Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరుకు గదులతో చిన్నారుల ఇబ్బందులు
- కేంద్రంలో తక్కువ మంది..
- రికార్డుల్లో మాత్రం ఎక్కువ!
- పట్టించుకోని ప్రభుత్వం
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ మండలంలో మొత్తం 55 అంగన్వాడీ కేంద్రాలుండగా, 6 నెలల నుండి 5 సంవత్సరాల్లోపు 2430 మంది చిన్నారులున్నారు. అలాగే వీటిలో 28 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా 15 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగితావి అద్దె లేనివి ఉన్నాయి. జగదేవపూర్ మండలంలో మొత్తం 45 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 22 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలు 9 ఉండగా అద్దె లేనివి 14 ఉన్నాయి. కేంద్రాల్లో 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు 1212, మూడేళ్ల నుండి ఐదేండ్ల పిల్లలు 1159 ఉన్నారు. గర్భిణులు, 329 ఉండగా బాలితలు 270 ఉన్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో అంగన్వాడీల్లో పిల్లలు తక్కువ సంఖ్య తక్కువగా ఉంది. రికార్డుల్లో ఉన్న పిల్లల సంఖ్య కేంద్రాల్లో ఉండడం లేదు. కేంద్రాల నిర్వహణ కూడా ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. ఏ ఒక్క అంగన్వాడీ కేంద్రంలో రికార్డుల్లో ఉన్న పిల్లలు కేంద్రంలో ఉండకపోవడం గమనార్హం. బాలింతలు, గర్భిణులు మాత్రమే వస్తున్నారు. వర్గల్ మండలంలో ప్రీస్కూల్ పిల్లలు, బాలింతలు, గర్భిణుల హాజరు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. దండుపల్లి అంగన్వాడీ కేంద్రంలో 20 మంది పిల్లలు నమోదు కాగా పదిలోపు మంది మాత్రమే హాజరవుతున్నారు. అక్కడ 11 మందికి గర్భిణులు, నలుగురు బాలింతలు నమోదై ఉన్నప్పటికీ 8 మంది మాత్రమే పౌష్టికాహారం కోసం కేంద్రానికి వస్తున్నారు.
కొండపాక మండలంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికామారాన్ని అందించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ ద్వారా పౌష్టికాహార వస్తువలైన బియ్యం, పప్పులు, ఉప్పులు, వంట నూనె, కోడి గుడ్లను సరఫరా చేస్తున్నారు. మండలంలో కొండపాక, కుకునూర్పల్లి రెండు సెక్లార్లలో 57 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 800 మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నట్టుగా రిజిస్టర్లో నమోదై ఉన్నాయి. కానీ అన్ని సెంటర్లలో నమోదు సంఖ్యకు సుమారు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు గైర్హాజరవుతున్నారు. ములుగు మండల కేంద్రంలోని 1వ నెంబర్ అంగన్వాడీ కేంద్రం సొంత భవనం లేక, ఇబ్బందుల మధ్య అద్దె భవనంలోనే కొనసాగుతున్నది. ఐదేండ్లుగా నెలకు రూ.600 అద్దెను చెల్లిస్తూ, ఇరుకైన పెంకుటింటిలోనే కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సొంత భవనాలను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.