Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ
- కాలయాపన చేస్తున్న నాయకులు
-కంపుకొడుతున్న పట్టణాలు
-ఇబ్బందుల్లో ప్రజలు
-ఇది తూప్రాన్, మనోహరాబాద్ మండలాల దుస్థితి
నవతెలంగాణ-మనోహరాబాద్
తూప్రాన్, మనోహరాబాద్లో రోజురోజుకూ సొంత కుమ్ములాటలు తప్ప గ్రామాల అభివృద్ధిపై నాయకులకు ఏ మాత్రమూ పట్టింపు లేకుండా పోతున్నది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈ రెండు మండలాలు మాత్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడ్డాయి. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, సీట్లపై నుండి దిగితే తాను కూర్చొవచ్చుననే దురాలోచన నాయకుల మధ్య పెరిగిపోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు మండలాల్లో మేజర్ పంచాయతీలైన తూప్రాన్, మనోహరాబాద్, కాళ్లకల్ గ్రామాల్లో ఇప్పటి వరకు డంప్ యార్డు లేదు. దీంతో గ్రామ వీధులు, రహదారుల పక్కన చెత్తను వేయడంతో చెత్త గ్రామాలుగా మారుతున్నాయి.
నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో గ్రామాలను సుందరమయంగా, వైకుంఠ ధామాలు, చెత్త డంప్ యార్లుతో పాటు అన్ని పథకాలను సద్వినియోగం చేసుకున్నారు. తూప్రాన్, మనోహరాబాద్లలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఎక్కడి సమస్యలే అక్కడే ఉండిపోతున్నాయి. తూప్రాన్ మండల కేంద్రానికి గతంలో అభివృద్ధి నిధుల కింద గడ నిధుల నుండి రూ.80 లక్షల వచ్చినప్పటికీ సర్పంచ్, పాలకవర్గం కుమ్ములాటలతో అబివృద్ధికి వచ్చిన నిధులను వాడుకపోవడంతో వెనక్కి వెళ్లి పోయాయి. సోమవారం వచ్చిందంటే చాలు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులకే సరిపోతున్నది. ఇప్పటికైనా గ్రామాభివృద్ధిపై, ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.