Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాపన్నపేట
మండల కేంద్రమైన పాపన్నపేటలో కోపరేటివ్ బ్యాంక్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేసిన ఘటన పాపన్నపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన పాపన్నపేట బస్టాండ్ ఎదురుగా కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉంది. సోమవారం అర్ధరాత్రి బ్యాంకు వెనుక గల డోర్ను పగలగొట్టి దుండగులు బ్యాంక్లోకి ప్రవేశించారు. అనంతరం సీసీ కెమెరాల కు సంబంధించిన వైర్లను కత్తిరించి, లాకర్ గదికి సంబంధించిన గోడకు కన్నం వేశారు. తర్వాత అందులోకి ప్రవేశించి లాకర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు కానీ లాకర్ ఓపెన్ కాలేదు. దాంతో వెనుదిరిగిన దొంగలు తమను సీసీ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశం ఉన్నట్టు గ్రహించి సీసీి కెమెరాలను ధ్వంసం చేసి, హార్డ్ డిస్క్ తో పాటు సీపీయూలను ఎత్తుకెళ్లారు. క్యాషియర్ రూమ్లోకి వెళ్లిన దుండగులు అక్కడ అద్దాలను సైతం పగలగొట్టి వెళ్లారు. ఉదయం విషయం గమనించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్సై కష్ణారెడ్డి, పాపన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు .అలాగే డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ బ్యాంకు నుంచి బస్టాండ్ వరకు వెళ్లి వెనుదిరిగింది. ఫింగర్ ప్రింట్ బందం ఆధారాలు సేకరించారు. అనంతరం బ్యాంకు సిబ్బంది లోపలికి వెళ్లి లాకరును పరిశీలించగా దుండగులు లాకరును ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పటి కీ అది ఓపెన్ కాలేదని నిర్ధారించుకున్నారు. దాంతో ఎలాంటి బంగారం కానీ నగదు కానీ చోరీ జరగలేదు. అయితే దుండగులు సీసీ కెమెరాలు వైర్లు కట్ చేయడం , వాటిని ధ్వంసం చేయడమే కాకుండా వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్, సిపీయూను ఎత్తుకెళ్లడంతో వారు ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే పాపన్నపేట బస్టాండ్ సమీపాన గల వివిధ సీసీ కెమెరాలతో పాటు, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాల ఆధారంగా పరిశోధన చేసి దొంగలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. చోరీకి విఫలయత్నం చేసిన వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు.