Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్
నోటీసులు జారీ
నవతెలంగాణ-వెల్దండ
గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీ పని దినాలు పెంచక పోతే ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు తప్పదని కల్వకుర్తి ఏపీడీ గోవిందరాజు హెచ్చరించారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ పూర్వపు మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీల వారిగా గ్రామాల్లో నిర్వహించిన పని దినాలు కావాల్సిన లక్ష్యాన్ని, తదితర విషయాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. పనులు జరగని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్దాపూర్ అలివేల, గోకారం కృష్ణయ్య, జూపల్లి లక్ష్మయ్య, వెల్దండ శ్రీను, చెదురుపల్లి వెంకటయ్య, తాండ్ర బాల్జంగయ్యలకు షోకాజ్ నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ... వారం రోజుల్లోగా జాబ్ కార్డులు, 30 శాతం కూలీ దినాలు కల్పించాలని, లేని పక్షంలో వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశానికి రాని ఫీల్డ్ అసిస్టెంట్లకు సైతం నోటీసులు ఇవ్వనున్నట్టు ఏపీడీ పేర్కొన్నారు. గ్రామాల్లో పని చేయని లబ్దిదారుల జాబ్ కార్డులను తొలగించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లదే అని తెలిపారు. ఆధార్ సీడింగ్ తప్పని సరిగా చేయాలని సూచించారు. హరిత హారంలో నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలని ఏపీడీ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఏపీఓ లక్ష్మయ్య, టీఏ రాజ్కుమార్, లింగం, స్వామి, ఎఫ్ఏలు క్రాంతికుమార్, చెన్నయ్య, బాల్జంగయ్య, వెంకటయ్య, రవి, అలివేల, తదితరులు పాల్గొన్నారు.