Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి కలిగిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. తృణధాన్యాలతో చేసిన వంటలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే వాటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అందులోనూ పిల్లలు అస్సలు ఇష్టపడరు. వీటిని చూస్తే మూతి తిప్పేస్తారు. అందుకే తృణధాన్యాలతో తయారు చేసిన వంటలు కాస్త వెరైటీగా, కలర్ఫుల్గా కనిపిస్తే ఎలాంటి గోల చేయకుండా తినేస్తారు. అలాంటి వంటలకు కొన్ని మీకోసం...
అండు కొర్రల ఊతప్పం
కావలసిన పదార్ధాలు : అండు కొర్రలు - పావు కప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద - 1 టీ స్పూను, నూనె - తగినంత,
మినప్పప్పు - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం : అండు కొర్రలు, మినప్పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో అల్లం పచ్చి మిర్చి ముద్ద, ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని ఊతప్పంలా పరిచి పైన టొమాటో తరుగు, కొత్తి మీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరవాత (రెండో వైపు తిప్పకూడదు) మరికాస్త నూనె వేసి తీసేయాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
ఊదల ఇండియానా
కావలసిన పదార్ధాలు : ఊదలు - 1 కప్పు, తరిగిన పచ్చి మిర్చి - 5, నెయ్యి - టేబుల్ స్పూన్లు, కరివే పాకుపొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, కూర గాయ ముక్కలు - ఒక కప్పు (క్యారట్,బీన్స్, క్యాలీ ఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి), జీలకర్ర - ఒక టీ స్పూను, నీళ్లు - అర కప్పు, ఇంగువ - పావు టీ స్పూను, కొత్తిమీర - తగినంత
తయారు చేసే విధానం : ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుక్కర్లో నెయ్యి పోసి పూర్తిగా కరిగిన తరువాత జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేయాలి. మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించాలి.
సామల టొమాటో పులావ్
కావలసిన పదార్ధాలు : సామలు - 1 కప్పు, ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి - 2, నెయ్యి లేదా నూనె - 2 టీ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, అల్లం తురుము - 1 స్పూను, క్యారట్ తరుగు - 1 టేబుల్ స్పూను, సెనగ పప్పు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూను, అల్లం తురుము - 1 టీ స్పూను, టొమాటో తరుగు - పావు కప్పు, ఆవాలు - 1 టీ స్పూను, ఎండు కారం - పావు టీ స్పూను, నీళ్లు - తగినంత, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, ఉడికించిన బఠాణీ - 1 కప్పు, కొత్తిమీర - 1 టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం : సామలకు తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి కాగాక ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు, ఉల్లిగడ్డ తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, పసుపు, ఎండు కారం వేసి మరోమారు కలపాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామ లలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి, కొబ్బరి చట్నీతో గాని, కొత్తిమీర చట్నీతో గాని వడ్డించాలి... చాలా రుచిగా ఉంటుంది.
సామల ఖీర్
కావలసిన పదార్ధాలు : సామలు - ఒక కప్పు, నెయ్యి - ఒక టేబుల్ స్పూను, కిసిమిస్ - ఒక టేబుల్ స్పూను,
జీడి పప్పు పలుకులు - 10, ఏలకుల పొడి - అర టీ స్పూను, కొబ్బరి పాలు - ఒక కప్పు, బెల్లం పొడి - ఒక కప్పు.
తయారు చేసే విధానం : సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు జతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.