Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ వీడుతున్న ఆశావహులు
- కాంగ్రెస్లో వీడని సస్పెన్స్
- తుంగతుర్తిలో వేడెక్కిన రాజకీయం
- బీజేపీకి రెబల్స్ పోటు..!
నవతెలంగాణ-యాదాద్రిభువనగిరి ప్రతినిధి
కేసీఆర్ ఓటమి లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో అసంతృప్తుల సెగలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. మిత్రపక్షాలకు మెండి చెయ్యి ఇచ్చిన కాంగ్రెస్పై భాగస్వామ్యపక్షాల గుర్రు చల్లారడం లేదు. భాగస్వామ్యపక్షాల్లో ఉన్న ఆశవాహుల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లడంతో సొంత పార్టీలను వీడి పక్కపార్టీకి వలసెల్లుతున్నారు. ఇప్పటికే ఆలేరులో తెలంగాణ జనసమితి నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ఆపార్టీకి రాజీనామా చేసి బహుజన సమాజ్పార్టీ గూటికి చేరి అక్కడి నుంచి బీ-ఫాం తీసుకొని ఎన్నికల బరిలోకి వచ్చారు. ఇది కూటమికి కొంత మేరకు మైనస్ కానుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని తుంగతుర్తి స్థానం అభ్యర్థిత్వాన్ని తేల్చకపోవడంతో ఇక్కడ ఆశవాహులైన అద్దంకి దయాకర్, డాక్టర్వడ్డెపల్లి రవి అనుయాయుల్లో అందోళన తీవ్రతరమైంది. తన పేరు ఎందుకు పెండింగ్ పెట్టారో అర్ధమవ్వడం లేదని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో దయాకర్ అందోళన చెందారు. నేడు విడుదల చేసే జాబితాపై పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠత వల్ల తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇదీలా ఉండగా ఆలేరు కమలం పార్టీలో ఆసమ్మతి జ్వాలాలు బయటకొచ్చాయి. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి దొంతిరి శ్రీధర్రెడ్డికి రె'బెల్' పోటు ఎదురవుతోంది. బొమ్మలరామారం మండల ప్రధానకార్యదర్శి ఫక్కీర్ రాజేందర్రెడ్డి బీజేపీ రెబల్ అభ్యర్థిగా శుక్రవారం ఆలేరులో నామినేషన్ దాఖలు చేశారు.
పెండింగ్ స్థానాలపై వీడని సస్పెన్స్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాకూటమి పక్షాలైన సీపీఐ, టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలకు కాంగ్రెస్ మొండి చెయ్యి చూపించింది. 12 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయడానికి తీవ్ర కసరత్తు చేసింది. ఇప్పుడు ప్రకటించిన 9 స్థానాలతో పాటు పెండింగ్లో ఉన్న మూడు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. ఇందుకోసం అభ్యర్థుల ఎంపికపై తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. పెండింగ్లో ఉన్న మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆశవాహుల మధ్యన తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు తమ వ్యూహాంలో భాగంగానే రెండు జాబితాల్లో ప్రకటించకుండా పెండింగ్లో పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తుగా ప్రకటించడం వల్ల అసంతృప్తి జ్వాలాలు ఎగిసిపడి టీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే కాంగ్రెస్ పెద్దలు నాన్చుడి దోరణి అవలంబిస్తున్నట్టు పరిస్థితులను బట్టీ అవగతమవుతోంది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, వడ్డెపల్లి రవి మధ్యన టికెట్ పోరూ హోరాహోరీగా సాగుతోంది. ఇద్దరి అనుచరులు తమ నాయకుడికి టికెట్ ఇవ్వాలని అందోలనకు దిగుతున్నారు. పోటా పోటీగా సెల్టవర్లు ఎక్కి నిరసన తెలుపడంతో అధిష్టానం అలోచనలో పడింది. ఎవ్వరికి టికెట్ ఇస్తే గెలుస్తారో.. వారికే టికెట్ ఇవ్వాలన్న ఆలోచన చేసిన అధిష్టానం మరో సారి నిఘా బృందాలతో సర్వే చేయించినట్టు సమాచారం. ఇందులో ఉత్తమ ఫలితాలు వచ్చిన వారి పేరును జాబితాలో పొందుపరిచి టికెట్ దక్కని అభ్యర్థిని ఢిల్లీకి పిలిపించి బుజ్జగించే ప్రయత్నం చేస్తోన్నారు. మిర్యాలగూడ స్థానాన్ని తెలంగాణ జనసమితికి కేటాయించకుండ కాంగ్రెస్కు ఇవ్వాలని సీఎల్పీ నేత జానారెడ్డి ఒక వైపు పావులు కదుపుతుండగా మరో వైపు ఆయన తనయుడు ఢిల్లీకి వెళ్లి శుక్రవారం రాహూల్ను కలువడం రాజకీయ చర్చకు దారి తీసింది. తనకు టికెట్ ఇస్తే గెలిచి వస్తానన్న భరోసాను రాహుల్కు వివరించినట్టు చెప్పారు. మిర్యాలగూడలో టీజేఎస్, కాంగ్రెస్ మధ్యన సీటు పంచాయతీ షురూ అయ్యింది. అలాగే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన అలుగుబెల్లి అమరేంద్రెడ్డి సైతం ఉత్తమ్ను కలిసి తనకు టికెట్ ఇప్పించాలని వేడుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేవరకొండలో సైతం ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు. బిల్యానాయక్ టికెట్ కోసం రేవంత్రెడ్డి ద్వారా ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. బాలునాయక్ జానారెడ్డి, ఉత్తమ్ల ద్వారా టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగన్లాలు కూడా తనకున్న పలుకుబడితో టికెట్ కోసం అధినేతలపై ఒత్తిడి పెంచారు. మూడు స్థానాల అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. నేడు అధికారికంగా వెలువడే జాబితాలో చోటు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణులతో పాటు వారి అనుయాయుల్లో నెలకొంది.
బీజేపీకి రెబల్స్ పోటు
జిల్లాలో బీజేపీ పార్టీకి రెబల్స్ పోటు బెడద పెరిగింది. ఆలేరు అభ్యర్థి దొంతిరి శ్రీధర్రెడ్డిపై ఆసమ్మతి గళం వినిపించిన పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మలరామారం మండలంకు చెందిన ఫక్కీరు రాజేందర్రెడ్డి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పార్టీ పెద్దలకు తలనొప్పి మొదలైంది. నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీలో ఇద్దరు పోటీ చేయడం వల్ల ఓట్ల శాతం తగ్గిపోయి నవ్వేటోడి ముందు కాలు జారి పడిన చందంగా తమ పరిస్థితి ఉంటుందన్న ఆందలోన నాయకత్వంలో ఏర్పడింది. రెబల్ అభ్యర్థిని బుజ్జగింపులు చేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. చర్చలు ఫలించి రాజీ పడితే సరేసరి లేకుంటే పార్టీ నుంచి బహిష్కరించాలన్న నిర్ణయానికి జిల్లా కమలం పెద్దలు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భువనగిరి స్థానాన్ని పొత్తుల్లో యువతెలంగాణ పార్టీకి కేటాయించినట్టు పార్టీ పెద్దలు జిల్లా నాయకత్వానికి వెల్లడించారు. ఏకపక్షంగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై కాషాయవాదులు భగ్గుమంటున్నారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శివసేన హిందుత్వ పార్టీ నుంచి భువనగిరి బరిలోకి వ్యాపారవేత్త పబ్బ ఉపేందర్గుప్తను హిందుత్వశక్తులు రంగంలోకి దింపారు. గుప్తకు బహిరంగంగా మద్దతు ప్రకటించి కూటమికి బీటలు వేశారు. ఇప్పుడు ఈ సమస్య బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. క్షేత్ర స్థాయిలోని క్యాడర్తో పాటు జిల్లా నాయకత్వం సైతం యువతెలంగాణ పార్టీకి మద్దతు ఇవ్వమని అధిష్టానం ముందు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని పుణసమీక్షించుకోలేదు. దీంతో వారి నిర్ణయానికి చెక్పెట్టే విధంగా హిందుత్వ శక్తులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఉపేందర్గుప్తను శివసేన పార్టీ నుంచి బరిలోకి దింపి కమలం పెద్దలకు షాక్ ఇచ్చారు.