Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండా వానల్లోనూ గొర్రెలను సంరక్షిస్తున్న కాపరులు
- అగమ్యగోచరంగా బతుకులు
- కష్టం ఎక్కువ... ఆదాయం తక్కువ
నవతెలంగాణ-నల్లగొండడెస్క్
వానకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా మూగజీవాలను సంరక్షించుకోవడమే జీవనాధారంగా గొర్రెల కాపరులు బతుకులు వెల్లదీస్తున్నారు. వాటిని కాపాడు కోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కానీ ప్రభుత్వం సగం సగం పనులు చేస్తూ వారి మనుగడను ఆగమాగం చేస్తోంది. ఆడపాదడపా గొర్రెలను పంపిణీ చేసింది కానీ వాటి సంరక్షణ మరిచింది. మందులు, షెడ్డులు, దాణా, భూ కేటాయింపు వంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఎంతో కష్టపడి కాపాడుకున్న గొర్రెలకు మద్దతు ధర ఉండదు. ఇలా అయితే తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని గొర్రెల కాపరులు ఆవేదన చెందుతున్నారు.
గొర్ల కాపరుల బతుకులు రోజురోజుకూ అగమ్యగోచరంగా మారుతున్నాయి. కష్టం ఎక్కువ. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. జిల్లాలో దాదాపు 9 వేలకు పైగానే గొర్రెల కాపరులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది యాదవ కులానికి చెందిన వారే. గొర్రెలను మేపటం, వాటి అమ్మకం ద్వారా వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాలను పోషించాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దు పొడవక ముందే నిద్రలేచి గొర్రెల కొట్టాల వద్దకు పరుగులు తీస్తారు. గొర్ల కొట్టాన్ని శుభ్రపరచి, వాటిలో అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకుంటారు. లేని వాటికి మందులు వేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. హడావిడిగా ముఖం కడుక్కొని ఏదో కాస్తంత బువ్వ తిని, గొర్రెలను మేపడానికి అడవికి వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, బీడు భూములు ఏవీ లెక్క చేయకుండా వాటిని కాపాడుకోవడమే ధ్యేయంగా తిరుగుతూ గొర్రెలను మేపుతారు. గొర్రెలను మేపుతున్న సమయంలో కాపరులకు సమయమంటూ తెలియదు. పొద్దంతా ఒకచోట కూర్చునే సమయమంటూ వారు ఎరుగరు. వారి వెంట తెచ్చుకున్న సద్దిని తినడానికి కూడా ఒక్కోసారి వారికి సమయం ఉండదు. కొన్ని సార్లు వాటిని ఓ కంట గమనిస్తూనే నిలబడి నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటారు. కొన్ని సమయాల్లో వారు వెళ్లిన ప్రదేశాల్లో చుక్కనీరు కూడా దొరకక అల్లాడుతారు. తాము ఎంత ఇబ్బందిపడినా తమ గొర్రెల కడుపునిండా మేత మేయాలన్నదే వారి కోరిక. ఒక్కోరోజు గొర్రెలు కడుపునిండా మేత మేయకపోతే ఆరోజు కాపరుల ముఖాల్లో సంతోషమంటూ కనిపించదు. గొర్రెల కాపరులకు బంధువుల క్షేమ సమాచారమూ తెలియదు. అతని ఇంట్లో శుభకార్యం ఉన్నా కుటుంబీకులతో, బంధువులతో కలసి సంతోషంగా గడిపిన రోజులంటూ ఉండవు. హడావిడిగా తిని తన గొర్రెల దొడ్డి వద్దకు చేరుకుంటాడు. గొర్రెలను మేపుతున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గొర్రెలకు రోగాలు వస్తుంటాయి. చలి కాలంలో కూడా రోగాల బారిన పడి మృత్యువాత చెందుతాయి. గొర్రెల కాపరులు ఏడాదంతా చేసిన కష్టం వృథా అయినా తన వృత్తిపై ఎన్నడూ విసుగు చెందక గొర్రెలనే నమ్ముకొని జీవితాన్ని సాగిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని పొలాలను వెంచర్లు ఏర్పాటు కోసం కొందరు బడా వ్యాపారవేత్తలు కొనుగోలు చేసిఆ పొలం చుట్టూ కంచెలు ఏర్పాటు చేయడంతో గొర్రెలను మేపాలంటే గొర్లకాపరులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెరువు, కుంటల్లో నీరు లేకపోవడంతో గొర్రెలకు నీరు పెట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసిందే తప్ప వాటిని సంరక్షించేందుకు ఎటువంటి ఆధారమూ చూపించకపోవడంతో అష్టకష్టాలు పడుతూ గొర్రెలను కాపాడుకుంటున్నారు. గొర్రెలకు ఏదైనా వ్యాధి సోకిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్దకు వెళ్లి మందులు అడిగితే తమ వద్ద లేవని నిర్లక్షపు సమాధానాలు చెప్తుంటారు. దీంతో నాటు మందులు లేదా ప్రయివేటు మందులను కొనుగోలు చేసి గొర్రెలకు ఇస్తున్నారు. కొన్నిసార్లు ఎన్ని మందులు ఇచ్చినా గొర్రెలు మృత్యువాత పడుతుండడంతో గొర్లకాపరులు మందులకు పెట్టిన డబ్బులు నష్టపోవడమే కాకుండా వారు చేసిన శ్రమ వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు గొర్రెలను పోషించుకునేందుకు బీడు భూములు చూపించి సరిపడు మందులను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎంతో కష్టపడినా అతనికి వచ్చే ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. గొర్రెలను మేపేందుకు ప్రభుత్వం స్థలం చూపించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ బీడుభూములు ఉంటే అక్కడ గొర్రెలను మేపుతున్నామని పలువురు తెలుపుతున్నారు. వరిపొలాల గట్లవద్ద గొర్రెలు మేపుతున్న సమయంలో పొలం యజమానులు ఎన్ని తిట్టినా ఓర్చుకొని తమ గొర్రెలను మేపుకుంటున్నట్టు తెలిపారు. గొర్రెలకు నల్లమబ్బు, చిటికెరోగం వంటి అనేక రోగాలు వచ్చి మృత్యువాత పడుతాయి. పశువైద్యాధికారులు అందుబాటులో ఉండి గొర్రెలకు చికిత్స చేయడమే కాకుండా సరిపడా మందులను ప్రభుత్వమే సరఫరా చేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంతంత మాత్రంగానే మందులు సరఫరా చేస్తున్నది. పొద్దంతా గొర్రెల వెంబడి తిరుగుతూ కాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడినా తమకు వచ్చే ఆదాయం తక్కువగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.