Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బట్టుగూడెం, కుంకుడుచెట్టు తండాలో టీఆర్ఎస్ రెబల్స్ బెడద
- టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజాప్రతినిధుల సభలు, సమావేశాలు
నవతెలంగాణ-పెద్దవూర
ఎన్నికలు ఏవైనా ఒక్క ఓటు తేడాతోనే ఫలితం తారుమారవుతోంది. అంతా అయిపోయాక నాలుగు ఓట్లు వస్తే ఫలితం మా వైపే ఉండేదని ఓడిన అభ్యర్థులు మదన పడుతున్నారు. 20 ఓట్ల తేడాతో ఓడిన వారైతే మరో 12 ఓట్లు తెచ్చుకుంటే గెలుపు నాదయ్యేదిగా..ఎక్కడ మనకు మైనస్ అయ్యిందంటూ లెక్కలు వేసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. గత పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 179 గ్రామపంచాయతీలుండగా ఇప్పటికే 31 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 148 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25న ఎన్నికలు జరగనున్న సందర్భంగా ప్రతి ఓటు కీలకమనే భావనతో బరిలోనున్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఓటు పోయినా..ఫలితం తారుమారయ్యే అవకాశముండటంతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొనిపోయేందుకు అందరికీ తాయిలాలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో కొన్ని పంచాయతీల్లో రెబల్స్ బెడద ఉంది. ముఖ్యంగా పెద్దవూర మండలంలోని బట్టుగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థులు నలుగురు, కుంకుడుచెట్టుతండాలో టీఆర్ఎస్ అభ్యర్థులు ముగ్గురు బరిలో ఉండడంతో వారందరికి నచ్చజెప్పేందుకు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలతో సంప్రదింపులు చేస్తున్నారు.
ఓటు సమానమైతే టాస్..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులకు సమానమైన ఓట్లు వేస్తే తిరిగి రీ-కౌంటింగ్ చేస్తారు.అప్పుడు కూడా ఇద్దరి ఓట్లు సమానమైతే టాస్ పద్ధతిలో విజేతను ప్రకటిస్తారు.టాస్ అనుకూలంగా ఎవరికి వస్తే వారు విజేతలవుతారు. పెద్దవూర మండలంలో 26 గ్రామపంచాయతీలకు గాను ఇప్పటికే నాలుగు పంచా యతీలు ఏకగ్రీవమయ్యాయి. 22 పంచాయతీల్లో ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గ్రామ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే తాము గెలిస్తే చేపట్టబోయే పనులు ప్రజలకు వివరిస్తున్నారు.బరిలోనున్న అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తును చూపిస్తూ ప్రచారంలో నిరక్షరాస్యులు, వృద్ధులకు అర్థమయ్యేలా తమ గుర్తులను చూపిస్తూ ఓట్లు అడుగుతున్నారు.
పతుల కోసం సతులు..సతుల కోసం పతులు
పోటీలోనున్న అభ్యర్థులు పతులున్న చోట సతులు..సతులున్న చోట పతులు ఇంటింటికీ తిరుగుతూ బొట్టు పెడుతూ తమ భర్తలకే ఓటేయాలని..తమ వారినే గెలిపించాలని గ్రామాల్లో అధికంగా మహిళలు రోడ్డెక్కి ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్ చేసి పల్లెలకు రానుపోను ఖర్చులు కూడా తామే భరిస్తామని, ఓటేసి వెళ్లాలని తమ బంధువులకు, స్నేహితులకు అందరికీ ఫోన్ల ద్వారా సమాచారమందిస్తున్నారు. దీంతో పెద్దవూర మండలంలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ నెల 25న జరిగే ఎన్నికల్లో సర్పంచ్ పదవులు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే.