Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా భారి నుండి కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న పెద్దలైతే అలాంటి ఆహారం తీసుకుంటారు. కానీ పిల్లలు అలా కాదు. వాళ్ళకు రోజుకో వెరైటీ కావాలి. నోటికే కాదు చూడటానికి కూడా బాగుండాలి. అలాంటి గడుగ్గాయిల కోసం కొన్ని రకాల వంటలు మీ కోసం. సాయంత్రపు స్నాక్స్గా చిన్నా పెద్దా వీటిని ఎంజారు చేస్తూ తినవచ్చు.
అల్లంతో...
కావాల్సిన పదార్థాలు : మినప్పప్పు - 2 కప్పులు, అల్లం ముద్ద - 2 టీస్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగు, జీలకర్ర - 2 టీస్పూన్లు, మిరియాలు - అర టీస్పూను, ఎండుకొబ్బరి తురుము - టీస్పూను, ఉప్పు - 2 టీస్పూన్లు, లవంగాలు - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ముందుగానే మినప్పప్పుని నానబెట్టుకోవాలి. మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెల మాదిరిగా చేసి.. మరిగిన నూనెలో వేయించి తీయాలి. అంతే వేడివేడిగా ఘూటుఘూటుగా ఉండే అల్లం వడలు రెడీ అయినట్లే.. ఏ చట్నీతో అయినా వీటిని లాగించొచ్చు.
అరటికాయతో...
కావాల్సిన పదార్థాలు : ఉడికించిన అరటికాయ (తొక్కతో పాటు)- ఒకటి, బియ్యం పిండి - కప్పు, క్యారెట్ తురుము - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - పది, పచ్చిమిర్చి - ఐదు, కొత్తిమీర తురుము - అరకప్పు, ఉప్పు - తగినంత, జీలకర్ర - చెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము, తగినంత బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ వడలు రెడీ.
మొక్కజొన్నలతో...
కావాల్సిన పదార్థాలు : మొక్కజొన్న పొత్తులు - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, మిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట (చిన్నది), కరివేపాకు - రెమ్మ, అల్లం - చిన్న ముక్క, జీలకర్ర - ఒక టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె - సరిపడినంత, శనగపిండి- రెండు టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్- రెండు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం : మొక్కజొన్న పొత్తును ఒలచి పెట్టుకోవాలి. వీటికి తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసేప్పుడు నీటిని వాడకూడదు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. కార్న్ఫ్లోర్ జతచేసి బాగా కలపాలి. ఒక వేళ పొత్తులు లేతగా ఉండి, పిండి పలుచగా అయితే శనగపిండి కలుపుకోవచ్చు. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకొని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే వేడివేడిగా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ అయినట్లే.. టొమాటో సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
అటుకులతో...
కావాల్సిన పదార్థాలు : అటుకులు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - మూడు, శనగపిండి - రెండు టీ స్పూన్లు, అల్లం తురుము - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్, ఉల్లిగడ్డ ముక్కలు - రెండు టీ స్పూన్లు, నీరు - తగినంత, కరివేపాకు - రెబ్బ, కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు, కారం : పావు స్పూన్, పసుపు- పావు స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత.
తయారుచేసే విధానం : అటుకులను నీళ్ళలో నానబెట్టుకోవాలి. పది నిముషాల తర్వాత నీళ్ళు తీసేసి చేతితో మెత్తగా పిండిలా అయ్యే వరకు చిదుముకోవాలి. ఒక గిన్నెలో మెత్తగా చేసుకున్న అటుకులు, శనగపిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్పై కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత మీడియం మంటపై అటుకుల మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని వేయించుకోవాలి. అంతే వేడి వేడి అటుకుల వడలు సిద్ధాం.