Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటికప్పుడు కొత్తగా
తమ అవసరాలకు తగిన ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది తల్లులు నిరాశకు గురవుతన్నారు. ఒకప్పుడు నేను కూడా ఇలాంటి నిరాశకే గురయ్యాను. ఈ నిరాశను పూడ్చడానికే ది మామ్ స్టోర్ స్థాపించాను. కాబట్టే ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఎన్ని ఉత్పత్తులు వచ్చినా తల్లులు, పిల్లల అవసరాలు ఇంకా పెరుగుతునే ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. దీనికోసం తల్లుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. వారి ఆసక్తులు గమనిస్తున్నాం. ఈక్రమంలో తల్లులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో పరిశీలిస్తూ మామ్ స్టోర్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు బయటకు తెస్తుంది.
- సురభీ,
ది మామ్ స్టోర్ వ్యవస్థాపకురాలు
సురభీ భాటియా 2017లో గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమెకు ధరించేందుకు సరైన దుస్తులు ఎక్కడా దొరకలేదు. ప్రసూతి సమయంలోనూ ఇదే సమస్య ఎదురయింది. ఉద్యోగంలో నిత్యం బిజీగా వుండే ఆమె తనకు తగిన బట్టల కోసం చాలా వెదికారు. ఎంత వెదికినా దొరకపోవడం ఎంతో నిరాశకు గురిచేసింది. తనలాగే ఎంతో మంది మహిళలు తల్లులు అవుతున్న సమయంలో ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని ఆమెకు అర్థమయింది. ప్రతి మహిళకు ఇదో అగ్ని పరీక్షలా ఆమె భావించారు. ఆ సమస్యకు సరైన పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం ఏం చేశారో చూద్దాం...
బెంగుళూరుకు చెందిన సురభీ కోజికోడ్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి. చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని డెలాయిట్ వద్ద టెలికాం, మీడియా టెక్నాలజీకి స్ట్రాటజీ కన్సల్టెంట్గా పనిచేశారు. తర్వాత ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్లోని ఎక్సలెన్స్ బందానికి నాయకత్వం వహించారు. ఇందులో పీటర్ ఇంగ్లాండ్ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. అలాగే అలెన్ సోలీ వంటి బ్రాండ్లతో కూడ ఈమె కలిసి పని చేశారు.
అంతరాన్ని రూపుమాపాలని
సురభికి పాప పుట్టింది. తన పాపకోసం ఉపయోగించే డైపర్స్ పట్ల ఆమెకు అంత తృప్తి అనిపించలేదు. బయట మార్కెట్లో దొరికే డైపర్లన్నీ ప్లాస్టిక్వే ఉన్నాయి. అవి తన పాపకు చాలా అసౌకర్యంగా అనిపించాయి. మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఉత్పత్తి చేయడాన్ని ఆమె గమనించారు. అయితే వాటిలో ఏది ఉపయోగించాలి అనే దానికి తల్లి కీలక నిర్ణయాధికారి. మార్కెట్లో ఈ అంతరాన్ని రూపుమాపాలని సురభీ 2018లో 'ది మామ్ స్టోర్'ను ప్రారంభించారు.
లాక్డౌన్ సమయంలోనూ
ఏదిఏమైనా సురభి గర్భవతిగా ఉన్న సమయంలో మాతృత్వానికి సంబంధించి ఆమెకు ఎన్నో అనుభవాలు ఎదరయ్యాయి. ఈ అనుభవాలే 2018లో 'ది మామ్ స్టోర్స్' స్థాపించడానికి ఆమెను ప్రేరేపించాయి. కోవిడ్ వల్ల దేశంలోనే కాక ప్రపంచంలోనే అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ ఈమె స్థాపించిన ది మామ్ స్టోర్ మాత్రం రెండు వందల శాతం లాభాలు సంపాదించింది. ప్రస్తుతం ఆమె ఉత్పత్తి చేస్తున్న ప్రసూతి దుస్తులు మార్కెట్లో విశేష ఆధరణ పొందుతున్నాయి. స్టోర్ స్థాపించిన నాటి నుండే సంవత్సరానికి 15 నుండి 17 శాతం వద్ధిని సాధిస్తోందని ఆమె అంటున్నారు. 2020 - 2025 మధ్య 15 శాతం కంటే ఎక్కువ వద్ధి చెందడానికి మార్కెట్లో అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.
అవసరాలకు తగ్గట్టు
స్టోర్ స్థాపించిన తర్వాత సురభీ చేసిన ప్రయాణంలో తల్లి అవసరాన్ని మరింత లోతుగా అర్థం చేసుకున్నారు. దానికి తగ్గట్టు మార్కెట్పై పరిశోధన చేశారు. సరైన ఉత్పత్తులను తల్లులకు అందజేయడానికి కృషి చేస్తున్నారు. దానికోసం ఆమె తన అపార్ట్మెంట్లోని గదిని స్టాక్ రూమ్గా మార్చేశారు. తాను తయారు చేయించిన ఉత్పత్తులతో మెల్లమెల్లగా వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆర్డర్లు వచ్చిన వెంటనే వాటిని కస్టమర్లకు అందజేసేవారు.
ది మామ్ స్టోర్ స్థాపించిన తర్వాత వేల మంది తల్లుల జీవితాలను సురభీ అధ్యయనం చేశారు. తల్లి అయిన సమయంలో వారి వయసు, వారి చదువు, వారు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు తెలుసుకున్నారు. మహిళలు ఈ సమాజంలో గతం కంటే భిన్నమైన జీవనశైలిని ఎంపిక చేసుకుంటున్నారు. దానికి తగినట్టుగానే వారి అవసరాలు ఉంటాయి. కాబట్టి మామ్ స్టోర్ వీరందరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల ఉత్పత్తులు అందిస్తుంది.
ఆన్లైన్ అమ్మకాలు
ఉద్యోగం చేసే తల్లులకు డైపర్ బ్యాగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డైపర్లతో పాటు ల్యాప్టాప్, ఇతర వస్తువులు పెట్టుకునే వెసులుబాటు ఆ బ్యాగ్లో వుంటుంది. ఇంకా టాప్స్, లెగ్గిగ్స్, ప్రసూతి దుస్తులు, డ్రెస్సులు, గౌన్లను కూడా అందిస్తుంది. అలాగే బిడ్డపుట్టిన కొత్తలో ధరించేందుకు వీలైన లోదుస్తులు, పిల్లలకు పాలిచ్చేందుకు అనుకూలంగా ఉండే టాప్లను తల్లులకు అందిస్తున్నారు. దిండులను, సపోర్ట్గా ఉండే బెల్టులతో సహా ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ధర ఐదు వందల రూపాయల నుండి మొదలైన ఐదు వేల వరకు స్టార్టప్ వెబ్సైట్ ద్వారా భారతదేశం అంతటా అమ్ముడవుతున్నాయి. వివిధ సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా కూడా విక్రయించబడతాయి. ఈ స్టార్టప్ ఇన్స్టాగ్రామ్లో 70,000 మందికి పైగా ఫాలోవర్లను సంపాదించింది.
ఏదేమైనా పిల్లలకు సంబంధించిన దుస్తుల విషయంలో కొత్త కొత్త బ్రాండ్లను ఉత్పత్తి చేయడానికి కంపెనీలు ఎంత దూరమైనా వెళతాయి. ''పిల్లల దుస్తులు ఉత్పత్తి చేసే చాలా కంపెనీలు రెండు, మూడు సంవత్సరాల పిల్లలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. తల్లులు మార్కెట్కి వెళితే అప్పుడే పుట్టిన పిల్లల నుండి రెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి సరైన దుస్తులు అందుబాటులో ఉండవు. ఇదే తల్లుల అసలు సమస్య. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో చాలా షాపులు మూసివేయడంతో మా అమ్మకాలు మరింతగా పెరిగాయి. గత రెండేండ్లలో 200 శాతం వద్ధిని సాధించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్టోర్ ఆదాయం 2019-2020లో సంపాదించిన మొత్తం ఆదాయానికి సమానం'' అంటున్నారు సురభి.
ఆర్డర్లను రద్దుచేసుకుని
లాక్డౌన్ సమయంలో ప్రముఖమైన ఎన్నో బ్రాండ్లు తమ అమ్మకాలను నిలిపివేశాయి. ఆ సమయంలో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీనికోసం కొన్ని అనవసరపు ఆర్డర్లను రద్దు చేసుకుని కేవలం తల్లులకు, పిల్లలకు అవసరమైన ఉత్పత్తులనే అందించేందుకు సురభీ పూనుకున్నారు. యాభై లక్షల రూపాయలతో ఈమె ప్రారంభించిన ఈ స్టార్టప్ బెంగళూరుకు చెందిన తొమ్మిది మంది సభ్యులతో పని చేస్తుంది. వీరు మహిళ గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డ పుట్టి ఆ బిడ్డకు ఐదేండ్లు వచ్చే వరకు కావల్సిన ఉత్పత్తులను అందిస్తూన్నారు.