- నగరం నడిబొడ్డున యాదగిరిగుట్ట భూమి అన్యాక్రాంతం
- నిబంధనలకు విరుద్ధంగా లీజు
- రూ. 170 కోట్ల భూమి చుట్టూ రాజకీయం...
- బంజారాహిల్స్లో బడాబాబుల భాగోతం..
- రెవిన్యూ దేవాదాయశాఖల మధ్య వివాదం
- ప్రభుత్వంపై ప్రైవేటు ఒత్తిడి
ప్రతియేటా వంద కోట్ల రూపాయలు కేటాయించి యాదగిరి గుట్ట ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇదే దేవాలయానికి చెందిన 170 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్దనుంచి స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం జారీ చేసిన 33 సంవత్సరాల లీజు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. కొందరు ప్రభుత్వ పెద్దలపై వస్తున్న ఒత్తిడి వల్లే ప్రభుత్వం దీనిపై అచేతనంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సంవత్సరాల క్రితం దాతలు దేవుడికి దానంగా ఇచ్చిన భూమిని కాపాడుకోలేని ప్రభుత్వం మరో వైపు గుట్టలో దేవుడి పేరుచెప్పి ప్రైవేటు భూమిని సేకరించడానికి సన్నాహాలు చేస్తోంది.
- కొండూరి రమేష్బాబు
దీర్ఘకాలిక లీజు పేరుతో ఒక ధార్మిక సంస్థకు కట్టబెట్టిన భూమి చుట్టూ అధికార పార్టీ తిరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చెందిన ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కబెడుతోంది. యాదగిరి గుట్టను వాటికన్ సిటీ తరహాలో అభివృద్ది చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రతియేటా బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు ఇందుకోసం కేటాయిస్తామని కూడా ఇటీవల హామీ ఇచ్చారు. ఇదే దేవాలయానికి చెందిన 170 కోట్ల రూపాయల విలువ చేసే భూమి విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోవడానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. ఈ భూమిని తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్న ధార్మిక సంస్థ పెద్దలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో గల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి చేస్తామంటూ కొందరు వ్యక్తులు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డిని కోరడం, ఆఘమేఘాల మీద ఆ భూమిని 33 సంవత్సరాల లీజు పేరుతో వారికి కట్టబెట్టడం జరిగిపోయింది. దేవాదాయ శాఖ జి.ఒ. ఎమ్.ఎస్. నంబర్ 359, తేదీ 28.2.2009 ద్వారా షేక్పేట మండలం లోని సర్వే నంబర్ 4/1, 4/2 లో గల 4.38 ఎకరాల భూమిని ఆ సంస్థకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత ఖరీదైన ఈ భూమిని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో దేవాదాయ శాఖ కు చెందిన ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. భూమిని తీసుకున్న ధార్మిక సంస్థలోని ఒక వ్యక్తికి ఆ అధికారితో ఉన్న బంధుత్వం కారణంగా ఆ ఫైలు చకా చకా కదిలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భూమి వ్యవహారాన్ని కొందరు వ్యక్తులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని కూడా యాదగిరి గుట్ట దేవాలయానికి అనుబంధంగా అభివృద్ది పరచాలని వారు కోరారు. తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. దీనిపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. తమ భూమిగా భావించి దేవాదాయ శాఖ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసిన భూమిలో 2.14 ఎకరాలు రెవిన్యూ శాఖకు చెందినదని షేక్పేట తహసిల్దారు తన నివేదిక లో తెలిపారు. ఈ భూమిపై దేవాదాయ శాఖకు ఎటువంటి హక్కులేదని కూడా తహసిల్దారు పేర్కొన్నారు. దేవాదాయ భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం చట్టబద్ధమేనని ఆ శాఖ అథికారులు వాదిస్తున్నప్పటికీ తమది కాని భూమిని లీజుకు ఎలా ఇస్తారని రెవిన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమిని లీజుకు ఇప్పించడంలో కీలక పాత్ర నిర్వహించిన దేవాదాయ శాఖ అధికారిని ప్రభుత్వం బదిలీ కూడా చేసింది. అత్యంత విలువైన ఈ భూమిలో వంద కోట్ల రూపాయల వ్యయంతో దేవాలయాన్ని ధార్మిక కేంద్రాన్ని నిర్మిస్తామని ప్రకటించిన ధార్మిక సంస్థ ఇప్పటికే అక్కడ భూమి పూజ చేసింది. అంత మొత్తం నిధులు సంస్థ వద్ద లేక పోవడంతో పెద్ద ఎత్తున చందాలు వసూలు చేస్తోంది. ఈ భూమి కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న ధార్మిక సంస్థ పెద్దలు అధికార పార్టీకి చెందిన ఒక నాయకురాలిని, ఒక మంత్రిని ఆశ్రయించారు. జంటనగరాల్లో తాము అన్నదానం చేస్తున్నామని అందువల్ల ఈ భూమిని తమ వద్దే ఉంచే విధంగా ముఖ్యమంత్రికి నచ్చ చెప్పాలని కూడా వారు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
ఎవరిదీ భూమి..
రెండు శాఖల మధ్య వివాదం లేపిన లక్ష్మీ నరసింహ స్వామి భూమి హద్దుల విషయంలో పూర్తిగా స్పష్టత లేకున్నా ఇక్కడ ఉండే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వెనుక భాగంలో గల ప్రస్తుత ఎన్.బి.టి. నగర్ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన దేవాలయానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 40 కిలోమీటర్ల పరిధిలో గల వివిధ గ్రామాల వారు వచ్చే వారని ఆ ప్రాంత వాసులు తెలిపారు. నిజాం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సర్ మహారాజా కిషన్ ప్రసాద్ బహదూర్ ఈ దేవాలయానికి జాగీరులోని 47.19 ఎకరాల భూమిని ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. దీనిలో 35 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. ఈ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబించాయి. ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని, దీని చుట్టూ ఉన్న భూమిని 2003లో యాదగిరి గుట్ట దేవస్థానానికి స్థానికులు అప్పగించారు. అప్పటి నుంచీ ధూప దీప నైవేద్యములను యాదగిరి గుట్ట దేవస్థానం ఆధ్వర్యం లోనే జరుగుతున్నాయి. 2009 లో ఈ దేవాలయాన్ని, భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం పట్ట స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. తమకు అప్పగించిన భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం పట్ట యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త అభ్యంతరం తెలిపారు. దేవాలయ భూములను కేవలం 11 సంవత్సరాలకు మించి లీజుకు ఇయ్యవద్దని జి.ఒ.ఎమ్.ఎస్. నంబర్ 160 జారీ చేసిన ప్రభుత్వం దీనికి విరుద్ధంగా 33 సంవత్సరాలు ఈ భూమిని లీజుకు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. మొత్తం ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
Authorization