Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేర్యాల పట్టణ సమస్యలు తీరేనా?
నూతనంగా ఏర్పాటైన చేర్యాల మున్సిపాలిటీలో సుమారు 20 వేల జనాభా, 12 శివారు పల్లెలు, 12వ వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. పాత నియోజకవర్గం, మండల కేంద్రం కావడంతో నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటోంది. కొత్త బస్టాండ్ నుంచి సినిమా హాలు వరకు ఎక్కడ కూడా మూత్ర శాలలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొం టున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు కొన్ని వార్డుల్లోనే వస్తున్నాయి. భగీరథ పైపుల కోసం తీసిన గుంతలను తిరిగి పూడ్చకపోవడంతో సీసీ రోడ్లపై కంకర తేలి నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
మురుగు కాలువల సమస్య...
పట్టణంలో మురుగు కాలువల సమస్య తీవ్రంగా ఉంది. కాలువలను శుభ్రం చేయక పోవడంతో చెత్తా చెదారం చేరి దుర్గంధం వెదజల్లడమే కాక దోమల సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. డ్రయినేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
పాకురుబట్టిన వాటర్ ట్యాంకులు...
వాటర్ ట్యాంకులను 15 రోజులకొకసారి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ వేయాలి. నెలలు గడుస్తున్నా ట్యాంకులను శుభ్రం చేయక పోవడంతో ట్యాంక్తో పాటు చుట్టూ పాకురు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. వెంటనే శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'హరీ'తహారం...
పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు, డివైడర్ మధ్యలో హరితహారం మొక్కలు నాటారు. వాటిని సంరక్షించేవారు లేక అవి పూర్తిగా ఎండిపోయాయి.
పట్టణలో కోతుల బెడద...
అడవుల్లో సంచరించాల్సిన కోతులు పట్టణంలో గుంపులు గుంపులుగా పెంకుటిల్లుపై చేర డం, ఇండ్లల్లో చొరబడడంతో ప్రజ లు భయాందోళనలకు గురవుతు న్నారు. గతంలో కోతులు కరచి గాయాలపాలై ఆస్పత్రిలో చేరిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలు వెంటనే పరిష్కరించాలి
పట్టణం ప్రజలు అనేక సమస్యలతో సతమత మవుతున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేర్యాల పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు వెంటనే పరిష్కరించాలి.
- పోలోజు శ్రీహరి సీపీఐ(ఎం)పట్టణ కార్యదర్శి
అందోల్-జోగిపేటలో ముందుకుసాగని అభివృద్ధి
అందోల్- జోగిపేట మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. అందోల్- జోగిపేట మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవడంతో వ్యాపార, వాణిజ్య తదితర రంగాలలో అభివద్ధి చెందుతుందని ప్రజలతోపాటు వ్యాపారులు, రాజకీయ నాయకులు భావించినా అవేమీ కానరావడం లేదు. జోగిపేట, అందోల్ పంచాయతీలుగా ఉన్న రెండు పట్టణాలను కలిపి 2013 ఫిబ్రవరిలో 20 వార్డులుగా చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. రెండోసారి కొత్త పాలక వర్గం ఏర్పడడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో పట్టణాల్లోని సమస్యలు లేని మున్సిపాలిటీగా తయారుచేయాలని లక్ష్యంతో ఉంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జోగిపేట మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. మున్సిపాలిటీలో రెగ్యులర్ సిబ్బంది కొరత కారణంగా మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. మున్సిపాలిటీకి సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరైనా అది కార్యరూపం దాల్చలేదు. పక్కనే ఉన్న పశువైద్యశాల సంబంధించిన భవనాన్ని వాడుకుంటున్నారు.
అభివృద్ధికి ఆమడదూరంలో...
అందోలు నియోజకవర్గ కేంద్రమైన అందోల్- జోగిపేట మున్సిపాలిటీ ఏర్పడినా అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే కనిపిస్తుంది. జోగిపేట, అందోల్ పట్టణాలను విలీనం చేయడంతో జంట పట్టణాలు రూపుదిద్దుకుంది. పేరుకే మున్సిపాలిటీ అయినప్పటికీ కనీసం పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టక ఆయా కాలనీల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాలనీలో పలు సీసీ రోడ్లు, డ్రయినేజీలు అధ్వానంగా ఉన్నాయి.
జోగిపేట మున్సిపాలిటీలో వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. ప్రధానంగా అంతర్గతంగా రహదారుల మరమ్మతు, రహదారుల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం, పార్కులు ఆధునీకరణ, శ్మశాన వాటికల ఆధునీకరణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు వాపో తున్నారు.
అందోల్ జోగిపేట మున్సిపాల్టీలో మంచినీటి సమస్య ప్రజలను పట్టి పీడిస్తుంది. కొన్ని వార్డుల్లో ఇటీవల మిషన్ భగీరథ మంచినీరు వస్తుంది. కొన్ని చోట్ల పైపుల లీకేజీలతో రోడ్లన్నీ నీటిమవుతున్నాయి.
చెత్తా చెదారంతో తలనొప్పి:
జోగిపేట పట్టణంలో చెత్తాచెదారం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీలను పేరుకుపోయిన చెత్త తొలగించడంలో కాలయాపన జరుగుతుంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అటు వైపు వెళ్లే ప్రజలు ముక్కున వేలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మురుగు కాలువల్లో మురుగునీరు నిండిపోవడంతో రోడ్లపైనే నీళ్లు ప్రవహిస్తున్నాయి. కొన్ని కాలనీలలో మురుగునీరు నిండి చాలా రోజులు అవుతున్నా వాటిని తీయడం లేదు.
రిక్షా కాలనీ, మార్కండేయ కాలనీలో సమస్యలు...
మున్సిపల్ పరిధిలోని రిక్షా కాలనీ, అందోల్ సమీపంలోని మార్కండేయ కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆయా కాలనీలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో కాలనీలోకి విష పురుగులు ప్రవేశిస్తాయని కాలనీ ప్రజలు వాపోతున్నారు. మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుండడంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఈ కాలనీలో అంతంత మాత్రమే జరిగాయి. మున్సిపాలిటీలో ఉన్నప్పటికినీ అభివద్ధికి దూరంగా ఈ కాలనీలో మారాయి. కొత్తగా పాలకవర్గం ఈ కాలనీలను అభివద్ధి పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.
కాలనీలలో నడవలేం.. రోడ్పై వెళ్లలేం..
నవతెలంగాణ-సంగారెడ్డి టౌన్
సంగారెడ్డి మున్సిపాలిటీ పేరుకే జిల్లా కేంద్రం. కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే మండల కేంద్రం కన్నా ఎక్కువ, జిల్లా కేంద్రం కన్నా తక్కువ అన్నట్టుంది. హైదరాబాద్ నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి టౌన్ శరవేగంగా అభివద్ధి చెందుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు విభజన తరువాత ఏర్పడిన కొత్త జిల్లాకు హెడ్ క్వార్టర్ సంగారెడ్డే. ఇప్పుడిప్పుడే సంగారెడ్డి వ్యాపార , వాణిజ్య కేంద్రంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ ప్రధాన రోడ్డును విస్తరించారు. రోడ్లు వెడల్పు చేశారు. సెంట్రల్ లైటింగ్ తో పట్టణానికి కొత్త వెలుగులు తెచ్చారు. కానీ.. ఏం లాభం ప్లానింగ్ లేకుండా రోడ్డు విభజన చేశారు. మురికి కాలువల నిర్మాణం అసంపూర్తిగా వదిలి వేశారు. ఒక్క సారి వాన కొడితే చాలు.. ప్రధాన రోడ్డు నీటితో నిండిపోతుంది. మురికి కాలువలు వరద నీటితో నిండిపోయి మురుగంతా రోడ్డు పై ప్రవహిస్తుంది. రోడ్డు పై వెళ్తుంటే భరించలేని కంపు వాసన జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు. ఏళ్ల తరబడిగా ఉంది. మున్షిపాలిటీకి ఏటా పది కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. కానీ పట్టణ ప్రాంతంలో ప్రజా అవసరాలను మాత్రం కౌన్సిల్ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇక సంగారెడ్డిలో కొత్తగా ఏర్పడిన కాలనీల పరిస్థితిని ఊహించుకుంటేనే భయమేస్తోందని స్థానికులువాపోతున్నారు. ఏటా టాక్స్ లు వసూలు చేస్తున్న మున్సిపల్ పాలకవర్గం కాలనీల మౌళిక సదుపాయాలను గాలికొదిలేస్తోంది. పట్టణంలో మౌళిక వసతుల కోసం అప్పటి పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పది కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను సంగారెడ్డికి ఇచ్చారు. ఈ నిధులతో పాత కాలనీల్లో వేసిన రోడ్ల పైనే మళ్లీ రోడ్లు వేసి పాలకవర్గం బిల్లులు ఎత్తిందన్న ఆరోపణలున్నాయి. కొత్తగా ఏర్పడిన కాలనీలో రోడ్లు, మురికి కాలువలు, వీధి లైట్లు, తాగునీటి పైప్ వంటి పనులను చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో వివిధ కాలనీలలో నివసిస్తున్న ప్రజలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వానలు పడితే బయటికి రాలేని పరిస్థితి. తప్పని సరి పరిస్థితులలో బయటికి వెళ్ళాలంటే బండ్లైనా.. మనిషేనా బురదలో దిగుబడాల్సిందే. ఒక్కసారి కాలనీల ప్రజలే సొంత డబ్బులతో బురద రోడ్ల పై మొరం పోయించుకుంటున్నారు. రాత్రి పూట వీధి దీపాలు లేక అంతా చీకటి మయంగా మారుతుంది. పైప్ లైన్లు లేకపోవడం వలన చాలా చోట్ల నల్లాలు లేవు. నల్లాలు ఉన్న చోట్ల నీళ్లు రావు. రోజు రోజుకూ కొత్త ఇండ ్ల నిర్మాణం పెరిగిపోతుంది. మున్సిపల్ కు కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే తీరడం లేదు. సంగారెడ్డి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా పట్టణ అవసరాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. డంపింగ్ యార్డు కష్టాలు తీరేనా:
డంపింగ్ యార్డ్ లేక రోడ్లపైన చెత్త చెదారం పేరుకుపోయి గతంలో అనేక సార్లు ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు మొత్తం పూర్తయ్యాయి. గతంలో ఎన్నికలు ఉన్నాయన్న నేపథ్యంతో గత పాలకులు డంపింగ్ యార్డ్ స్థలం వేరే గ్రామంలో ఏర్పాటు చేశారు ఆ గ్రామ ప్రజలు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో తీవ్ర దుర్వాసన గురై అనారోగ్యాలకు గురవుతున్నారు. కానీ సంగారెడ్డి పట్టణానికి అధికారులు ప్రజా ప్రతినిధులు ఎందరో మారిన డంపింగ్ యాడ్ సమస్యను పరిష్కరించలేక పోతున్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో పాతవి 31 వార్డులు పోతిరెడ్డిపల్లి చింతలపల్లి గ్రామాలు కలుపుకుని మరో 7 వార్డులు కలుపుకుని 38 వార్డులున్నాయి. సంగారెడ్డి పట్టణంలో మురికి కాలువలు సీసీ రోడ్లు అండర్ డ్రయినేజీ తీవ్రంగా ఉంది కానీ ఈసారి ప్రజలు సంగారెడ్డి మున్సిపాలిటీకి కొత్త చైర్మెన్ వస్తే మున్సిపాలిటీ రూపురేఖలు మారుతాయని సంగారెడ్డి అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని ఆశించినంత సంగారెడ్డి ప్రజలకు నిరాశగానే నిలిచాయి. రెండుసార్లు మున్సిపల్ చైర్ పర్సన్గా కొనసాగినా సంగారెడ్డి పట్టణం ఎలాంటి అభివృద్ధి దశలో నడిపించే లేరని ఈసారైనా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
జహీరాబాద్లో సమస్యల తీష్ట...
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించిన తరహాలోనే పట్టణలాభివృద్ది కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ నెల 24 నుండి వారం రోజు పాటు మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టానున్నారు. అయితే మున్సిపాలిటీలలో నెలకొన్న సమస్యలు పట్టణ ప్రగతితోనైనా తీరుతాయని పట్టణవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మినహా మిగతా ఐదు మున్సిపాలిటీలు కొత్తవి. అయితే ఈ కొత్త మున్సిపాలిటీలు ఇటీవలే ఏర్పాటు కావడంతో నేటికి వాటిలో సమస్యలు పరిష్కారంకాలేదు. నారాయణఖేడ్, సదాశివపేట, జోగిపేట, తెల్లపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలు కొత్తవి ఏర్పాటు అయినాయి. అయితే ఇటీవలే నారాయణఖేడ్, సదాశివపేట, జోగిపేట, తెల్లపూర్, అమీన్పూర్లలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గం సైతం ఏర్పాటు అయింది. కోర్టు ఆదేశాల అనుసారం జహీరాబాద్ మున్సిపాలిటీలో మాత్రమే ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఆయా మున్సిపాలిటీల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలతో పాటు పాత మున్సిపాలిటీలలో సైతం పరిసరా గ్రామాలను విలీనం చేయడంతో సరిపడు సిబ్బంది లేని కారణంగా పారిశుధ్యం పనులు అతంత మాత్రంగానే జరుగుతున్నాయి.
పెరిగిన విస్తీర్ణం-తగ్గిన సిబ్బంది....
ఆయా మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం విస్తీర్ణం పెంచడంతో పరిసరాలలో 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో చేరాయి. అయితే మున్సిపాలిటీల విస్తీర్ణం పెరిగింది. కానీ దానికి అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. అన్ని మున్సిపాలిటీలలో పారిశుధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంటుంది. దీని పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని పలువురు అంటున్నారు.
నీటి కటకట ...
జహీరాబాద్ మినహా ఇతర మున్సిపాలిటీలలో ఇటీవలే మున్సిపాలిటీ ఎన్నికలు ఉండటంతో ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన అధికారులు ఎన్నికలు అనంతరం రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీలలో నేటికి మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. పట్టణాలలో ప్రజలు నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి మాసంలోనే ఈ తరహాలో ఉంటే ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గజ్వేల్ సమస్యలు పరిష్కారమయ్యేనా?
గజ్వేల్లోని అన్ని వార్డుల్లో 15 కమిటీల చొప్పున ఆదివారం సమావేశాలు నిర్వహించారు. నేటి నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ మున్సిపల్లో నెలకొన్న సమస్యలు పట్టణ ప్రగతిలో ఎంత వరకు పరిష్కారమవుతాయో చూడాలి.
గజ్వేల్ మున్సిపల్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. 20 వార్డుల్లో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. మిషన్ భగీరథ నీరు ఇంటింటికి ఇస్తున్నప్పటికీ పాత బస్తీలు ఇప్పటికి పైప్ లైన్లు పూర్తి స్థాయిలో వేయలేకపోయారు.ఇందిరాపార్కు నుండి కోటమైసమ్మ వరకు రోడ్డు విస్తరణ పూర్తి కాకపోవడంతో రోడ్డుపైనే పైప్లైన్ పరిచి నీరు అందిస్తున్నారు. మున్సిపాలిటీగా 2012లో మారినప్పటికీ ఇప్పటికీ గజ్వేల్ పట్టణంలో ఎలాంటి మార్పులు లేకపోయాయి. పాత బస్తీతో పాటు నూతన కాలనీల్లో సమస్యలు యాధావిధంగా ఉన్నాయి. గజ్వేల్ మున్సిపల్లోని ప్రజ్ఞాపూర్, ముట్రాజ్పల్లి, క్యాసారం గ్రామాలతో పాటు మధిర గ్రామాలను విలీనం చేశారు. మొదటి పాలకవర్గం 2014లో ఏర్పడినప్పటికీ సభ్యుల మధ్యన సఖ్యత లేక అభివృద్ధికి నోచుకోలేదు. అప్పట్లో 20 వార్డులకు గాను 9 టీఆర్ఎస్, 10 టీడీపీ, 1 కాంగ్రెస్ విజయం సాధించగా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్లో చేరిపోయారు.దీంతో ప్రజా సమస్యలను మున్సిపల్ సమావేశాల్లో ప్రశ్నించే నాయకులు లేకపోయారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు కావడంతో అధికార పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సమస్యలను అడగ లేకపోయారు.మురికి కాల్వలు, గ్రామపంచాయతీ కాలంలో నిర్మాణం చేపట్టినవి. ఆ తర్వాత అక్కడక్కడ మాత్రమే మురికి కాల్వలు చేపట్టిన నాణ్యత లోపించాయి. కౌన్సిలర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. దీంతో నాణ్యతను ప్రశ్నించే నాయకులు లేకపోవడం వల్ల ఇష్టాను రాజ్యాంగ ఐదేండ్ల పాటు మొదటి పాలకవర్గం కొనసాగింది. ప్రస్తుతం కొత్త కాలనీల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. రోడ్లు, మురికి కాల్వలు ఎక్కడ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ మున్సిపల్లో మొత్తం 11 వేల ఇండ్ల వరకు ఉన్నాయి. ప్రజ్ఞాపూర్, గజ్వేల్, పెద్ద గ్రామాలు కావడం రోజు ప్రజలు సుమారు 25 వేలకు పైగా రాకపోకలు సాగిస్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా గ్రామాల్లో సరిగ్గా లేకపోయాయి. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి గజ్వేల్ నుండి గెలుపొంది సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. నూతన పాలకవర్గం ఇటీవల కొలువు దీరింది. 20 వార్డులకు గాను టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 1, స్వతంత్రులు ఆరుగురు విజయం సాధించారు. ఇందులో ఐదుగురు టీఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ఉన్నారు. మున్సిపల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో లేవనెత్తే కౌన్సిలర్లు ఉంటనే సమస్యలు పరిష్కారమవుతాయి. చైర్మెన్గా నేతి చిన్న రాజమౌళి, వైస్ చైర్మెన్గా జకీయోద్దీన్ ఎన్నికయ్యారు. ఈ పాలకవర్గంలో ఏజెండా పొందుపరిచిన అంశాలను పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటే ప్రజా సమస్యలనే సమావేశంలో కౌన్సిలర్లు లేవనెత్తాలి.అప్పుడే పరిష్కారానికి నోచుకుంటాయని చెప్పొచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అండర్ డ్రయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులకు రూ.99కోట్లు మంజూరు చేశారు.ఈ పనులు పూర్తి చేస్తే కొంత వరకు సమస్యలు తీరవచ్చు.
ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తాం
గజ్వేల్ మున్సిపల్లో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తాం. పట్టణ ప్రగతిలో సమస్యలు గుర్తిస్తాం. వాటిని పరిష్కారించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతాం. ప్రజలకు అవసర పడే మౌళిక సదుపాయలు కల్పిస్తాం. నిత్యం గజ్వేల్ పట్టణానికి ప్రజలు వివిధ గ్రామాల నుండి వస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిచేందుకు కార్యచరణ తీసుకుంటాం. వేసవి కాలంలో తాగు నీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపడుతాం. రోడ్డు విస్తరణ విషయం పై సీఎం దృష్టికి తీసుకపోతాం.
- రాజమౌళి, గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్
అన్ని వార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
అన్ని వార్డుల్లోనూ నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మురికి కాల్వలు, రోడ్లు పుననిర్మాణం చేపడుతాం. అందుకు సీఎం రూ. 100 కోట్లు ఇచ్చారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయాం. పైప్లైన్ ద్వారా మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నాం. రోడ్డు విస్తరణ వల్ల కొంత భాగం ప్రత్యేక లైన్ తీసి ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తాం.
- గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ నిమ్మ కృష్ణారెడ్డి