Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మదర్ ఆఫ్ డాన్స్'గా ప్రేక్షకుల్ని అలరించిన ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ఖాన్ (71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని గురునానక్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు రెండు వేల పాటలకు పైగా నృత్య దర్శకురాలిగా పని చేసిన సరోజ్ఖాన్ ఇకలేరనే వాస్తవాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది.
ఇప్పుడు స్టార్లుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో మంచి గుర్తింపు పొందిన హీరో, హీరోయిన్లు అందరూ సరోజ్ఖాన్ నృత్య దర్శకత్వంలో పాటలకు స్టెప్పులు వేసినవాళ్లే. ఉత్తమ నృత్య దర్శకురాలిగా మూడు సార్లు జాతీయ అవార్డును అందుకున్న సరోజ్ఖాన్ సినీ జీవిత ప్రయాణం గురించి కొన్ని విశేషాలు..
1948 నవంబర్ 20న ముంబయిలో జన్మించిన సరోజ్ఖాన్కి చిన్నతనం నుంచే డాన్స్పై అమితాసక్తి ఉంది. దీంతో తన నీడని చూస్తూ డాన్స్ చేసేదట. 1950లో బాలనటిగా సరోజ్ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యారు.
పదేళ్ళ వయసులో ప్రముఖ నటి మధుబాల నటించిన సినిమాలో గ్రూప్ డాన్సర్గా నటించే అవకాశం లభించింది. 1958లో వచ్చిన 'హౌరాబ్రిడ్జ్' చిత్రంలోని 'ఆయియే మెహర్బాన్..' అంటూ సాగే పాటలో గ్రూప్ డాన్సర్గా సరోజ్ఖాన్ చేసిన నృత్యం చూసి ప్రముఖ కొరియోగ్రాఫర్ బి.సోహన్లాల్ తన సహాయకురాలిగా నియమించుకున్నారు. తర్వాత కాలంలో ఆయన్నే ఆమె వివాహం చేసుకున్నారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న రోజుల్లో ఓసారి అనుకోకుండా 'దిల్ హి తో హై' సినిమాలోని ఓ పాటకు సరోజ్ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట హిట్ అవ్వడంతో మంచి పేరొచ్చింది.
1974లో విడుదలైన 'గీతా మేరా నామ్' సినిమాలో నృత్యదర్శకురాలిగా సరోజ్ఖాన్ పేరుని టైటిల్స్లో వేశారు. ఆ తర్వాత సుభాష్ ఘారు తెరకెక్కించిన 'విధాత' చిత్రంలోని ఓ పాటని కంపోజ్ చేసిన సరోజ్ఖాన్ ఫేమస్ అయ్యారు.
'మిస్టర్ ఇండియా', 'నగీనా', 'చాంద్నీ' వంటి హిట్ చిత్రాల్లో కొరియోగ్రాఫర్గా పని చేశారు. మాధురీ దీక్షిత్కు పేరు తెచ్చి పెట్టిన 'తేజాబ్' చిత్రంలోని 'ఏక్..దో..తీన్' పాటకు, 'తేనేదార్' సినిమాలోని 'తమ్మ తమ్మ లోగే' పాటకు, 'బేటా'లోని 'థక్ థక్ కర్నే..' పాటలకు సరోజ్ఖాన్ చేసిన కంపోజింగ్ అందర్ని విశేషంగా మెప్పించింది. శ్రీదేవి, రేఖా, మాధురీదీక్షిత్, రాణీముఖర్జీ, కరిష్మాకపూర్, కరీనాకపూర్, ఐశ్వర్యరారు.. ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లకు డాన్స్లో మంచి గుర్తింపు రావడానికి సరోజ్ఖానే కారణం.
మూడు జాతీయ అవార్డులను దక్కించుకున్న సరోజ్ఖాన్ తెెలుగులో చిరంజీవి నటించిన 'చూడాలని వుంది' చిత్రానికి కూడా ఉత్తమ కొరియోగ్రాఫర్గా 1998లో నంది అవార్డుని సొంతం చేసుకున్నారు.
సినీ రచయితగానూ మెప్పించారు. 'వీర్దాదా', 'దిల్ తేరా దీవానా', 'దావా', 'బీనామ్' వంటి పలు చిత్రాలకు కథని అందించారు. అలాగే ఎన్నో డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం మెప్పించారు.
మదర్ ఆఫ్ డాన్స్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ఖాన్ మృతిపట్ల యావత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెతో తమకి ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
సరోజ్ఖాన్ అంత్యక్రియలు ముంబయిలోని మలద్లో శుక్రవారం సాయంత్రం ముగిశాయని ఆమె కుమార్తెల్లో ఒకరైన హీనాఖాన్ తెలిపారు. సరోజ్ఖాన్కు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు.