Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పంట నష్టం
- నష్టపోయిన వారిలో అధికంగా కౌలు రైతులే
- సర్వేలో నిమగమైన రెవెన్యూ, వ్యవసాయ శాఖలు
నవతెలంగాణ-మాడ్గులపల్లి
అకాల వర్షంతో చేతికందిన పంటలు రైతుల కండ్ల ముందే వరద పాలయ్యాయి. వందలాది ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశకు వచ్చిన వరి పైరు పొలాల్లోనే ఒరిగింది. ఏరడానికి సిద్ధమైన పత్తి చెట్టుపైనే నల్లబారింది. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన వారిలో అధికంగా కౌలు రైతులే ఉన్నారు. మండలంలో మొత్తం 28 గ్రామపంచాయతీలున్నాయి. మండల సాధారణ సాగు విస్తీర్ణం 43,600 ఎకరాలు కాగా ఈ సీజన్లో వరి 22,200 ఎకరాల్లో, పత్తి 19,600 ఎకరాల్లో సాగైంది. ఇతర పంటలు 1800 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ ఏడాది వర్షాలు ముందుగానే రావడంతో రైతులు పంటలను ముందుగానే సాగు చేశారు. ఈ సారి ఆశించిన దిగుబడి వస్తుందని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అకాల వర్షం వల్ల దిగుబడి పక్కనే పెడితే పెట్టిన పెట్టుబడి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నష్టపోయిన వారిలో అధిక శాతం మంది కౌలురైతులే ఉన్నారు. వరికి ఎకరాకు సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 30 బస్తాలు దిగుబడి రాగా అందులో 16 బస్తాలు కౌలు ఇవ్వాలి. కౌలు రైతుకు కేవలం 14 బస్తాలు మాత్రమే మిగులుతోంది. పత్తి ఎకరాకు పెట్టుబడికి సుమారు రూ.20-25 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఇందులో రూ.15 వేలు కౌలు చెల్లించాలి. పంట మంచిగా సాగైతే 15-20 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం క్వింటాల్ రూ.5 వేల వరకూ కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తింపజేయకపోవడంతో వారు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి పంట సాగు చేయాల్సిన పరిస్థితి ఉంది.
సర్వేలో నిమగమైన రెవెన్యూ, వ్యవసాయ శాఖలు
అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలను అంచనా వేయడానికి రెవెన్యూ, వ్యవసాయశాఖాధికారులు సర్వే చేస్తున్నారు. మండలంలో 4600 ఎకరాల్లో వరి, 2300 ఎకరాల్లో పత్తి పంటలు నష్ట పోయినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
వరుణుడు నిండా ముంచాడు : నాంపల్లి జగన్, కల్వెలపాలెం, కౌలు రైతు.
నేను రెండెకరాల్లో కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేశాను. సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాను. అకాల వర్షం వల్ల పత్తి మొత్తం నీటిలో కొట్టుకుపోయింది.దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాను : వల్లపట్ల సైదులు, కౌలు రైతు, కల్వెలపాలెం.
మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. ఎకరాకు సుమారు రూ.25-30 వేల వరకూ పెట్టుబడి పెట్టాను. అకాల వర్షం వల్ల ఎకరంన్నర వరకూ నష్టపోయాను. అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలి.