Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులు రూ.కోట్లు ఖర్చు చేయాల్సిందేనా...!
- ఈసీ రూల్స్ బేఖాతర్
- ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం
- ఫలితాలు తారుమారు చేయనున్న డబ్బు
- సీ-విజిల్ యాప్తో కట్టడి
- రూ.1.53,53లక్షలు, 16340 లీటర్ల లిక్కర్ సీజ్
నవతెలంగాణ-క్లాక్టవర్
ప్రస్తుతం ఏ ఎన్నికలు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానంగా మారింది. ఎంత పలుకుబడి ఉన్నా, ఎన్ని పనులు చేసినా డబ్బు ఖర్చు చేయనిదే ఓట్లు పడవన్న అభిప్రాయం అటు అభ్యర్థులు, ఇటు ఓటర్లలో నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుండి డబ్బు, మద్యం ప్రభావితం చూపుతుంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంచడంతోపాటు ప్రచారం చేసిన వారికి బిర్యాని, మందు ఇవ్వాల్సి రావడంతో ఖర్చు తడిసి మొపేడవుతుందని కొంత మంది అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. నల్లగొండ జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలుండగా అందులో రెండు రిజర్వుడు, నాలుగు జనరల్ స్థానాలున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉండడంతో డబ్బు పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని పరిస్థితులను బట్టిచూస్తే అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలువాలంటే 5 నుంచి 10శాతం ఓట్లే ప్రభావం చూపనున్నండడంతో ఆ ఓట్లను డబ్బు, మద్యంతో కోని ఫలితాలు తారుమారు చేస్తున్నారు. ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల కమిషన్ గట్టి నిఘా పెట్టిన కూడా ఖర్చు మాత్రం కోట్ల రూపాయలు దాటుతుంది. 2009 ఎన్నికల నుంచి జిల్లాలో ఖర్చు భారీగా పెరిగింది. అప్పటి నుంచే డబ్బు పంపిణీ చేసే సంస్కృతిరాగా 2014 ఎన్నికల తరువాత డబ్బు, మద్యం ప్రభావం విఫరీతంగా పెరిగింది. ప్రచారానికి, సభలకు ప్రజలను తరలింపు వద్ద నుండి డబ్బు పంపిణీ మొదలైంది.
ఇప్పటికే రూ.1,53,53 లక్షలు, 16340 లీటర్ల లిక్కర్ సీజ్...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు మించరాదని ఎన్నికల కమిషన్ నిబంధనలు పెట్టింది. అయితే ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు మాత్రం కోట్లలో ఉంటుందనేది బహిరంగ రహస్యమే. గతంలో కులాలు, సంఘాల వారీగా డబ్బు పంపిణీ చేయగా ప్రస్తుతం ఓటర్ల వారీగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో రూ.2.95కోట్ల డబ్బులు, 14,228.85 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికే రూ.1.53,53 లక్షల డబ్బు, 16340 లీటర్ల లిక్కర్ను సీజు చేయడం జరిగింది. ఏది ఏమైనా కనీసం రూ.50కోట్లు అయినా ఖర్చు చేయనిదే గెలుపొందడం కష్టమనే భావనలో అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది.
ఈసీ నిబంధనలు బేఖాతర్...
ఎన్నికల కమిషన్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోటీసులు ఎంత నిఘా పెట్టిన కూడా వారి కండ్లు కప్పి డబ్బు, మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. చెక్పోస్టులు, సీసీకెమెరాలు, ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు చేస్తున్నా అభ్యర్థులు మాత్రం ఎదోరకంగా డబ్బు, మద్యాన్ని రవాణా చేస్తునే ఉన్నారు. కొందరూ ముందుగానే తమకు నమ్మకమైన వ్యక్తుల వద్ద డబ్బు, మద్యాన్ని సరఫరా చేసినట్టు సమాచారం.
సీ-విజిల్ యాప్తో కట్టడి...
ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చులను కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్ నూతన సాంకేతికతను వినియోగిస్తుంది. సీ-విజిల్ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించి డబ్బు, మద్యం పంపిణీ చేస్తే ఈ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ ఏడాది ఎన్నికల్లో నిజాయితీగా ఓటు వేయాలని, ప్రలోభాలకు గురికావద్దని పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్లు, టీవీలలో యార్డ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్న కూడా ఓటర్లలో మార్పు రావడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.