Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ్ శాసన సభకు రాజీనామా చేయాలి
- నల్లగొండలో చెల్లని పైస ..భువనగిరిలో కూడా చెల్లదు
- సంపూర్ణ మెజార్టీతో టీఆర్ఎస్ ఎంపీ గెలుపు ఖాయం
- విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ ప్రతినిధి
కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నల్లగొండ కరిగిపోతున్న మంచుకోటగా ఏర్పడిందని, టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ పార్లమెంట్ స్థానం గెలుస్తానాన్న ధైర్యం దమ్ము ఉంటే తన శాసన సభా సభ్యత్వానికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం జిల్లా కేంద్రంలో లక్ష్మీగార్డెన్లో నల్లగొండ అసెంబ్లీ విస్తృత కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసి గెలుస్తామన్న ధైర్యం కాంగ్రెస్ అభ్యర్థులకు లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్లగా ప్రగల్భాలు పలుకు తున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు లేక గత అంసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను బరిలో దింపుతున్నారన్నారు. నల్లగొండ శాసన సభ స్థానం నుండి పోటీచేసి ఓటమి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి పార్లమెంటు స్ధానంలో పోటీచేస్తుండు... ఇక్కడ చెల్లని పైస అక్కడ ఎలా చెల్లుతుందని ఎద్దేవా చేశాడు. 20ఎండ్లుగా నల్లగొండ ప్రజలను మోసం చేసి కొత్త ప్రాంతానికి మకాం మార్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అక్కడి ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి తొలి మెట్టు అన్నారు. 4వేల మోగా వాట్ల అల్ట్రా పవర్ ప్లాంట్ , ఎస్ఆర్పీఎస్ ప్రాజెక్టు, దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు పాలమురు డిండి ప్రాజెక్టు, జాతీయ రాహదారులు , రెండు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చామన్నారు. 20ఎండ్లు అభవృద్ధికి నోచని నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చిగురిస్తుందన్నారు. రాబోయే కాలంలో ఎక్కు నిధులు తీసుకొచ్చి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర అటవి శాఖ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లెపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యాదర్శి చాడా కిషన్రెడ్డి పాల్గొన్నారు.