Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్
నవతెలంగాణ-పటాన్చెరు
పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాట్రాక్టు కార్మికులకు జీవో నెంబర్ 68, 43 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు.శుక్రవారం పట్టణం లోని ఏరియా ఆస్పత్రిలో కాట్రాక్టు కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి సూపరిండెంట్కు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్కేర్, సెక్యూరిటీ గార్డ్లకు ఆయా జిఓల ప్రకారం నెలకు 10 వేలు రూపాయలు ఇవ్వాలన్నారు. కానీ సాయి సెక్యూరిటీ బినామీ కాట్రాక్టును పెట్టి రూ.7200 చెల్లిస్తు కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇదేమని అడుగుతే బెదిరింపులకు పాల్పడుతు పనిలో నుంచి తొలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం లేదన్నారు. కరోనా వచ్చిన సిబ్బందికి నెలరోజులు క్వారంటైన్ లీవులు, వేతనం రూ.50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పన్నెండు వందల రూపాయలు అదనంగా ఇస్తున్నారని ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మహబూబ్ ఖాన్, సిద్ధమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.