- యాజమాన్యాలు స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
- పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కడాలేనన్ని ప్రోత్సాహకాలు
- 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా
- ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ
నవతెలంగాణ - జహీరాబాద్
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు, పారిశ్రామిక పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా అండ్ మహీంద్ర పరిశ్రమ విస్తరణ కార్యక్రమానికి బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అనుమతులన్నీ ఇస్తామని చెప్పారు. ఎవరైనా సరే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నట్లు తన కార్యాల యానికి సమాచారమిస్తే వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి సంబంధిత శాఖల అధికారులే వెళ్లి నేరు సమావేశమవుతారన్నారు. మహీంద్రా అండ్ మహీంద్ర యాజమాన్యం అడిగిన వెంటనే 14.5 శాతం ఉన్న వ్యాట్ను 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. ''మన ప్రధాని మేడిన్ ఇండియా అంటున్నారు. మరి మనం మేడ్ ఇన్ తెలంగాణ అని ఎందుకు తయారుచేయకూడదు. దీనిని పారిశ్రామికవేత్తలు ఛాలెంజ్గా తీసుకుని ముందుకు రావాలి. మేం అన్ని విధాలుగా సహకరిస్తాం' అని ముఖ్యమంత్రి హామీనిచ్చారు. అయితే స్థానిక యువతకే ఉపాధి కల్పించాలన్నారు. మహీంద్రా అండ్ మహీంద్ర పరిశ్రమలో కూడా స్థానికులకే ఉద్యోగాలివ్వాలని సిఎం అనడంతో సభలోని వారంతా కేరింతలు కొట్టారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు జహీరాబాద్లో 220 కేవి సబ్స్టేషన్, ఐటిఐ ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసిందని, నేటికీ ప్రారంభించలేదని పేర్కొన్నారు. తాను అలా కాదని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. మహీంద్రా పరిశ్రమ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పవన్ గోయంకా మాట్లాడుతూ..20 ఏళ్ల క్రితం ఆల్విన్్ యాజమాన్యం నుంచి పరిశ్రమను కొనుగోలు చేశామని, నేడు ఏడాదికి 90వేల వాహనాలను తయారుచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెలకొల్పుతున్న పరిశ్రమకు రూ. 11 వందల కోట్లు పెట్టుబడిపెట్టి 3,500 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్రావు, జూపల్లి కృష్ణారావు, ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి, జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్, జడ్పీ ఛైర్పర్సన్ రాజమణి, పలువురు పాల్గొన్నారు.
Authorization