Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షం పడితే ఆ రోడ్లు చిత్తడే...
- పట్టించుకోని అధికారులు
- ఇబ్బందుల్లో వాహనదారులు..
- పాదాచారులు
-మరమ్మతులు చేపట్టాలని విన్నపం
నవతెలంగాణ-నర్సాపూర్
నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో భానీ భవనాలున్నా అక్కడికి వెళ్లాలంటే నానా కష్టాలు పడాల్సిందే. చినుకుపడితే కాలు పెట్టలేని దుస్థితిలో రోడ్లున్నాయి. చిన్న వానకే బురదమయంగా మారుతున్నాయి. మురుగు కాలువలు లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా నీరంతా గుంతల్లో నిలుస్తున్నది. తమను రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నాయి తప్ప తమ సమస్యల కోసం ఏనాడు కూడా ఆలోచించడంలేదని పట్టణవాసులు వాపోతున్నారు.
నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డికి వెళ్లే రహదారిలో కొత్తపెట్రోల్బంక్ సమీపంలో ఉన్న పెద్దమ్మకాలనీ, అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న వెంకటేశ్వర కాలనీ, శ్రీరాంనగర్ కాలనీల్లో సీసీ రోడ్లు లేవు. మట్టి రోడ్లు ఉండడంతో వర్షం పడినప్పుడల్లా ఈ రోడ్లన్నీ బురదమయంగా తయారై ప్రయాణం చేయాలేకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు మురుగు కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షం నీరు ఎక్కడిక్కడ నిలిచిపోతుంది. దాంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వెంకటేశ్వర కాలనీకి సీసీ రోడ్డు మంజూరు కాగా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డును వేసేందుకు ట్రాక్టర్ ద్వారా మట్టిని తొలగించి వదిలివేశాడు. సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే పనులు మొదలుపెట్టాలని, మురుగు కాలువలు నిర్మాణం చేపట్టాల్సిన అవసరముంది. పెద్దమ్మకాలనీ, శ్రీరాంనగర్ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిదులు మంజూరయ్యేలా కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే మదన్రెడ్డిని కాలనీవాసులు కోరుతున్నారు.