Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటి ప్రచారంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
డబ్బులు, పదవులు లక్ష్యంగా పూటకో పార్టీలు మారే అవకాశవాదులను ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని బాపూజీనగర్ ఎస్సీ కాలనీ ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులు, పూలదండలతో స్వాగతం పలికారు. ప్రతి గడపకూ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాజకీయాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. డబ్బు, మద్యం ప్రలోభాలతో ఓట్లను దండుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. డబ్బే లక్ష్యంగా పదవులు పొందొచ్చని భావిస్తూ అందులో భాగంగా ఓట్లను కొనే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. దీంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందన్నారు. ఐదేండ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటును అమ్ముకుంటే ఐదేండ్ల పాటు తమ జీవితాన్ని అమ్ముకున్నట్టేనని చెప్పారు. భావితరాలకు స్వచ్ఛమైన పాలన అందించే ప్రజాస్వామ్యవాదులను గెలిపిం చాలని కోరారు. నిత్యం ప్రజల కోసం పని చేసే నాయకులను ఎన్నికల్లో గెలిపించు కోవాలన్నా రు. నాలుగు దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని, మిగిలిన జీవితం కూడా ప్రజల కోసమే పని చేస్తానని హామీనిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా కృషి చేస్తానని చెప్పారు. తన హయాంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరోసారి ఆలోచిస్తే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా నన్నారు. ఇంటింటికీ మంచినీరందించి ప్రతి గ్రామం, ప్రతి వీధిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. అండర్గ్రౌండ్ డ్రయినేజీ పనులు పూర్తి చేస్తానన్నారు. ఇండ్లపై నుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ లైన్లను మారుస్తానన్నారు. మహిళా జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు పాటుపడ్తానన్నారు. నిరుపేదలకు ఇండ్లు ఇప్పిస్తానని హామీనిచ్చారు. ధనబలం, సేవాబలం మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు సేవ చేసే నాయకులకు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు తన గెలుపుకు సహకరించాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, కృపాకర్రెడ్డి, వస్కుల మట్టయ్య, మహ్మద్బీన్ సయీద్, మల్లు గౌతమ్రెడ్డి, ఘని, బావండ్ల పాండు, రాంమ్మూర్తి, దేశీరాంనాయక్, జూలకంటి సుజాత, కవిత, గాదె పద్మ, కుసుమ, అరుణ, గుంటోజు వీరాచారి, రాంరెడ్డి, సత్యనారాయణ, అంజద్ పాల్గొన్నారు.