Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఎస్పీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
క్రీడాకారులు క్రీడల్లో రాణించి గుర్తింపు తేవాలని జిల్లా ఎస్పీ ఎవి.రంగనాధ్ కోరారు. బీఎల్ఆర్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక ఎన్నెస్పీ క్యాంపులో తెలంగాణరాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల వల్ల గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యత వెలుగులోకొస్తుందన్నారు. ప్రపంచంలో క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఆదరణ వస్తుందన్నారు. క్రీడాకారులు పోటీల్లో రాణించాలని కోరారు. క్రీడల వల్ల క్రీడాకారుల్లో స్నేహాభావాన్ని పెంపొందిస్తాయని, శారీరక దారుడ్యం, మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. అనేక శాఖల్లో ఉద్యోగాలు పొందే అవకాశముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగన్నాధరావు, డీఎస్పీ శ్రీనివాస్, నిర్వాహకులు బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి. కర్తయ్య, జిల్లా చైర్మన్ డి. శ్రీనివాస్, టోర్నమెంటు చైర్మన్ బి. కృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ దోసపాటి శ్రీనివాస్, సీఐలు సదా నాగరాజు, శ్రీనివాసరెడ్డి, రమేశ్బాబు, శ్రీకృష్ణ కబడ్డీ క్లబ్ సభ్యులు ఆంజనేయులు, నరేందర్, యువసేన నాయకులు అనిల్, వినరు, కిరణ్, రవి పాల్గొన్నారు.