Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...
గుమ్మడి కాయ : గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. దీన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి.
బొప్పాయి : బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజారు రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో విటమిన్ లోపాలు ఉండవు. అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తారు. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి.
కివి : ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి.
నిమ్మకాయ : సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
బత్తాయి : జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు బత్తాయి రసం తాగితే తక్షణం శక్తి వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
అరటిపండు : అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి.
అల్ల నేరేడు : సీజనల్గా వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లుకు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.