Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సారా షా గుఫ్తా... గుండె లోతుల నుంచి ఉబికి వచ్చిన ప్రతి కన్నీటి చుక్కా అక్షరంగా మలిచింది. అనుభవించిన మానసిక వేదనను కవిత్వంగా ఆవిష్కరిం చింది. ఆ అక్షరాలతోనే మనసుకైన గాయానికి ఓదార్పు పొందాలనుకుంది. మళ్ళీ మళ్ళీ అదే గాయం... ఆమెను కుంగదీసింది. ఈ పురుషా ధిక్య సమాజంలో వివక్షను భరించలేక బలవంతం గా ప్రాణాలు విడిచినా... ఓ కవయిత్రిగా ఆకాశ మంత ఎత్తుకు ఎదిగింది. ఈ అరుదైన కవయిత్రిని 'ది వైర్' అనే వెబ్ పత్రిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితం, రచనల గురించి మనమూ తెలుసుకుందాం...
సారా షా గుఫ్తా... ఓ నిరుపేద కుటుంబంలో 1954 అక్టోబర్ 31న పాకిస్తాన్ లోని గుజరాన్ వాలా అనే ప్రాంతంలో పుట్టింది. భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినపుడు ఈమె పూర్వీకులు పంజాబ్ నుండి కరాచీ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. సారాకు చిన్నతనం నుండి చదువంటే ఎంతో ఇష్టం. కానీ పేదరికం వల్ల పదో తరగతి కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోయింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఎన్నో కష్టాలను అనుభవించింది. తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. మారు తల్లి నుండి ఆమెకు ఎలాంటి ప్రేమాభి మానాలు దొరకలేదు.
మానసిక సమస్యతో...
పదిహేడు సంవత్స రాలకే సారాకు వివాహ మయింది. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత పెండ్లి పేరుతో ముగ్గురు వ్యక్తులు ఆమె జీవితంలోకి వచ్చారు. ఒక్కరి నుండి కూడా ఆమెకు సరైన ఆదరణ లభించలేదు. దాంతో మానసికంగా కుంగి పోయింది. చివరకు మాననసిక సమస్యతో ఆస్పత్రిలో కొంత కాలం చికిత్స కూడా తీసుకుంది. ఆ సమయంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కొంత కాలానికి కోల్కొని ఇష్టమైన కవిత్వాన్ని ప్రారంభించింది. కొంత కాలం వరకు కవిత్వమే జీవితంగా బతికింది.
మళ్ళీ మళ్ళీ అవే కష్టాలు...
ఆ సమయంలోనే షాహరీ సాబ్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెండ్లి వరకు వెళ్ళింది. పెండ్లి ఖర్చులకు ఆమె దగ్గర డబ్బులు కూడా లేవు. ఇద్దరూ చెరిసగం వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బట్టలు కూడా కొనలేక తన స్నేహితురాలి బట్టలు వేసుకుని పెండ్లి చేసుకోడానికి వెళుతుంది. అప్పటికి ఆమె చేతిలో కేవలం ఆరు రూపాయలు మాత్రమే ఉన్నాయి. షాహరీ సాబ్తో పెండ్లి తర్వాత అతని ఇంటికి వెళ్ళింది. అక్కడకు వెళ్ళే సరికి ఆమె దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలిలాయి. అప్పుడే ఆ ఇంటి యజమాని వచ్చి అద్దె చెల్లించమంటూ గోల చేశాడు. దాంతో ఆమె దగ్గర మిగిలివున్న ఆ రెండు రూపాయలు తీసుకుని అద్దె చెల్లించాడు. ఈ పెండ్లి తర్వాత అయిన తన జీవితం సుఖంగా వుంటుందని అనుకున్న ఆమెకు మళ్ళీ మళ్ళీ అవే బాధలు.
డబ్బులు చెల్లించలేక...
తర్వాత పరిస్థితి ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అతను పని చేయడు. తను పని చేయడానికి వెళతానంటే ''మా కుటుంబంలో ఆడవాళ్ళను గడప దాటి అడుగు బయట పెట్టనివ్వరు'' అంటూ తన వంశం గురించి గొప్పగా చెబుతుంటాడు. అలా పేదరికంతోనే రోజులు గడిచిపోయాయి. ఇలాంటి స్థితిలోనే ఆమె గర్భం దాల్చింది. ఇంటి అద్దె కట్టకపోవడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. దాంతో మరో ఇంటికి మారిపోతారు. అప్పటికి ఆమె ఏడు నెలల గర్భిణీ. మానసికంగా, శారీరకంగా చాలా బలహీనంగా తయారయింది. భర్త తన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోడు. సారాకు నొప్పులు మొదలవుతాయి. ఆమె బాధ చూడలేక ఆ ఇంటి యజమాని ఓ ఆస్పత్రిలో చేర్పిస్తాడు. ఆస్పత్రిలో సారా మృత శిశువుకు జన్మనిస్తుంది. కండ్లు తెరిచి చూసేసరికి ప్రాణం లేని బిడ్డను చూసి భరించలేకపోతుంది. ఓ పక్క ఆస్పత్రి వారికి ఫీజు కట్టాలి. చెల్లించే వరకు బయటకు వెళ్ళడానికి వీల్లేదని డాక్టర్లు అంటారు. దాంతో డబ్బులు కట్టి బిడ్డ మృతదేశాన్ని తీసేకెళతానని డాక్టర్లను బతిమలాడుకుని అక్కడ నుండి వెళుతుంది.
భరించలేక...
ఆమె వెళ్ళేసరికి భర్త ఇంట్లోనే వుంటాడు. బాబు పుట్టి చనిపోయిన విషయం చెప్పినా అతనిలో ఎలాంటి చలనం లేదు. అది ఆమెను మరింత కుంగదీసింది. తన స్నేహితురాలి వద్ద మూడు వందలు అప్పుగా తీసుకుంది. అప్పటికే ఆమెకు విపరీతమైన జ్వరం. ఒళ్ళు కాలిపోతుంది. అవేమీ లెక్కచేయక పిచ్చి దానిలా పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి చేరుకుంటుంది. అక్కడ కట్టాల్సిన ఫీజు చెల్లించగా ఆమె దగ్గర ఐదు రూపాయలే మిగాలాయి. ఆ డబ్బు చనిపోయిన బిడ్డ దహన సంస్కారాలకు సరిపోదు. ఆ పరిస్థితుల్లో ఆస్పత్రిలో వాళ్ళందరూ చందాలు వేసుకుని దహనసంస్కారాలు పూర్తి చేస్తారు. బిడ్డ చనిపోవడం, మగవారి చేతుల్లో పదే పదే మోసపోవడం భరించలేకపోతుంది. చివరకు రైలు కింద పడి 1984 జూన్ 4న 30 ఏండ్లకే తుది శ్వాస విడిస్తుంది.
ఏక్ థీ సారా
సారా చనిపోయే వరకు ఆమె కవిత్వం గురించి ఈ ప్రపంచానికి పెద్దగా తెలియదు. పదో తరగతి కూడా పూర్తి చేయమని ఆమె ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అద్భుతమైన రచనలు చేసింది. ఆమె జీవితాన్ని ఎలాగైనా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆమె స్నేహితురాలు, రచయిత అయిన అమృతా ప్రీతమ్ ఆమె జీవితాన్ని ఓ పుస్తకంగా తీసుకువచ్చింది. అమృతా ప్రీతమ్ భారతీయ రచయిత్రి. 1990లో ప్రచురితమైన ఈ పుస్తకానికి 'ఏక్ థీ సారా'' అని పేరు పెట్టింది. 'వింగ్స్ కల్చరల్ సొసైటీ'' వారు అమృతా ప్రీతమ్ రాసిన పుస్తకాన్ని ప్రచురించారు. దీన్నే 1994లో ''లైఫ్ అండ్ పొయిట్రీ ఆఫ్ సారా'' పేరుతో ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. ఈమె జీవితాన్ని షాహిద్ అన్వర్ అనే వ్యక్తి ''మై సారా'' పేరుతో ఓ నాటిక కూడా రూపొందించారు. అలాగే ధనిష్ ఇక్బాల్ అనే అతను ''సారా కా సారా ఆస్మాన్' (ఆకాశమంతా సారానే) పేరుతో మరో నాటిక రూపొందించారు. అమృతా ప్రీతమ్ రాసిన పుస్తకం ఆధారంగా ఓ నాటికను రూపొందించి 2015లో 'ఆలిండియా రేడియోస్ ఉర్దూ థియేటర్ ఫెస్టివల్లో' ప్రదర్శించారు. అలాగే సారా రచనలన్నింటినీ కలిపి షాహిద్ అహ్మద్ 'ఆంఖే', 'నీంద్ కా రంగ్' అనే రెండు పుస్తకాలు ప్రచురించాడు. సారా రాసిన ఉర్దూ, పంజాబీ కవిత్వాలను అసాద్ అల్వీ ''ద కలర్ ఆఫ్ స్లీప్ అండ్ అదర్ పోయమ్స్'' అనే పేరుతో 2016లో ఇంగ్లీషులోకి అనువదించాడు. ుు