Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ఉండి, లక్షణాలు కనిపించని వారితోనే వైరస్ వ్యాప్తి
- మాస్కులు ధరించక, వ్యక్తిగత దూరం పాటించకపోవడంతో పెరుగుతున్న కేసులు
- పదమూడు రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1749 మందికి కరోనా
నవతెలంగాణ-హుస్నాబాద్టౌన్
కరోనా వైరస్ సోకినా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించేవారే రోగాన్ని మోసుకొస్తున్నారని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యాధి బారిన పడి, రోగనిరూపణ లక్షణాలు కనిపించనివారితోనే ఇతరులకు వేగంగా అంటుతోందని చెబుతున్నారు. వైరస్ లక్షణాలు కనిపించి అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరినవారికంటే, కరోనా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నవారే వైరస్ విజంభణకు కారణమవుతున్నారంటున్నారు. వ్యాధి సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో, వారు అస్వస్థతకు గురికావడంలేదని, అయితే వారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతరులను తాకడంతో గానీ, సన్నిహితంగా మెలగడంతో గానీ చేయడంతో వ్యాధిని పెంచుతున్నారని చెబుతున్నారు. ఇందుకు దక్షిణ కొరియాలో జరిగిన ఒక అధ్యయనమే నిదర్శనమంటున్నారు. అక్కడ ఓ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన వైద్యబందం 110 మందికి వైద్యపరీక్షలు చేయగా, అందులో 89 మంది ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వ్యాధి బారిన పడ్డారట. 21 మంది మాత్రమే రోగ లక్షణాలు కలిగి ఉన్నారట. దక్షిణ కొరియాలో నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు 'జామా ఇంటర్నల్ మెడిసిన్' పత్రికలో ప్రచురిం చబడ్డాయి. దీని ప్రకారం ఆరోగ్యంగా కనిపించేవారిలోనూ వైరస్ దాగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాం టివారే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, సాంక్రమిక వ్యాధుల శాఖ అధికారులు గుర్తించారు. ఎలాంటి రోగ లక్షణాలు కనిపిం చని ఇలాంటి రోగులే 40 నుంచి 45 శాతం సార్స్ కోవిడ్2 అంటురోగాలకు కారణమవు తున్నారంటున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో వైరస్ వారిలో 14 రోజులు బతికి ఉంటుందని చెబుతున్నారు. ఈ పద్నాలుగు రోజులు వారు బయట మాస్కులు ధరిం చకుండా తిరగడం, వారి బంధువులు, స్నేహితులను కలవడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అస్వస్థతకు గురవుతారంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డవారికి వ్యాధి ఎలా వచ్చిందో తెలియడంలేదు. వారు ఎవరెవరినీ కలిశారో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధి కారులు గుర్తించడంలేదు. వారందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతుండడంతో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
పదమూడు రోజుల్లో 1749 పాజిటివ్ కేసులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈనెల 1 నుంచి 13వ తేదీ వరకు 1749 మంది కరోనా బారిన పడ్డారు. మెదక్ జిల్లాలో 253, సంగారెడ్డిలో 989, సిద్దిపేటలో 507 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలలో సంగారెడ్డి జిల్లా తరువాత మెదక్ ద్వితీయ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని సిద్దిపేట జిల్లా అందుకుంది. సంగారెడ్డిలో ఎప్పటి లాగే కేసులు పెరిగిపోతున్నాయి.
మాస్కులు తప్పనిసరిగా ధరింపజేయాలి
కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనో, ఆసు పత్రిలోనో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా ఉండి, లక్షణాలు కనిపించనివారు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ, ఇతరులతో కలిసి ఉంటున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పల్లెలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పాటు దుకాణాలు, మార్కెట్లు, హౌటళ్లు, బ్యాంకుల వద్ద జనం గుంపులుగా ఉంటున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఆరో గ్యంగా కనిపించేవారిలో వైరస్ ఉన్న విషయం తెలియ కపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈనేప థ్యంలో మాస్కులు ధరించడం, వ్యక్తి గత దూరాన్ని పాటించడాన్ని కఠినతరం చేయాలి. దీంతో పాటు ప్రజలం దరికీ వైద్యపరీక్షలు చేస్తే వైరస్ ను అదుపులోకి తేవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే తెలంగాణలో పరీక్షలు ఎక్కువగా జరడంలేదని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అనడం ఇక్కడి వాస్తవ పరిస్థితిని తెలుపుతుంది.
అనవసరంగా బయటకు రావొద్దు
కరోనా వైరస్ ఉన్న కొందరు వ్యక్తుల్లో లక్షణాలు కనిపించడంలేదు. అలాంటి వారికి వైద్య పరీక్షలు చేస్తేనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో అస్వస్థతకు గురికావడంలేదు. ఇలాంటి వ్యక్తులతో ఇతరులకు కరోనా అంటుకుంటుంది. అందుకే అందరూ మాస్కులను కచ్చితంగా ధరించాలి. వ్యక్తిగత దూరాన్ని పాటించాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది.
-మనోహర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి