత్యం ఓదార్పు కావాలి. మనం ఎంత కష్టంలో వున్నా ఓ చక్కటి పాట వింటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కవిత్వం కూడా అలా కష్టాల్లో వున్న మనిషికి సాంత్వన కలిగించాలి. కవిత్వం ఓ పచ్చని చెట్టు లాంటిది. అది ఎప్పటికీ ఎండిపోకుండా చూసుకోవడమే నా బాధ్యత. ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలను తీసుకుని అక్షరీకరించడమే నా ముందున్న కర్తవ్యం. మహిళల పక్షాన నిలబడాలి అనుకుంటాను. ఎవరైతే నిరాశా, నిస్పృహలో వుంటారో వాళ్ళకు మన అక్షరం ఉపయోగపడాలి.
పది గొంతులు స్పందిస్తే...
ఖాజా గారు రాసిన 'ఫత్వా' కవిత్వం నాకు బాగా నచ్చింది. అలాగే ప్రసేన్ గారి 'సర్వస్వం' కూడా ఆలోచింపజేసేదిగా వుంది. రాయడం మొదలుపెట్టిన తర్వాతనే చదవడం ప్రారంభించాను. వివక్షను ఎదిరించే ఏ కవిత్వమైనా నాకు స్ఫూర్తి నిస్తుంది. వాటిని చదివిన తర్వాత నాకూ రాయాలనిపిస్తుంది. మన సమస్యలు నలుగురికి చెప్పుకుంటే మనసులోని బాధ కొంత వరకైనా తగ్గుతుంది. అలాగే సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని అక్షరరూపంలో సమాజం దృష్టికి తీసుకెళితే ప్రభుత్వాలు కాస్తయిన స్పందిస్తాయి. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాయి. ఒక్క గొంతు స్పందించడం కంటే పది గొంతులు స్పందిస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది. అందుకే మనం రాసే కవిత్వం ఆ పది మందిని ఆలోచింపజేసేదిగా వుండాలి.