Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోకపల్లి సంస్థానంలో పల్లాబుర్జుగా ప్రసిద్ధి
- గుర్రాల శాలగా లైన్వాడ
నవతెలంగాణ - మహబూబ్నగర్
లోకపల్లి సంస్థానం చివరి మహారాణి లకీëదేవి పాలన కాలంలో ప్రస్తుత పట్టణం పల్లాబుర్జుగా పిలవబడుతుండేది. ఇక్కడ యజ్ఞం చేసే బ్రాహ్మణులు ఉండేవారని వీరే ఈ ప్రాంతంలో వర్షాలు కురిపించే వారని నానుడి ఉంది. సంస్థానం కోటగోడ సైతం పల్లాప్రాంతం వరకు ఉండేది. దీనికి సంబందించి ఆధారాలు నేటికీ ఉన్నాయి. కోట వెలుపల ప్రస్తుత పట్టణమంతా బావిలాగే ఉండేది. ప్రస్తుతం అది లైన్వాడగా పిలవబడుతుంది. ఈ ప్రాంతంలో లోకపల్లి సంస్థానాధీశులు తమ గుర్రాలను ఉంచేవారని చెబుతుంటారు. ఆసమయంలోనే సంస్థానానికి చెందిన నారాయణరావ్ అనే బ్రహ్మణుడు పల్లాబుజుర్గులోని బ్రాహ్మణుల మధ్య కాకుండా ప్రస్తుతం బసవేశ్వర మందిరంగా పిలవబడే శివాలయం దగ్గర ఉంటూ అక్కడే తపస్సు చేస్తుండేవాడు, లోకపల్లి సంస్థానానికి దాదాపు 4కి.మీ దూరంలో అడవిలో ఉండేవాడు. కొంతకాలం తర్వాత ఈయన శిష్యబృందాన్ని ఏర్పరచుకొని ఆశ్రమం, కుటీరాలు ఏర్పాటు చేసుకొని గాయత్రి మంత్ర జపం వేదాలు చదువుతుండేవారు. అదేకాలంలో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం బురాన్పూర్కు చెందిన అజ్రత్మహ్మద్సబ్బా ఫోజ్ ఖాద్రీ అనే ముస్లీం గురువు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఉన్న బువ్వమ్మగుట్టపై ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రార్థనలు చేస్తుండేవాడు. కొంతకాలం తర్వాత ఆయన కూడా శిష్యబృందం, కుటీరాలను ఏర్పాటు చేసుకున్నాడు. లోకాయపల్లి సంస్థానం పరిధిలో ఉన్న ఈ ప్రాంతం సంస్థానం పతనం అనంతరం అక్కడ ఉన్న వారు ఇక్కడికి వచ్చి నివసించడంతో నివాస ప్రాంతం పరిధి పెరిగినట్లు చెబుతారు. ఇద్దరు తపస్విలతో ఏర్పడిన ఈ ప్రాంతాన్ని నారాయణరావ్ పేరిట నారాయణపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది నారాయణపేటగా మారిందని పూర్వికులు చెబుతుంటారు. బసవేశ్వర మందిరం వద్దనున్న బ్రాహ్మణ గురువు, బువ్వమ్మగుట్టపై ఉన్న ముస్లిం గురువు మధ్య మంచి స్నేహబంధం ఉండేది. వారిరువురు పెరుగుతున్న నివాస ప్రాంతానికి ఒక పేరు పెట్టాలని నారాయణరావ్, అజ్రత్మహ్మద్లు సబ్బఫ్రోజ్ ఖాద్రీకి చెప్పారు. దీనికి ఆయన ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేసిన మీరు మీ పేరునే పెట్టాలని చెబుతుంటారు. కాగా ప్రస్తుతం బువ్వమ్మగుట్టగా పిలవబడుతున్న గుట్టకు ముస్లిం గురువు భార్య పేరును బ్రహ్మణ గురువే ప్రకటించినట్టు చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతం మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ విధంగా రెండు మతాల గురువులు సంచరించిన ప్రాంతంలో ఏర్పడిన పట్టణంగా నారాయణరావ్పేటను చెబుతారు. ఈప్రాంతాన్ని కొంతకాలం పుణేకు చెందిన పీశ్వాబాజీరావ్ పరిపాలించారు. వారి రాజ్యం ఇప్పటి ధన్వాడ వరకు విస్తరించి ఉండేది. అదే కాలంలో పట్టణానికి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత ప్రజలు వలస వచ్చి చేనేత వృత్తిని అభివృద్ధి చేసినట్టు మరో కథనం. అది రోజురోజుకు అభివృద్ధి చెందుతూ తెలుగు, ఉర్దూ, మరాటీ, కన్నడ భాషల సంగమంగా ప్రముఖ వ్యాపారకేంద్రంగా మారింది. ఆ కాలంలోనే నిజామాబాద్, గుల్బర్గా, నారాయణపేటకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా బల్దియాగా జిల్లాలో ఈ పట్టణమే ప్రథమం. అలాంటి ఈ పట్టణంలో నేడు 23వార్డులు, సుమారుగా 70వేల జనాభాతో విస్తరించి ఉంది. దినదినాభివృద్ధి చెంది ఆనాటి బల్దియా నేడు మున్సిపాలిటీగా ఏర్పడి ఆర్థిక ఇబ్బందులతోపాటు అనేక ఇబ్బందులతో సతమతమవుతుంది. ప్రస్తుతం పట్టణ ప్రజలు మంచినీటికి అల్లాడుతున్నారు. ఈ ప్రాంతం నుండి రాష్ట్రస్థాయికి ఎదిగిన రాష్ట్రనాయకులు ఉన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతున్నారు. ఇప్పటికైనా నారాయణపేట అభివృద్ధికి పార్టీలకతీతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.