- ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలో కలకలం
- బిల్లు జారీకి తొందరేమొచ్చింది? : కేజ్రీవాల్
- 'హంతక' ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి : విపక్షాలు
- రాజస్థాన్లో రైలు కిందపడి మరో దళిత రైతు ఆత్మహత్య
- మోడీకి లేఖ రాసిన అన్నా హజారే
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూసేకరణ బిల్లుకు నిరసనగా బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాజస్థాన్కు చెందిన ఒక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. రైతు ఆత్మహత్య సంఘటనతో ఒక్కసారిగా అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సాక్షాత్తూ దేశ రాజధానిలోనే ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ సంఘటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. చెట్టుకు ఉరేసుకుని గజేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. గజేంద్రను గమనించిన ఆప్ వాలంటీర్లు వెంటనే చెట్టు ఎక్కి ఆయనను కిందకు దింపారు. గజేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆయనను రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ర్యాలీ జరుగుతున్న సమయంలో గజేంద్ర ఆ చెట్టు కిందే అరగంట పాటు కూర్చున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బాధితుడు రాసిన సూసైడ్ నోట్ కూడా
సంఘటన స్థలంలో లభ్యమైంది. 'తాను ఓ రైతు కొడుకునని, రాజస్థాన్లోని నంగల్ ఝాల్వార్ ప్రాంతానికి చెందిన వాడినని పేర్కొన్నాడు.తన పంట మొత్తం సర్వనాశనం కావడంతో తన తండ్రి ఇంట్లోంచి గెంటేశారని, తనకు ముగ్గురు పిల్లలున్నా, చేసేందుకు పనిలేదని, ఇప్పుడు ఇక ఇంటికి ఎలా వెళ్లాలో మీరే చెప్పాలని' ఆ లేఖలో ఆయన ప్రస్తావించాడు. గజేంద్రను వెంటనే చెట్టునుంచి కిందకు దించాలని పోలీసులకు ఎంత చెప్పినా వాళ్లు కనీసం పట్టించుకోలేదని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు.కాగా, తన ప్రసంగం ముగియగానే ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాతో కలిసి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్పత్రికి వెళ్లి గజేంద్ర మృత దేహాన్ని సందర్శించారు.
భూసేకరణ బిల్లు జారీ చేసేందుకు తొందరేమొచ్చింది?-అరవింద్ కేజ్రీవాల్
భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు తొందరేమొచ్చిందని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్ చేపట్టిన ర్యాలీలో ఆయన ప్రధాన వ్యక్తగా పాల్గొన్నారు. కేవలం బడా పారిశ్రామిక వేత్తలకు తగిన లబ్ధి చేకూర్చేందుకే దీనిని జారీ చేశారని ఆయన ధ్వజమెత్తారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రజల ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్ను జారీ చేస్తారని, అలాంటి అత్యవసర పరిస్థితి దేశంలో ప్రస్తుతం తమకేదీ కనిపించలేదని కేజ్రీవాల్ చెప్పారు. భూసేకరణ చట్టం 2013 చట్టంలో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.కేవలం కొన్ని కార్పోరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఆఘా మేఘాల మీద ఈ ఆర్డినెన్స్ జారీ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
'హంతక'ఆర్డినెన్స్ ఉపసంహరించనట్లయితే ఆందోళన ఉధృతం:
భూసేకరణ ఆర్డినెన్స్ను ఉపసంహరించనట్లయితే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆప్ నాయకులు హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని ఆప్ నాయకుడు ఆశుతోష్ ఆరోపించారు. భూసేకరణ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీని పార్లమెంట్ వరకు తీసుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలుగ జేస్తున్న 'హంతక' ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.చత్తీస్ఘడ్, జార్ఖండ్, పంజాబ్, హరియానా, ఒడిషా, బుందేల్ఖండ్, పూర్వాంచల్ తదితర ప్రాంతాల నుంచి ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కొత్త భూసేకరణ బిల్లులో అవసరమైన సవరణలు చేశామని బిజెపి నాయకులు మభ్యపెడుతున్నారని ఆప్ నాయకుడు సంజరుసింగ్ ఆరోపించారు. బిజెపి నాయకుల కల్లబొల్లి మాటలను రైతుల పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 2014 ఎన్నికల్లో బిజెపిని బలపర్చిన కొంత మంది బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలు నెరవేర్చేందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీలో రైతు ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోనే రాజస్థాన్ ఆల్వార్లో హర్షుజాటవ్ అనే దళిత రైతు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు అన్నా హజారే ప్రధాన మంత్రి మోడీకి భూబిల్లుపై మరోసారి బహిరంగలేఖ రాశారు.
Authorization