Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరికి రాయడం ప్యాషన్... మరికొందరికి గీయడం ప్యాషన్... ఇంకొందరికి నటించడం ప్యాషన్... సోనియా ఆకుల... ఈమెకు మాత్రం సమాజసేవ చేయడం ప్యాషన్. కాలేజీ రోజుల్లోనే అనాథ పిల్లలకు తన వంతు సేవ చేయడం మొదలుపెట్టారు. వయసుతో పాటే సేవ చేయాలనే ఆలోచన కూడా పెరుగుతూ వచ్చింది. అందుకే 'ఆసా' అనే సంస్థను కూడా స్థాపించారు. 'ప్రాజెక్ట్ ప్రేరణ' పేరుతో యువతలో సమాజం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అంతేనే సినీ ఇండిస్టీలో తెలుగు అమ్మాయిలు... అందులోనూ తెలంగాణ అమ్మాయిలు లేని లోటు తీర్చుతున్నారు. కరోనా వైరస్పై రామ్గోపాల్ వర్మ తీసిన 'వైరస్' సినిమాలో ప్రధానపాత్ర పోషించారు. సమాజ సేవలోనే కాదు నటనలోనూ తనకు తానే సాటి అనిపించుకుంటున్న ఆమెతో మానవి సంభాషణ...
మా సొంత ఊరు మంథని. అమ్మ మల్లీశ్వరి, నాన్న చక్రపాణి. నాన్న వ్యవసాయం చేసేవారు. అమ్మ ఇంట్లోనే బట్టల వ్యాపారం చేసేది. ఇంటర్ నుండి హైదరాబాద్లోనే చదువుకున్నా. నాకు ఇద్దరు అన్నయ్యలు. అమ్మను చూసి స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నా. ఇంట్లో చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. చదువుంటే ఏదైనా సాధించవచ్చు అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. మా ముగ్గురిని చదివించడం కోసమే అమ్మా, నాన్న కష్టపడేవారు.
కాలేజీ రోజుల్లోనే...
నాన్నకు సాయం చేసే గుణం ఎక్కువ. నేనూ చిన్నప్పటి నుండి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో చేసేదాన్ని. అలా సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరిగింది. నాన్న ప్రోత్సాహంతో బీటెక్ పూర్తి చేశా. అయితే నాకు సివిల్స్ చేసి కలెక్టర్ కావాలని కోరిక. చిన్న సంతకంతో ఊరంతా మార్చేయవచ్చని అప్పట్లో అనుకునేదాన్ని. రెండు సంవత్సరాలు సివిల్స్కి ప్రయత్నించా. కానీ సాధ్యం కాలేదు. మా పెద్దన్నయ్య ఇంజనీర్, చిన్నన్నయ్య డాక్టర్. బీటెక్లో ఉన్నప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత సంతోష్నగర్లోని ఓ అనాథ ఆశ్రమంలోని పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేదాన్ని. ఎక్కవ సమయం వాళ్ళతోనే గడిపేదాన్ని. చేతనైన సాయం చేసేదాన్ని. అలాగే తరుణీ, యువభారతి, ఆర్కే మఠం వాళ్ళతో కలిసి వాలెంటీర్గా కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. చేస్తున్నవి మంచిపనులు పైగా చదువులో కూడా ఫస్టే వుండేదాన్ని కాబట్టి ఇంట్లో ఏమీ అనేవాళ్ళు కాదు.
'సినీవారం' వల్లనే
ఇంజనీరింగ్ తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. అప్పుడు అంతర్జాతీయ కార్యక్రమాలు జరగుతుండేవి. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడ గలిగేదాన్ని. దాంతో ఆ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ నేనే చూసుకునేదాన్ని. మినిట్స్ తయారు చేసేదాన్ని. ప్రభుత్వ అధికారుల్లో చాలా మందికి నా గురించి తెలిసింది. దాంతో ప్రభుత్వ కార్యక్రమాలకు నన్నే పిలిచేవారు. అలాగే హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ప్రాజెక్టులు కొన్ని చేశాను. అలాంటి కార్యక్రమాల్లోనే మామిడి హరికృష్టగారు నన్ను చూశారు. 'సినీవారం' అనే ప్రోగ్రామ్ చేయడానికి నన్ను పిలిచారు. ఒకే ఒక్క వారం చేశాను.
వైరస్ సినిమా ద్వారా
'సినీవారం' ప్రోగ్రామ్కు వచ్చిన సినిమా పెద్దలు ''చాలా బాగా చేస్తున్నావు, స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగుంది, చూడటానికి బాగున్నావు, యాక్టింగ్లోకి వస్తే బాగుంటుంది, తెలుగు అమ్మాయిలు ఇండిస్టీలో పెద్దగా లేరు'' అనేవారు. అయితే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొంత మంది తెలిసిన వాళ్ళు ఫేస్బుక్లో చూసి యాడ్స్, షాట్ ఫిలింమ్స్ చేయడానికి పిలిచారు. సామాజిక అవగాహన కల్పించే సినిమాలు కావడంతో వాటికి ఒప్పుకున్నా. ఫేస్బుక్లో చేసే 'జార్జ్రెడ్డి' సినిమాలో అవకాశం వచ్చింది. అందులో చెల్లెలి పాత్ర చేశాను. చిన్న పాత్రే అయినా మంచి సినిమా కాబట్టి చేశా. తర్వాత రామ్గోపాల్ వర్మగారు కరోనా పైన చేసిన 'వైరస్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇది కూడా ప్రస్తుతం సమాజానికి చాలా అవసరమైనది కాబట్టి చేశా. రామ్గోపాల్ వర్మగారు నా నటన చూసి ఎంతో మెచ్చుకున్నారు. ట్రైలర్ చూసి చాలా మంది బాగా నటించావన్నారు. మంచి గుర్తింపు కూడా వచ్చింది. సంతోషంగా అనిపించింది. త్వరలోనే ఇది రిలీజ్ కాబోతుంది.
మంచి అవకాశాలు వస్తే...
ఈ ఏడాదిన్నరలో కొన్ని సినిమాల్లో అడిగారు. అయితే కొంత మందికి నేను నచ్చలేదు. కొన్ని పాత్రలు నాకు నచ్చలేదు. నేను చేసే పాత్ర ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది అనుకుంటేనే నటించాలనుకుంటున్నా. మరో విషయం మన తెలుగు ఇండిస్టీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారని అంటుంటే విన్నా. అప్పట్లో ఈ విషయం గురించి పెద్దగా తెలీదు. ఇండిస్టీలోకి వచ్చిన తర్వాతనే ఈ విషయం అర్థమయింది. తెలంగాణ అమ్మాయిల్లో కూడా టాలెంట్ వుంది, మనం కూడా నటించవచ్చు అనేది నా తర్వాతి తరం వారికి తెలియజేయాలనే ఆలోచన కూడా కలిగింది. అందుకే సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో కచ్చితంగా నటిస్తా.
'ఆసా'ను స్థాపించాము
సామాజానికి నావంతు సేవ చేయాలనే కోరిక నాతో పాటే పెరుగుతూ వస్తుంది. ఆశ్రమంలో పిల్లలకు అదే ప్రపంచం. బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. అందరూ వాళ్ళ దగ్గరకే పోయి కేక్కట్ చేస్తుంటారు, వివిధ కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే వాళ్ళకూ బయటకు వెళ్ళాలని, సరదాగా గడపాలని వుంటుంది. అందుకే 2017లో ఆ పిల్లలను టూర్కి తీసుకువెళ్ళాలని అనుకున్నా. దానికి రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది. దానికి నాకు ఫండ్ దొరకలేదు. అయితే వ్యక్తిగతంగా కన్నా ఓ సంస్థగా వుంటే ఫండ్ ఇవ్వగలమని తెలిసిన వాళ్ళు అన్నారు. అందుకే 2017లో 'ఆసా' సంస్థను ఏర్పాటు చేశాను.
అమ్మాయిల చదువుకు అధిక ప్రాధాన్యం
ఆర్గనైజేషన్ పెట్టాక ఎలాంటి కార్యక్రమాలు చేయాలో కచ్చితంగా అనుకున్నాం. మన దగ్గర సేవ అంటే అనాథ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తే చాలు అనుకుంటారు. అయితే మనం జీవితంలో నిలదొక్కుకునే వరకు ఎలాగైతే ఆర్థికంగా, మానసికంగా తల్లిదండ్రుల నుండి సహకారం వుంటుందో అలాంటి సహకారం ఆ పిల్లలకు కూడా అందజేయాలి. మేము ఒంటరి వాళ్ళం కాదు. మాకూ ఈ సమాజంలో సపోర్ట్ వుంది అనే నమ్మకం వాళ్ళకు కల్పించాలి. మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. బయటి ప్రపంచాన్ని వాళ్ళకు పరిచయం చేయాలి. అందుకే ప్రతి సంవత్సరం దసరా సమయంలో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి పిల్లలను అక్కడకు తీసుకెళుతుంటాం. ఏడాదికి కావల్సిన వస్తువులు వాళ్లు పిల్లలకు ఇస్తుంటారు. కొంత డబ్బు కూడా సాయం చేస్తుంటారు. ఎప్పుడూ ఉద్యోగాలతో బిజీగా గడిపే వాళ్ళకు కూడా సాయం చేశామనే తృప్తి ఉంటుంది.
కరోనా సమయంలో
లాక్డౌన్ సమయంలో తినేందుకు తిండి లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా కొంత వరకు 'ఆశా' తరపున భోజనం పెట్టగలిగాం. గ్రామాల్లో కూడా చేశాం. సిటీలోని కుకట్పల్లి దగ్గరలోని స్లమ్ ఏరియాల్లో నిత్యావసరాలు పంచాము. అధికారులతో మాట్లాడి పదిహేను వందలు వచ్చేలా చేశాం. అనాథాశ్రమం పిల్లలకు అధికారుల ద్వారా సాయం అందేలా చేయగలిగాం. అలాగే మంథని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో ఐదు లైబ్రరీలను కూడా ఏర్పాటు చేశాం. వంద లైబ్రరీలు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం. మా టీంలో ఉన్నవాళ్ళందరూ ఏదో ఒక వృత్తిలో ఉన్నవారు. ప్రతి నెలా అందరం మాట్లాడుకుంటాం. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయవచ్చో చర్చించుకుంటాం. దిశా అత్యాచార నింధితుడి భార్య రేణుకకు నెలకు పదిహేను వేలు సాయం చేస్తున్నాం. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆరు నెలల తర్వాత ఆ పాప పేరుతో కొంత డబ్బు ఫిక్స్డ్ చేయాలనుకుంటున్నాం. అలాగే లాస్య అనే పాపను దత్తత తీసుకుని చదివిస్తున్నాం. 50 మంది అమ్మాయిలకు మంచి చదువు అందిచాలనే లక్ష్యం పెట్టుకున్నాం.
యువతకు అవగాహన
నేను చేసే కార్యక్రమాల ద్వారా సమాజంలో చిన్న మార్పు వచ్చినా చాలు. చాలా తృప్తిగా వుంటుంది. అయితే ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంట్లో నా పెండ్లి గురించి చర్చ జరుగుతూ వుంటుంది. కాకపోతే 'కష్టపడి ఏదో చేయాలనే తపిస్తుంది, చేయనీ' అని ప్రోత్సహిస్తుంటారు. సాఫ్ట్వేర్ వైపు ఉంటే లైఫ్ చాలా బాగుండేది అనేవారు కూడా ఉన్నారు. అయినా సర్వీస్ చేస్తున్న దాంట్లో ఉన్న ఆనందం మరెందులో నాకు దొరకదు. ఆడపిల్లల చదువుతో పాటు రైతుల సమస్యలపై కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే యువతకు అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. ఒంటరి మహిళల కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. సమాజం పట్ల యువతకు అవగాహన కల్పించాలనే ఆలోచనతో పదో తరగతి నుండే గ్రామాల్లో పిల్లలకు వివిధ వర్క్షాపులు పెడుతున్నాం. 'ప్రాజెక్ట్ ప్రేరణ' పేరుతో వీటిని నిర్వహిస్తున్నాం.
మహిళలు స్ట్రాంగా ఉంటేనే
మహిళా సాధికారత గురించి చాలా మంది చెబుతుంటారు. కేవలం ఆర్థికంగా ఉంటే సరిపోదు. మహిళలకు మానసిక సపోర్ట్ కావాలి. సాధారణంగానే అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా వుంటారు. కానీ ఆడపిల్లవి అలా వుండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటుంటారు. దాంతో నిజంగానే నేను ఏం చేయలేనోమో, ఆడపిల్లను కదా అనే ఆత్మన్యూతన భావం వచ్చేస్తుంది. సమాజంలో ఇలాంటి ధోరణి మారాలి. మనలో ఉన్న బలాలను మనమే గుర్తించాలి. అలాగే మన ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలి. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు తమ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. కుటుంబం కోసం మాత్రం ఎంతైనా త్యాగం చేస్తారు. మనగురించి మనమే ఆలోచించాలి. ముందు మహిళలు స్ట్రాంగా వుంటేనే ఏమైనా చేయగలం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరేమనుకుంటారో అనే భయం వదిలేసి. మన మనసుకు నచ్చింది చేయాలి.