Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కులవత్తులను కాపాడుతాం
- ఎమ్మెల్యే సతీశ్ కుమార్
- మత్స్యకారులకు ద్విచక్ర వాహనాల పంపిణీ
నవతెలంగాణ-హుస్నాబాద్ టౌన్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. అవసాన దశలో ఉన్న కులవత్తులకు జీవం పోస్తూ పల్లె ప్రాశస్త్యాన్ని నిలబెడతామన్నారు. శనివారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన 807 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, పలువురికి ఇరవై టాటాఈస్ వాహనాలను అందజేశారు. దీంతో పాటు హుస్నాబాద్ మండలకేంద్రం, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి, కోహెడ మండలం వింజపల్లిలోని మహిళా సొసైటీ సభ్యులకు ఎండిన చేపలు ఆమ్ముకునేందు రూ. 3 లక్షల చొప్పున మంజూరైన పూర్తి సబ్సిడీ రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఆ ప్రకారమే రుణాలు అందజేసి, ఆయా వర్గాల అభివద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకు అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఇంతకు ముందు మంజూరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలు ఎన్నికల కోడ్ తో ఆగిపోయాయని, ఇప్పుడు సత్వరమే అందేలా చూడాలన్నారు. అన్ని వర్గాలకు చేతినిండా పని ఉంటే వారు సుభిక్షంగా ఉంటారని, తద్వారా పల్లెలు బాగుంటాయన్నారు. దీంతో బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య మంగ, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో దమ్మని రాము, మత్స్య పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొన్నారు.