Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ తెలంగాణ పట్ల వివక్ష తగదు
- ఇక్కడి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
- సాగర్కు ఆల్మట్టి నీళ్లు తెప్పించాలి
- కర్ణాటకపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిల పక్షం వేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రతినిధి
'మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేస్తున్నారు. ఉద్యోగాలడిగితే నిరుద్యోగుల్ని అణచివేస్తున్నారు. ప్రాజెక్టులకు నీళ్లివ్వమని కోరితే కేసులు పెడుతున్నారు. ఇది రాచరిక పాలనను తలపిస్తుంది' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బుధవారం దొడ్డికొమరయ్య భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని తమపార్టీ చేసిన పోరాటానికి ముఖ్యమంత్రి స్పందించి నీళ్లు తెప్పించేందుకు పూనుకోవడం సంతోషకరమన్నారు. అఖిలపక్షం వేసి ఢిల్లీకి తీసుకుపోవాలన్నారు. కేంద్రం ద్వారా కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగర్కు సరిపడా నీళ్లు తెప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో దక్షిణ ప్రాంతం పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే తేడాను చూపించడం సరికాదన్నారు. నల్లగొండకు సాగు, తాగునీరు అందించే ఎస్సెల్బీసీ సొరంగం, డిండి ఎత్తిపోతల పథకాల్ని పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు కమిటీల్లో అన్ని వర్గాలకు చెందిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూముల సర్వే విషయంలోనూ వివాదాల్ని పరిష్కరించేలా ఉండాలన్నారు. రైతులకు ఇచ్చే రూ.4 వేల ఆర్థిక సహాయాన్ని అర్హులైన రైతులకు విధిగా ఇవ్వాలన్నారు. ఆదర్శ రైతుల మాదిరి రాజకీయ నియామకాలు చేయకూడదని సూచించారు. కమిటీల్లో అందరికీ అవకాశం కల్పించాలన్నారు. మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్నారు. నోటిఫికేషన్లు తప్ప నియామకాలు చేసింది లేదన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల్ని భర్తీ చేయాలని కోరుతూ సభలు పెట్టుకుంటే అనుమతులివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. ఒట్టిపోయిన సాగర్కు నీళ్లివ్వాలని కోరుతూ ఆందోళన చేసిన రైతులు, నాయకులపైన పోలీసుల చేత కేసులు పెట్టించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా పోరాటాల్ని కేసుల ద్వారా అణచివేయాలని చూస్తున్న కేసీఆర్కు తగిన గుణపాఠం తప్పదన్నారు. ప్రజా స్వామ్య యుతంగా పోరాటాలు చేస్తున్న వాళ్ల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం అప్రజాస్వామికమన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, బండ శ్రీశైలం పాల్గొన్నారు.