Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమన్వయ సమితుల ఏర్పాటు
- ఎరువుల డబ్బులు,
మద్దతు ధర బాధ్యతలు
- భూ రికార్డుల సరళీకరణలోనూ కీలకం
- ఓటు బ్యాంకుగా మల్చుకునే వ్యూహం
- చట్టబద్ధత లేని సమితులతో జవాబుదారీ తనం ఎలా సాధ్యం
- సహకార సంఘాలను నిర్వీర్యం చేసే కుట్ర
కవితకు కాదేదీ అనర్హం అన్నట్టుగానే రాజకీయానికి కాదేదీ అవకాశం అన్నట్టుగా ఉంది. అన్ని వర్గాల ప్రజల్నీ ఆకర్శించడం ఓ ఎత్తు అయితే రైతాంగాన్ని ఒప్పించడం మరో ఎత్తు కావడంతో సర్కార్ దృష్టి అటువైపు మళ్లింది. రైతులతో రాజకీయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. చట్టబద్ధతలేని రైతు సంఘాల సమన్వయ సమితులు పెట్టి చట్టపరమైన సహకార సంఘాల్ని నిర్వీర్యం చేసే కుట్రకు పూనుకుంటుంది. మద్ధతు ధర, ఎరువుల డబ్బుల పంపిణీ, భూ రికార్డుల సరళీకరణ వంటి పనుల్ని ప్రభుత్వం, ఆయా శాఖలు చేయలేకపోతున్నాయి. పూర్తిగా రాజకీయపరంగా నియమించే రైతు సమితులెలా రైతు సమస్యల్ని పరిష్కరిస్తాయనేది స్పష్టతలేదు. ఆర్థిక వ్యవహారాన్ని చక్కబెట్టడం ఎలా సాధ్యమని వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
నవతెలంగాణ-నల్లగొండ ప్రతినిధి
సమన్వయ సమితుల వల్ల రైతులకు మేలు చేకూరడం ఏమో కానీ..! వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం ఖాయంగా తెలుస్తుంది. రైతు రాజకీయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి రైతు సంఘాల సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని షెడ్యూల్ ప్రకటించారు. 10 నుంచి 14వ తేదీ వరకు సంఘాలకు అవగాహనా సదస్సులు నిర్వహించనున్నారు. 15 నుంచి డిసెంబర్ 15 వరకు రెవెన్యూ గ్రామ మిగతా3లో
రైతు...
యూనిట్గా రెవెన్యూ రికార్డుల సరళీకరణ చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో 586 రెవెన్యూ గ్రామాలున్నాయి. సూర్యాపేటలో 253 గ్రామాలున్నాయి. వీటితో పాటు నల్లగొండలో 31 మండల సమితులు, సూర్యాపేట జిల్లాలో 23 సమితుల్ని ఏర్పాటు చేయనున్నారు.
చట్టబద్ధతలేని సమితులు జబాబుదారీ అవుతాయా..?
వ్యవసాయ రంగంలో ఈ దశాబ్ద కాలంలో వచ్చిన పరిణామాల్ని పరిశీలిస్తే... చంద్రబాబు పాలనలో ఎంఈఓలు వ్యవసాయ మండల విస్తరణాధికారుల్ని పెట్టారు. వైఎస్సార్ వచ్చాక వాళ్లను తొలగించి ఆదర్శ రైతుల్ని నియమించారు. వీరంతా కూడా వ్యవసాయ రంగానికి చెందిన వారే అయినప్పటికీ పక్కా రాజకీయ ముసుగులో ఎంపిక చేయబడిన వారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా రాజకీయ నియామకాలకు పూనుకుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సంఘాల సమన్వయ సమితుల్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ కమిటీలకు వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహారించడం తప్పితే ఏలాంటి చట్టబద్దత ఉండదనేది సుస్పష్టం. పక్కా రాజకీయ ముసుగులోల రైతుల్ని కమిటీకి ఎంపిక చేయాలని చూస్తున్నారు. ఇలాంటి కమిటీకి కీలకమైన బాధ్యతలు ఒప్పజెబితే జబాబుదారి తనం ఎలా ఉంటుందని వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నాయి. ఏటా రెండు పంటలకు అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం ఎకరానికి రూ.4 వేల చొప్పున మొత్తం రూ.8 వేల రూపాయల్ని రైతులకిస్తారు. అట్టి డబ్బుల్ని రైతు కమిటీల ద్వారా పంపిణీ చేస్తామంటున్నారు. అలాగే దిగుబడులకు మద్దతు ధర విషయంలోనూ సంఘాలు జోక్యం చేసుకుంటాయంటున్నారు. వీటికి ఏ అధికారంలేనప్పుడు ధరల్ని నిర్ణయించడం, అమలు అయ్యేట్లు చూడడం ఎలా సాధ్యమనేది ప్రశ్నగా ఉంది. ముఖ్యంగా భూముల సర్వే బాధ్యతల్ని కూడా రైతు సంఘాలకే ఇస్తామంటున్నారు. పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. పట్టాలున్న భూముల్లోనూ అనేక వివాదాలున్నాయి. కోర్టు పరిధిలో కేసులు నడుస్తున్నాయి. పట్టాలివ్వని అసైన్డ్, అటవీ, ఇతర ప్రభుత్వ భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. ఇలాంటి వివాదాల్ని రైతు సమితులు ఏ పద్ధతిలో పరిష్కారం చూపుతాయనేది అంతుచిక్కట్లేదు. రైతు కమిటీలకు మంత్రి ఇన్చార్జీగా ఉంటారంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు కమిటీల్ని ఏర్పాటు చేసే అధికారం కట్టబెట్టారు. విపక్ష ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యతేమీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ వాళ్లు నియమించే కమిటీల్లో 80 శాతం గులాబీ రైతులే సభ్యులుగా ఉంటే గ్రామ రైతులందరి సక్షేమానికి ఎలా పాటుపడతాయనేది చెప్పాలి. ఓటు బ్యాంకు రాజకీయం కోసం రైతుల్నీ వాడుకోవడం తప్పితే అదనంగా ఒనగూరేదీమీ ఉండదంటున్నారు.
సహకార సంఘాల నిర్వీర్యం చేసే కుట్ర
రైతుల ప్రయోజనాల కోసం రైతులే సొసైటీలుగా ఏర్పడి సహకార వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. వంద ఏండ్ల పైబడిగా రైతు సహకార సంఘాలు నడుస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఎసీస్)లు కో-ఆపరేటివ్ చట్టాలతో నడుస్తున్నాయి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సహకార సంఘాలున్నాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, రాష్ట్ర స్థాయిలో బ్యాంకులున్నాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 107 సహకార సంఘాలున్నాయి. వీటికి సీఈఓ అనే అధికారులున్నారు. అదే వి ధంగా పాలక వర్గాలున్నాయి. వీటిలో భూములన్న రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కొ సంఘంలో 1500 నుంచి 6 వేల వరకు సభ్యులున్నారు. అన్ని సంఘాల్లోనూ కలిపి 4.28 ల క్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీటి ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల పంపిణీ జరుగుతుంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలిస్తున్నారు. దీర్ఘకాలిక రుణాల కింద ట్రాక్టర్లు, మోటర్లు, బావులు, గేదెలు, గొర్రెల్ని కూడా ఇస్తున్నారు. ఆడిట్ విభాగం, అధికార యంత్రాంగం, పాలక వర్గాలున్నాయి. చట్టబద్ధమైన సహకార సంఘాల్ని బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేస్తున్నారు. రైతు సమితుల్ని పెట్టి సహకార సంఘాల్ని దెబ్బతీయడం వల్ల సహకార రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, రైతులకు అందుతున్న పథకాలు, సేవల్ని దూరం చేయడమే అవుతుందని పలువురు సహకార సంఘాల సీఈఓలు పేర్కొంటున్నారు.