న్యూఢిల్లీ : సొంతంగా పెట్రోల్ పంపును కలిగివుండడం లేదా కొత్త పెట్రోలు పంపును ప్రారంభించడం వంటివాటికి దశాబ్ద కాలం క్రితం వున్నంత ఆకర్షణ ఇప్పుడు లేదు. చిన్న స్థాయి వ్యాపారస్తులు కూడా తమకున్న కొద్దిపాటి రాజకీయ సంబంధాలు, ఆర్ధిక బంధాలను ఉపయోగించుకుని పెట్రోల్ పంపును చేజిక్కించుకుని నిలకడగా ఆదాయం సంపాదించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కడపడితే అక్కడ పెట్రోలు పంపులను ఏర్పాటు చేసేయడం వల్ల వాటి సగటు రాబడి తగ్గింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పిసిఎల్) వంటి ఇంధన రిటైలింగ్ కంపెనీలు కొత్త డీలర్ల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో, ఐఓసి, బిపిసిఎల్లకు 24,500 డీలర్షిప్లు కావాల్సి వుండగా సగానికి కన్నా తక్కువమందే స్పందించారు. ఐఓసికి 14,700 ప్రాంతాల్లో 43శాతం స్పందన రాగా, హెచ్పిసిఎల్కి 9800 ప్రాంతాల్లో 56శాతం స్పందన వచ్చింది. పెట్రోల్; డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వల్ల 2002లో ప్రైవేటు శక్తులు ఈ రంగంలో చొరబడ్డాయి. రిలయన్స్ ఇండిస్టీస్, ఎస్సార్ ఆయిల్ వంటి కంపెనీలు వచ్చాక ముడి చమురు ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడం, ప్రభుత్వం తిరిగి నియంత్రణలు విధించడంతో కొన్ని సంవత్సరాల్లోనే ఇవి మూత పడ్డాయి. ఆ తరువాత చమురు ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో మళ్లీ చమురు రిటైల్ వర్తకంలోకి ప్రైవేటు సంస్థలు పెద్దయెత్తున ప్రవేశించాయి. చమురు మార్కెట్లో పెద్ద వాటాను ప్రైవేటు పక్షాలు రాబట్టుకున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు తమ విస్తరణ కార్యకలాపాలను మరింత దూకుడుగా చేపట్టాయి. ప్రైవేటు సంస్థలు అంత త్వరగా మార్కెట్ వాటాను ఎలా పెంచుకోగలిగాయో ప్రభుత్వ రంగ సంస్థలు త్వరగానే గ్రహించాయని చమురు రంగ విశ్లేషకుడు రాహుల్ ప్రీతియాని పేర్కొన్నారు. 2002 నుండి పెట్రోల్ పంపుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ఇంత పెద్ద ఎత్తున విస్తరించడంతో వాటి సగటు పరిమాణంపై తీవ్రమైన ప్రభావం పడింది. నెలకు ఒక రిటైల్ ఔట్లెట్కు ఇచ్చే 200 కిలోలీటర్లను 160కిలో లీటర్లకు కుదించేశారు. దీనిపై లాభాలు రావాలంటే ఇంధన మొత్తాన్ని పెంచాల్సి వుందని అన్నారు. దాంతోకొత్త డీలర్లు చాలా జాగ్రత్తగా, తమకు అయ్యే వ్యయం, వచ్చే రాబడి గురించి పరిశీలించాల్సి వచ్చింది. పైగా ఆ కొత్త ఔట్లెట్ పెట్టే ప్రదేశం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనివల్లే పెట్రోల్ పంపు యజమానులు ప్రభుత్వ రంగ సంస్థలు మరింత మంది డీలర్లను నియమించుకోవాలన్న చర్యను నిరసిస్తున్నాయి. ఈనాడు కొత్త పెట్రోల్ పంపులను ప్రారంభించడమంటే అర్ధం లేనిపని, పైగా జాతీయ ఆదాయాన్ని, వనరులను వృధా చేయడమేనని అఖిల భారత పెట్రోలియం డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు అజరు బన్సాల్ పేర్కొన్నారు.
Authorization