Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎక్కడ చూసినా స్వాగతం పలుకుతున్న సమస్యలు
-అస్తవ్యస్తంగా పారిశుధ్యం
-విలీన గ్రామాల్లో గాడిలో పడని పాలన
నేటి నుంచి పట్టణ ప్రగతి
నవతెలంగాణ -మెదక్/నంగునూరు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలుండగా మెదక్ జిల్లాలో నాలుగు మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తుప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్ది, సదాశివపేట, ఐడీఏబొల్లారం, నారాయణఖేడ్, జగదేవపూర్, ఆందోల్-జోగిపేట, తెల్లాపూర్, అమీన్పూర్ ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. సిద్దిపేట, జహీరాబాద్ మినహాయిస్తే మిగతా పదిహేను మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. కొత్త చైర్మెన్లకు, వార్డుకౌన్సిలర్లకు సమస్యలు స్వాగతం పలికాయి. వర్షాకాలం వస్తే పొంగిపొర్లే డ్రయినేజీల్లేక ప్రధాన రోడ్ల వెంట చెత్త పోయడం, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు లేక మున్సిపాలిటీలోని శివారు కాలనీవాసులకు తప్పడం లేదు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో నేటికీ పాత సమస్యలు దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అభివద్ధికి నోచుకోవడం లేదు. కొత్త పాలక వర్గాలు ఏర్పడినప్పటికీ సరిపడా సిబ్బంది లేక ఉన్న వారితోనే పారిశుధ్య పనులు చేస్తున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు.
సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, ఐడీఏ బొల్లారం, నారాయణఖేడ్, జగదేవపూర్, ఆందోల్జోగిపేట, తెల్లాపూర్, అమీన్పూర్ ఎనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోనూ ప్రధాన సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుధ్యం లోపించింది. డంపింగ్యార్డు సమస్య ఉంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బంది సమస్య వేధిస్తోంది. జహీరాబాద్లో మురుగునీటి ప్రవహించడంతో రోడ్లన్ని అధ్వానంగా తయారయ్యాయి. సదాశివపేట మున్సిపాలిటీలో, పటాన్చెరు,బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీల్లోనూ ప్రధానంగా పారిశుధ్యం లోపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురుగునీరు రోడ్లపైకిరావడం, వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో దుర్వాసన వెదజల్లి ప్రజలు సతమతమవుతున్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేటతోపాటు చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో అధికారుల, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినా సిద్దిపేటలో 30శాతం మేర సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన చేర్యాల మున్సిపాలిటీకి ఇన్చార్జ్జి కమిషనర్ విధులు నిర్వర్తిస్తున్నారు. దుబ్బాకలోనూ కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో యూజీడీ పైపులైన్ కోసం రోడ్డు తవ్వడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుండి బార్ఇమామ్ మీదుగా సిద్దిపేట పాత బస్టాండ్ వరకు రావాలంటే పట్టపగలే చుక్కలు కన్పిస్తాయి. రద్దీగా ఉండే ప్రదేశంతో యూజీడీ కోసం తీసిన గుంతలు పూడ్చకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో బస్డిపో, బీడీ కాలనీ, నేతాజీనగర్ కాలనీల్లో ఇండ్ల నుంచి వచ్చే మురికి నీరంతా ఇండ్ల మధ్యనే నిలిచిపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నారు.
ఆహ్లాదం కరువు..
ఆయా మున్సిపాలిటీల్లోని పార్కుల్లో ప్రజలు కాసేపు సరదాగా గడుపుదామన్న పార్కులు లేవు. ఉన్న పార్కులో సరైన వసతులు లేవు. ఉమ్మడి జిల్లాలోని అనేక మున్సిపాలిటీల్లో పలు పార్కు కబ్జాకు గురయ్యాయి. పెద్ద మున్సిపాలిటీల్లో పార్కులు ఏర్పాటుచేసిన మెయింటెనెన్స్ లేక చెత్త కుప్పలను తలపిస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదు. పట్టణ ప్రగతితోనైనా వాటి రూపురేఖలు మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
పది రోజుల్లో... పట్టణ ప్రగతి మారేనా..
ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. పల్లె ప్రగతి బాటలో పట్టణ ప్రగతి శ్రీకారం చుట్టింది. ఈనెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా మంత్రి హరీశ్రావు పటాన్చెరులో ఇటీవల మున్సిపల్ కౌన్సిలర్లకు అధికారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మున్సిపాలిటీలలో కొత్త చట్టంలో పాలక వర్గాలపై బాధ్యత పెంచిన ప్రభుత్వం అధికారాలకు కత్తెర వేసి జిల్లా కలెక్టర్లకు పెత్తనం ఇచ్చింది. ప్రతి తీర్మానం, వాళ్లపై కలెక్టర్లతో సమీక్ష చేసే అధికారం కల్పించింది. అంతేకాదు సభ్యులు పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాలు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలి. అధికారులతో మొక్కలు నాటడం తో పాటు 85 శాతం బతికేలా గ్రీన్ సెల్ ఏర్పాటు చేయాలి. చెరువులు కుంటలు సంరక్షించేందుకు పెద్దపీట వేయాలి. వాటన్నిటిపై నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్లకు తొలగించే అధికారం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న కొత్త మున్సిపల్ చట్టంతో పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.