Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాష్ట్రంలో ఎన్పీఆర్ అమలు చేయబోమని...
-అసెంబ్లీలో తీర్మానం చేయాలి
-ప్రజల మధ్య కేంద్రం చిచ్చు
-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లతో ప్రజల మధ్య బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెడుతోందని తెలంగాణ రాష్ట్రంలో ఎన్పీఆర్ అమలు చేయమని అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం 'భారత పౌరసత్వ చట్టం సవరణలు-రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం దాడి' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శఆముదాల మల్లారెడ్డి, ప్రముఖ న్యాయవాది ఏ బాబురావు, సీపీఐ పట్టణ కార్యదర్శి బన్సీలాల్, ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తయ్య, మైనార్టీ నాయకులు వహీద్ఖాన్లు మాట్లాడారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ద్వారా దేశంలోని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని విమర్శించారు. ఎన్పీఆర్ సర్వేను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. సీఏఏ అనేది హిందూ ముస్లిం సమస్య కాదని భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడి సమస్యని ప్రజలందరూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకించాలన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి తల నరకాలన్న బీజేపీ నేత రఘునందన్రావు తన మాటలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నక్కల యాదవరెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రమేశ్, మానవ హక్కుల సంఘం నాయకులు అమన్, ఆర్టీఐ నాయకులు హర్షద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, చేర్యాల మాజీ జెడ్పీటీసీ కళావతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్ మావో, శశిధర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి చందు, సర్పంచ్ రవీందర్, నాయకులు యాదగిరి, రేవంత్ కుమార్, అరవింద్, జావిద్ ఉన్నారు.