Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని కుంకుడుచెట్టుతండాలో శుద్ధి చేసిన మిషన్ భగీరథ జలాలు వృథాగా వరదలై ప్రవహిస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని మిషన్ భగీరథలో భాగంగా కుంకుడుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని తిరుమలనాధస్వామి గట్టు మీద 60 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంకును రూ.15 లక్షలతో నిర్మించారు. అక్కడ్నుంచి మిషన్ భగీరథ జలాలు కుంకుడుచెట్టుతండా, బోనూతల గ్రామాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కుంకుడుచెట్టుతండాలోని హాలియా-సాగర్ ప్రధాన రహదారిపైనున్న మినీ వాటర్ట్యాంకులోకి పంపిణీ చేసే పైపులైను పగిలి వరదలై గేట్వాల్ వద్ద లీకై నీరంతా వృథాగా రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో గ్రామంలో చివరి ఇండ్లకు తాగునీరందక చేతిపంపుల నీరు తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా చలకుర్తి గ్రామంలోని మెయిన్సెంటర్లో శుద్ధి చేసిన కృష్ణాజలాలందించే పైపులైన్కు నల్లా లేకపోవడంతో నీరంతా నిరంతరంగా వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది. వచ్చేది వేసవికాలం కావడంతో నీటి వృథాను అరికట్టి అందరికీ నీరందేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.