Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ -మోటకొండూర్
అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు బంగారు తెలంగాణలో భరోసా కరువైందని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి, బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. శనివారం మండల పరిధిలోని చాడ గ్రామంలో అకాల వర్షానికి తడిచి ముద్దాయి నేలకొరిగిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయంలో వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారన్నారు. పంట నష్టం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. జలయజ్ఞం పేరుతో ధన దోపిడీ చేస్తూ ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే వ్యూహాలు పన్నుతున్నారు తప్ప రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్థిక సహాయం అందజేత
మండల పరిధిలోని చాడ గ్రామానికి చెందిన రాజ బోయిన ఐలయ్యకు చెందిన 40 గొర్రెలు ఇటీవల వర్షానికి కాలువలో కొట్టుకుపోయాయి. దీంతో ఆ కుటుంబానికి శనివారం బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల ఐలయ్య బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మండల పరిధిలోని చాడ గ్రామానికి చెందిన పంగరెక్క వెంకటేష్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రూ.5వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చాడ ప్రతిభ శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల మదర్, బీర్ల ఫౌండేషన్ మండల ఇంచార్జ్ భాస్కరుని రఘునాథ్ రాజ్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జేట్ట అంజయ్య,ఎక్ సుమన్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గుర్రాల పాండు, విట్టల్ రెడ్డి, రాజాబోయిన గణేష్, సోప్పరి మహేష్, బాబు, తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న ఐలయ్య
భువనగిరినుండి మోత్కూర్ వైపు భార్య భర్తలు స్కూటీపై వెళ్తుండగా కాటేపల్లి వద్ద మెయిన్ రోడ్డుపై ఏర్పడిన గుంతల తప్పించబోయి కింద పడి తీవ్ర గాయాలయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, బిర్లా ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల ఐలయ్య చాడ గ్రామానికి వస్తుండగా కళ్ళముందే సంఘటన జరగడంతో వెంటనే తన వాహనాన్ని పక్కకు నిలిపారు. క్షతగాత్రులకు గాయాలు కావడంతో దగ్గరుండి వారిని ప్రత్యేక ఆటోలో భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు, ఆయన వెంట సుమన్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ ఉన్నారు.