Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని పినవూర నుంచి నెమలిపురి వరకూ ఉన్న ఈ రహదారి రైతులకు నరకప్రాయంగా మారింది.పినవూర గ్రామ రైతులు ప్రతి నిత్యం ఈ దారిలో తమ వ్యవసాయ పనులకు వెళ్తుంటారు.ఈ క్రమంలో మోకాల్లోతు నీటిలో నరకయాతన పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే నడుములోతుకు పైగా నీళ్లు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో క్రిమిసంహారక మందులు, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు తీసుకెళుతుంటారు. ఈ క్రమంలో అనేకసార్లు జారి కింద పడి ప్రమాదాలు జరిగాయి. అదే విధంగా నెమలిపురి నుంచి పినవూరకు దూరం తక్కువ ఉంటోంది. నెమలిపురి వెళ్లాలంటే పినవూర నుంచి మూడు కిలోమీటర్ల దూరం వస్తోంది. చుట్టూ తిరిగి నెమలిపురి వెళ్లాలంటే పది కిలోమీటర్లకు పైగా దూరం ఉంటోంది. ఈ రహదారి వెంట పినవూర గ్రామ సమీపంలో కల్వర్టు ఏర్పాటు చేసి అదే విధంగా నెమలిపురి గ్రామ సమీపంలో మరో చిన్న కల్వర్టు నిర్మాణం చేపడితే రహదారి రైతులకు ఉపయోగంగా ఉంటోంది. అంతేకాకుండా నెమలిపురి వాసులకు కూడా దూరం తగ్గుతోంది.కల్వర్టులు ఏర్పాటు చేయకపోవడంతో ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షాకాలమైతే నడవటానికే వీల్లేకుండా ఉంటోంది. వేసవికాలంలో కూడా మోకాల్లోతు నీరు చేరి రైతులు అవతలకు, ఇవతలకు వెళ్లడానికి వీలు పడకుండా ఉంది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు మినహా ఏ వాహనం కూడా బయటికెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే కొంతమంది రైతులు ట్రాక్టర్ల మీద నీళ్లల్లో వ్యవసాయ పనిముట్లు తీసుకెళుతుంటారు. ఏ వాహనాల్లేని రైతులు మాత్రం మోసుకెళ్లాల్సిందే. ఈ పరిస్థితిల్లో ఏమాత్రం కాలుజారినా వాగులో పడిపోవాల్సిందే. గతంలో చాలా మంది ఈ ప్రాంతంలో కింద పడి ఆస్పత్రి పాలైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ దారిలో రెండు చిన్న కల్వర్టులు పూర్తయితే ఈ రెండు గ్రామాలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నెమలిపురి నుంచి కోదండాపురం, రంగారెడ్డిగూడెం వరకూ వెళ్లడానికి కేవలం మూడు, నాలుగు కిలోమీటర్ల దూరమే అవుతోంది. అధికారులు వెంటనే ఈ రహదారిపై కల్వర్టు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పినవూర, నెమలిపురి గ్రామస్తులు కోరుతున్నారు.
వర్షాకాలం వస్తే కష్టంగా ఉంటోంది
కసిరెడ్డి కృష్ణారెడ్డి, పినవూర
వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారిలో పోదామన్నా..భయంభయంగా వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. గతంలో నేను రెండుసార్లు కింద పడి దెబ్బలు తగిలాయి. మా పొలాలు అటు వైపు ఉండటంతో తప్పని సరిగా వెళ్లాల్సి వస్తోంది.
వర్షాకాలమొస్తే నరకమే
తేరా పాండు, పినవూర
వర్షాకాలం వచ్చిందంటే నడుములోతుకు పైగా నీళ్లు వస్తుంటాయి. నీటి వరద తగ్గేంత వరకూ చేదు పనులకు వెళ్లేదే ఉండదు. ఒక్కోసారి వారం పది రోజుల వరకూ నీటి వరద తగ్గదు.పది రోజుల తర్వాత చేనుకెళ్లి చూడగా పొలాలకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.వెంటనే రహదారిపై కల్వర్టును ఏర్పాటు చేసి తమ ఇబ్బందులను తొలగించాలి.