Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట టౌన్
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం చదువునందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో ఆదర్శమైన చదువులందుతున్నాయి. స్కూళ్లలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకున్న స్కూళ్లలో అనుభవమున్న టీచర్లతో నాణ్యమైన విద్యనందిస్తుం డటంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. ఆరో తరగతిలో 100 సీట్లకు ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తుండగా, 7 నుంచి 10వ తరగతి వరకు పాఠశాల ల్లో మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కోసం టెన్త్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 14 మోడ ల్ స్కూళ్లున్నాయి. ప్రతి తరగతిలో వంద సీట్లు భర్తీ చేయడంతో ఆ పాఠశాలల్లో రెండు సెక్షన్లు ఉంచారు.
ప్రవేశ పరీక్ష 100 మార్కులు...
ఈ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష విద్యార్థులకు 100 మార్కులకు ఉంటుంది. స్టూడెంట్లు సీట్ల కోసం దరఖాస్తులు చేసుకునే ముందు తరగతి పాఠ్యాంశాల సిలబస్పై పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న పిల్లలకు ఐదో తరగతి సిలబస్పై పరీక్ష నిర్వహిస్తారు. ఎనిమిదో తరగతిలో ప్రవేశం కావాలంటే ఏడో తరగతి సిలబస్పై పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 25 మార్కుల చొప్పున తెలుగు, గణితం, ఈవీఎస్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. పాఠశాలలో ఉన్న సీట్ల ప్రకారం మెరిట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
తీవ్రమైన పోటీ...
ఆదర్శ పాఠశాలల్లో ప్రభుత్వం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం విద్యనందిస్తుండటంతో ఏటా పరీక్ష రాసే వారి సంఖ్య పెరుగుతోంది. పైగా బాలికలకు హాస్టల్ వసతి ఉండటంతో పోటీ పడి ప్రవేశ పరీక్ష రాస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 14 పాఠశాలలుండటంతో లోకల్ విద్యార్థులతో పాటు నాన్ లోకల్ విద్యార్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు.
దరఖాస్తు విధానం ఇలా ...
ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం తెలంగాణ, సీజీజీ, జీవోవీఇన్లో దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం జనరల్ అభ్యర్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రూ.75 ఫీజు చెల్లించాలి. విద్యార్థి పాస్ఫోటో, బోనాఫైడ్, ఆధార్కార్డు తదితర ధృవీకరణ పత్రాలను తీసుకెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏ మండలంలో మోడల్ స్కూల్ ఉందో అదే మండలంలో అంతకుముందు రెండు తరగతులు చదివిన విద్యార్థులు అర్హులవుతారు. స్థానిక విద్యార్థులు లేనట్టయితే నాన్ లోకల్ వారికి అవకాశం కల్సిస్తారు.
ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష...
మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం ఆరో తరగతిలో చేరే వారు ఫిబ్రవరి 29, 7నుంచి10 తరగ తుల్లో చేరే వారు మార్చి 2లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 12న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి వారికి, 7నుంచి10 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. మే 20న పాఠశాలల వారీగా మార్కుల వెల్లడి, మే 27న ఎంపికైన జాబితాను పాఠశాల నోటీసు బోర్డుపై ఉంచుతారు. మే 28-31 ధృవపత్రాల పరిశీలన, ప్రవేశాలుంటాయి. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
పేద విద్యార్థులు ఆదర్శ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరో తరగతిలో 100 సీట్లుంటాయి. కానీ ఇప్పటి వరకు 1400 వరకు దరఖాస్తులొచ్చాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాం. మోడల్ స్కూల్లో ఎలాంటి ఫీజూ లేకుండా అత్యుత్తమ బోధనందిస్తున్నాం. పోటీ పరీక్షలకు, క్రీడలకు ప్రాముఖ్యతనిస్తాం.
- రాధారం నాగరాజు,
ఇర్కోడు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్