- బరితెగించిన కోవలెంట్
- నవతెలంగాణ కథనంతో పగటిపూట పనులు బంద్
- ఆకస్మికంగా ఇవోపిఆర్డీ తనిఖీ
- అక్రమకట్టడాల నిర్ధారణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెదక్ జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూరు గ్రామంలో ఉన్న కోవలెంట్ ల్యాబోరేటరీ కంపెనీ బరితెగించింది. ఇష్టారాజ్యంగా అక్రమంగా కంపెనీ విస్తరణ పనులను చేపడుతోంది. ఒకవైపు ఆ కంపెనీపై, పంచాయతీ అధికారులపై విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించించగా, మరోవైపు అవేమి పట్టించుకోకుండా కోవలెంట్ యాజమాన్యం మాత్రం గవర్నర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాత్రిపూట అక్రమంగా నిర్మాణ పనులు చేస్తోంది. ఈనెల 17న 'ఆ ఊళ్లో నిలువెల్లా విషం...' పేరుతో కోవలెంట్ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై నవతెలంగాణ దినపత్రిక పత్యేక కథకాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించి విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈనేథ్యంలో కలెక్టర్ డిపివోకు ఆ ఆదేశాలను అమలుచేయాలని రాశారు. డిపివో సూచన మేరకు హత్నుర మండల ఇవోపిఆర్డీ మతీన్, స్థానిక పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు తదితరులు కోవలెంట్ కంపెనీకి వెళ్లి విచారణ చేపట్టారు. గుండ్లమాచునూరు సర్పంచు, ఉపసర్పంచు, వార్డు సభ్యుల సమక్షంలో కంపెనీ లోపల జరుగుత్ను నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు భిన్నంగా కోవలెంట్ కంపెనీలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కంపెనీ విస్తరణ కోసం ఆధునిక యంత్ర పరికరాలు, బ్రాయిలర్, ఇతర భవనాలను నిర్మిస్తున్నారు. నవతెలంగాణ దినపత్రికలో కథనం ప్రచురితమైన తరువాత పగటిపూట పనులను కంపెనీ యాజమాన్యం నిలిపేసినట్లు గ్రామస్థులు అంటున్నారు. అయితే పనులు మాత్రం ఆపలేదు. కాగా ప్లడ్లైట్ల వెలుతురులో రాత్రిపూట శరవేగంగా నిర్మాణ పనులు సాగిస్తున్నారని చెబుతున్నారు. కంపెనీలో చోటుచేసుకుకంటున్న నిర్మాణాలు పూర్తిగా అక్రమమని అధికారులు గుర్తించి డిపివోకు నివేదిక పంపారు. కంపెనీ విస్తరణ కోసం చేపట్టి నిర్మాణాల కోసం ఎలాంటి గ్రామపంచాయతీ అనుమతులు తీసుకోలేదని ఇవోపిఆర్డీ మతీన్ 'నవతెలంగాణ'కు తెలియజేశారు. ఈమేరకు డిపివోకు నివేదిక పంపినట్లు చెప్పారు.
ఇనాం భూములు ?
కోవలెంట్ పరిశ్రమలో అక్రమ కట్టడాలేకాదు అక్రమ భూములను కలిగిఉన్నట్లు తెలిసింది. గండ్లమాచునూరు గ్రామంలోని 374, 346, 375, 376, 359, 358, 377, 337, 315 తదితర సర్వే నెంబర్లల్లో మొత్తం 38 ఎకరాల వరకు భూములు ఉన్నట్లు గ్రామస్థుల సమాచారం. అయితే ఇందులో కొన్ని ఇనాం భూములు సైతం ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
ఎస్టీలు, బిసిల దగ్గర బలవంతంగా కొనుగోలుచేశారని చెబుతున్నారు. ఈ కంపెనీ టర్నోవర్ ప్రతియేటా రూ. 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఇందులో స్థానికులకు నామమాత్రపు ఉపాధి కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా బల్క్డ్రగ్ పౌడర్ తయారీలో కాలుష్యం భారీఎత్తున మురుగునీరు రూపంలో బయటకు విడుదలవుతోంది.
నిరోధించేందుకు ఎలాంటి చర్యలను కంపెనీ తీసుకోవడం లేదు. ప్రమాణాలను కంపెనీ అసలు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
Authorization