Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు వారికి ఉగాది ప్రత్యేకమైన పండుగ. మామిడి తోరణాలు, పచ్చిమామిడికాయలు, పిండి వంటలతో అందరి లోగిళ్ళు కళకళ లాడుతుంటాయి. అయితే ఈసారి కరోనా వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అందరం చాలా వరకు కదలకుండా ఇండ్లల్లోనే ఉండి పోవాల్సిన పరిస్థితి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటికే పరిమితమై నప్పటికి ఈ ఉగాదికి ఆరోగ్యమైన వంటలను రుచి చూద్దాం. తెలంగాణలో ఉగాది అంటే గుర్తుకొచ్చేవి భక్షాలు. అలాడే వడలు అయితే ఈ సారి పెరుగు వడలను ట్రై చేద్దాం. పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహౌర ఎలా చేయాలో తెలుసుకుందాం...
మామిడికాయ పులిహోర
కావల్సిన పదార్థాలు : అన్నం - కప్పు, తురిమిన కొబ్బరి - ముప్పావు కప్పు, నూనె - తగినంత, కొత్తిమీర - అరకప్పు, పల్లీలు - అరకప్పు, పచ్చిమిర్చి - 10, మామిడి కాయ - ఒకటి(తురిమి పెట్టుకోవాలి), కరివేపాకు - కొన్ని రెబ్బలు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - అర టేబుల్ స్పూన్, శనగపప్పు - అర టేబుల్ స్పూను, మినపప్పు - అర టేబుల్ స్పూను, మెంతి పొడి - అర టేబుల్ స్పూన్.
తయారీ విధానం: ఉడికిన అన్నాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని పది పదిహేను నిమిషాలు చల్లార్చుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అదులోనే పల్లీలు వేసి కలర్ మారే వరకు వేడి చేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, పసుపు, తురిమిన మామిడికాయ తురుము వేసి రెండు నిమిషాలు వరకు వేగనిచ్చి ఉడికించిన అన్నాన్ని అందులో కలపాలి. అలాగే కొబ్బరి, కొత్తిమీర ఆకులు, తగినంత ఉప్పు వేసుకోవాలి. చివరగా మెంతి పౌడర్ వేసి బాగా కలపాలి. అంతే మామిడి పులిహోర సిద్ధం. ఉగాది పచ్చడి
కావల్సిన పదార్థాలు : బెల్లం - టేబుల్ స్పూన్ (తురిమినది), మామిడికాయ ముక్కలు - ఒక కప్పు, వేప పువ్వు - టేబుల్ స్పూను, సోంపు - టేబుల్ స్పూన్లు, చింత పండు - టేబుల్ స్పూన్, ఉప్పు - చిటికెడు.
తయారీ విధానం : ముందుగా చింతపండును పావుగంట సేపు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. పచ్చడి పల్చగా వుండాలి కాబట్టి ఓ గిన్నెలోకి మనకు కావల్సినంత నీటిని తీసుకోవాలి. దాంటో ఉప్పు, తురిమిన బెల్లం, మామిడి ముక్కలు, వేపపువ్వు, సోంపు వేసి అన్నీ కరిగే వరకు బాగా కలపాలి. అంతే ఉగాది పచ్చడి సిద్దం.
పెరుగు వడ
కావల్సిన పదార్థాలు : ఉద్దిపప్పు - అర కప్పు, పెసరపప్పు - అర కప్పు, అల్లం - కొద్దిగా, ఉప్పు - అర టీ స్పూన్, పచ్చిమిర్చి - ఒకటి రెండు, బేకింగ్ సోడా - చిటికెడు
దహీ మిక్స్ కోసం : పెరుగు 250 గ్రాములు, ఉప్పు - అర టీ స్పూను, జీలకర్ర పొడి - రెండు టేబుల్ స్పూన్లు, కారం - ఒక టీ స్పూను, ఛాట్ మసాలా పౌడర్ - అర టీ స్పూను, కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం : ముందుగా ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో అరకప్పు నీళ్ళు పోసి బాగా బీట్ చేయాలి. తర్వాత దహీ మిశ్రమం కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నీ (కొత్తి మీర మినహాయించి) అందులో వేసి బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న పప్పులో నీరు వంపేసి మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా గట్టిగా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి మీడియం మంట పెట్టి, నీరు పోసుకుని ఆవిరి పట్టించడానికి సిద్దంగా ఉంచుకోవాలి. రుబ్బుకొన్న పప్పు ముద్దలో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పల్చగా లేకుండా చూసుకోవాలి. చివరగా కొద్దిగా సోడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. దాంతో దహీ వడ తయారీకి కావల్సిన మిశ్రమం సిద్దం అయినట్టే. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో దహీ వడ మిశ్రమాన్ని వేయాలి. ఇడ్లీ ప్లేట్లు కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. ఉడికిన తర్వాత వడలను గిన్నెలోకి తీసుకొని ఐదు నిమిషాలు చల్లార్చాలి. రెండు గ్లాసుల నీటిలో ఉప్పు వేసి వడలను ఆ నీటిలో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. వడల మీద పెరుగు పోయాలి. తర్వాత కొద్దిగా కారం, మిరియాల పొడి, కొత్తిమీర చిలకరించాలి. అంతే దహీ వడ రెడీ.
గుమ్మడి భక్షాలు
కావాల్సిన పదార్థాలు : గుమ్మడికాయ తురుము - ఒక కప్పు, నెయ్యి - 1 1/2 టేబుల్ స్పూన్, రవ్వ - అర కప్పు, చక్కెర ఒక కప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్, మైదా - ఒక కప్పు, మైదా పిండి - అర కప్పు, ఉప్పు - చిటికెడు, నూనె - 2 టేబుల్స్పూన్లు.
తయారీ విధానం : కడాయిలో నెయ్యి వేసి రవ్వను బంగానే రంగు వచ్చే వరకు వేయించాలి. ఇందులో గుమ్మడికాయ తురుము వేసి ఐదు నిమిషాల పాటు కలపాలి. ఇందులోనే యాలకుల పొడి, చక్కెర వేసి మరో నాలుగు నిమిషాలు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి మీదే వీటిని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో మైదా, గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్లు పోసి చపాతీ పిండి కంటే కాస్త వదులుగా కలుపుకోవాలి. కాసేపు దీన్ని పక్కన పెట్టాలి. పిండిని చిన్న ఉండలు చేసి పాలిథిన్ షీట్మీద చేతులతో పూరీ సైజులో ఒత్తాలి. దీంట్లో ముందు చేసిన గుమ్మడి ఉండలను పెట్టి మూసేయాలి. చేతికి కాస్త నూనె రాసుకొని వీటిని పూరీల్లాగా చేతితోనే ఒత్తుకోవాలి. ఆ తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.