Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి
నవతెలంగాణ-జహీరాబాద్
ఈ నెల 24 నుండి వారం రోజుల పాటు పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దీనికి ప్రజలందరూ సహకరించాలని జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి అన్నారు. ఆదివారం నవతెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, అత్యవసర సమస్యలు సకాలంలో పరిష్కరించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమకు కావాల్సిన సేవలు, అవసరాలను హక్కుగా అడిగి చేయించుకోవాలని, అలాగే అభివృద్ధిలో తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
నవతెలంగాణ : నీటి సరఫరా వ్యవస్థ సరిగా లేకపోవడంతో పట్టణంలోని అన్ని ప్రాంతాలకూ చేరకపోగా, చాలా ప్రాంతాలలో మంజీరా నీరు వృథాగా పోతోంది. సక్రమంగా నీరందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
కమిషనర్ : పట్టణంలోని కొన్ని చోట్ల పైపులైన్ లీకేజీల కారణంగా నీరు పోతున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాం. అలాగే కొత్త కాలనీలలో పైపులైన్ లేని కారణంగా నీటి సరఫరా చేయలేకపోతున్నాం. దీనిపై మిషన్ భగీరథ అధికారులకు తెలియజేశాం. పైపులైన్ పూర్తి అయిన వెంటనే అన్ని కాలనీలకూ నీటిని సరఫరా చేస్తాం.
నవతెలంగాణ : ఇంటిటికి చెత్త సేకరణ పూర్తి స్థాయిలో జరగకపోగా, కాల్వలు సకాలంలో శుభ్రం కావడం లేదు. ప్రజల ఇబ్బందులు తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
కమిషనర్ : జహీరాబాద్ పట్టణ పరిధి పెరగడంతో కొంత మేర కార్మికుల కొరత నెలకొంది. ఇటీవలే కొత్తగా కార్మికులను నియమించాం. వారి ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఇటీవలే మున్సిపాలిటీలలో చేరిన గ్రామ పంచాయతీలలో సైతం మున్సిపల్ కార్మికులతో పారిశుధ్య పనులను చేయిస్తాం.
నవతెలంగాణ : పట్టణంలో ఎల్ఈడీ దీపాలు అమర్చినప్పటికీ ఇంకా సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల నిరంతరాయం గా వెలుగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వెలగటం లేదు. ఈ సమస్య పరిష్కారంతో పాటు కొత్తగా మున్సిపాలిటీలో చేరిన గ్రామ పంచాయతీలలో వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారా.?
కమిషనర్ : పట్టణంలో ఎల్ఈడీ దీపాలు సరి చేయడంతో పాటు కొత్తగా చేరిన గ్రామాల్లో త్వరలోనే ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు సర్వేను నిర్వహిస్తాం. త్వరలోనే పట్టణంలో అదనపు తీగలను అమర్చి నిరంతరంగా వెలుగుతున్న వాటిని నివారిస్తాం.
నవతెలంగాణ : పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో షెడ్లు నిర్మించినప్పటికీ అక్కడ కనీస సదుపాయాలు లేక వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి మీరు తీసుకునే చర్యలు ఏమిటి?
కమిషనర్ : పూర్తి స్థాయిలో వసతుల కోసం 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు కేటాయించాం. మోడల్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.
నవతెలంగాణ : పట్టణ పరిసరాలలో విరివిగా లేఔట్లు వెలుస్తున్నప్పటికీ కనీస సదుపాయలు కల్పించకుండానే నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
కమిషనర్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసే లేఔట్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇప్పటికే వెలిసిన వాటిల్లో కూడా లోపాలుంటే సరి చేస్తాం. ప్రజలు కూడా అన్ని రకాలుగా పరిశీలించి కొనుగోలు చేసుకోవాలి.
నవతెలంగణ : పట్టణంలోని జాతీయ రహదారితో పాటు ప్రధాన అంతర్గత రహదారుల వెంట శౌచాలయాలు లేకపోవడంతో వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనంగా శౌచాలయాలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
కమిషనర్ : అనువైన స్థలాన్ని పరిశీలించి తాత్కాలికంగా ఏర్పాట్లు చేయడం, లేదా సులబ్ కాంప్లెక్స్ వారితో చర్చించి పక్కా ఏర్పాట్లు చేయిస్తాం. పది నుంచి 12 చోట్ల సామూహిక శౌచాలయాలు అవసరం ఉంది.
నవతెలంగాణ : ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఉన్న ఏర్పాట్లు, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
కమిషనర్ : ఫిర్యాదు స్వీకరణకు మూడు పద్ధతులు పాటిస్తున్నాం. ఒక్కటి నేరుగా, రెండోది స్వచ్ఛత యాప్ ద్వారా, మూడోది మున్సిపల్ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదునూ పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
నవతెలంగాణ : పట్టణ ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి.?
కమిషనర్ : జహీరాబాద్ పట్టణాభివృద్ధికి ప్రజలందరు సహకరించాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పొడి, తడి చెత్తలను వేరు వేరుగా మున్సిపల్ వాహనాలను అందించాలి. అలాగే తమ తమ ఆస్తి, వ్యాపార పన్నులను సక్రమంగా చెల్లించి పట్టణాభివృద్ధి దోహదపడాలి. పాలిథీన్ కవర్లను నిషేధించాం. ప్రజలు దీనిని వినియోగించకపోవడం మంచిది. అదే విధంగా తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలు తమ వంతు కృషి చేయాలి.