- 15 నుంచి 17 మందితో టిఆర్ఎస్ పొలిటోబ్యూరో
- ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల నియామకం
- పది నుంచి పన్నెండు కమిటీల ఏర్పాటు
- భారీ స్థాయిలో ప్లీనరీ ఏర్పాట్లు
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
ఈ నెల 24న జరగబోయే ప్లీనరీతో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పూర్తిస్థాయి రాజకీయపార్టీగా అవరించబోతుంది. తెలంగాణ నినాదం పేరుతో 2001లో టిఆర్ఎస్ను కెసిఆర్ ప్రారంభించారు. రాజకీయ పార్టీ కంటే ఉద్యమసంస్థగానే టిఆర్ఎస్కు గుర్తింపు వచ్చింది. ఆ పార్టీ పురుడు పోసుకుని పధ్నాలుగేళ్లు పూర్తయింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి రాష్ట్ర, జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఆ పార్టీ తెలంగాణలోని ఐదు జిల్లాలకే పరిమితమైంది. టిఆర్ఎస్కు సొంత నిర్మాణం అంటూ ఏమీ లేదు. కెసిఆర్ ఇచ్చిన పిలుపులే టిఆర్ఎస్కు నినాదాలుగా మారాయి. ఇప్పటికీ అవే కొనసాగుతూ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రమంతటా కమిటీలు నియమించింది. ఇక నుంచి టిఆర్ఎస్ను ఫంక్తు రాజకీయ పార్టీగా తీర్చిదిద్దు తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో సభల్లో చెప్పు కుంటూ వచ్చారు. అందులో భాగంగా కెసిఆర్ టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం కూర్పును చాలా జాగ్రత్తగా తయారు చేసినట్లు తెలిసింది. గతంలో మాదిరి గాకుండా పొలిటోబ్యూరోను తక్కువమందితో వేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారందర్ని పొలిటోబ్యూరోలో చేర్చుకున్నారు. రాజకీయ పార్టీగా నిర్మాణం జరుపుతున్న క్రమంలో పొలిటోబ్యూరో పదిహేను మందితో ఉండేటట్లుగా చేశారని విశ్వసనీయంగా తెలిసింది.
ప్రధాన పార్టీల అన్నిటిల్లో పార్టీకి పొలిటోబ్యూరో కీలకంగా ఉంటూ వస్తోంది. దానిని ప్రాతిపదికంగా తీసుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ఎస్ పొలిటోబ్యూరోను నియమించారని తెలిసింది. ఇందులో పార్టీలో మొదట్నుండి కీలకంగా పనిచేస్తున్న సీనియర్ నేతలు, రాజకీయంగా అనుభవం ఉన్న మరికొందరి నేతలను, ప్రభుత్వ పదవుల్లో తీసుకోలేని వారిని, నలుగైదుగురు మంత్రులనూ పొలిటోబ్యూరోలో తీసుకోనున్నారు. అవసరమైతే పొలిటోబ్యూరో సంఖ్యను పదిహేడు వరకు పెంచే అవకాశం ఉందని కూడా తెలిసింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను నియమించనున్నారు. ఇంకా క్రమశిక్షణ సంఘం, విద్యార్థి, యువజన, తదితర పది, పన్నెండు సంఘాలను కూడా నియమించబోతున్నారు. ప్రతీ ఒక్కరికీ పార్టీ పదవులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ నేత ఒకరు తెలిపారు.
ప్లీనరీలో పెట్టే తీర్మానాలివే
టిఆర్ఎస్ ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలపై ఆ పార్టీ నేతల మేథోమథనం కొలిక్కి వచ్చింది. తీర్మానాల కమిటీ కన్వీనర్గా ఎంపీ కేశవరావు ఉన్నారు. తీర్మానాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదముద్ర వేశారు. తీర్మానాల్లో సంక్షేమ-అభివృద్ధి రంగాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. విద్యుత్పై కూడా ఒక తీర్మానం చేయనున్నారు. కరెంటు అంశానికి తీర్మానాల్లో పెద్దపీట వేయనున్నారు. వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులే కాక మిషన్ కాకతీయపైన తీర్మానం చేయబోతున్నారు. కీలకమైన రాజకీయ అంశాలపై కూడా ప్లీనరీలో తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాలపై పార్టీ విధానం ఎలా ఉండాలో కూడా తీర్మానం చేస్తారని తెలిసింది. ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
కనివినీ రీతిలో ప్లీనరీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, అందునా రాష్ట్ర ప్రారంభంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కనివినీ రీతిలో టిఆర్ఎస్పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. టిఆర్ఎస్ రాష్ట్ర సభ్యత్వ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్లీనరికి 36 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలిపారు. మరో 15 వేల మంది రాబోతున్నారని, వారందరికీ మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేశామని అన్నారు. దీనికి గ్రామం నుంచి జిల్లా వరకు అన్ని స్థాయిల్లో ఉన్న నేతలు ప్లీనరికి వస్తారని చెప్పారు. ఇలాంటి ప్లీనరీ గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. హైదరాబాద్ను గులాబీమయం చేశామన్నారు. ప్లీనరీలో 12 అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. పార్టీ నిర్మాణంపైన చర్చించడం జరుగుతుందన్నారు. బుధవారం ప్లీనరీ ఏర్పాట్లను ఎల్బి స్టేడియంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్రెడ్డి పర్యవేక్షించారు.
Authorization